పుస్తకము



సనాతన ధర్మములు
మరియు   
  పరమేశ్వర పూజ





ఎందుకు?              ఎలా?               ఎప్పుడు?


పుస్తక ప్రసాదము

సేకరణ, సంకలనము
పుష్పగిరి. కులశేఖర్,
చంద్రగిరి
9440006853.

సనాతన ధర్మములో పూజా విధి.
ప్రధమ ముద్రణ          :   2012.

ప్రచురణ                   :  పుష్పగిరి. వరలక్ష్మి,
                             :  w/o పి. కులశేఖర్,
                             :  ఇంటి నం. 1/128-1,
                             :  భవానీ నగర్, క్రొత్తపేట,
                             :  చంద్రగిరి. 517 101.

మూల్యం         :  అమూల్యం.
ప్రతులకు
పుష్పగిరి పునీత్,
S/O  పుష్పగిరి కులశేఖర్,
ఇంటి నం. 1/128-1,
భవానీ నగర్, క్రొత్తపేట,
చంద్రగిరి. 517 101.
సెల్ నంబరు. 9440006853. 
email ID:kulasekharp.cdr@gmail.com 
                   

అంకితం

                    నాకు జన్మనిచ్చిన మా తల్లితండ్రులు, మా తల్లిగారు కీ||శే|| శ్రీమతి పుష్పగిరి. పెద్ద రామానుజమ్మ, మా తండ్రి గారు కీ||శే|| శ్రీ పుష్పగిరి. శ్రీనివాసయ్య గారు, మరియు ఎకోదరులమైన మా అన్నగార్లు మా పెద్ద అన్నగారు కీ||శే|| శ్రీ పుష్పగిరి. వేణుగోపాలయ్య గారు, కీ||శే|| శ్రీ పుష్పగిరి. మునికృష్ణయ్య గారు కీ||శే|| శ్రీ పుష్పగిరి. చక్రపాణి గారు వీరందరి  జ్ఞాపకార్థము ఈ చిరు పుస్తకమును వ్రాయవలయనను సత్సంకల్పమును, కల్పించి అనుగ్రహించి ఎన్నో తెలియని విషయములను ఎరుకలోనికి తెచ్చిన, మాస్వామి  మా ఇలవేలుపు, మము కన్న మా తండ్రి, మా ఇంట కొలువువై, మమ్ము  ఎల్లవేళలా కంటికిరెప్పలా కాచుచున్న మా తండ్రి, శ్రీరామచంద్ర ప్రభువుల  పాదపద్మములకు సవినయముగా, సాంజలి బంధకముగా, కరములోడ్చి వారి పాదములకు శిరస్సు తాకించి ప్రణిపాతము చేయుచూ, వారి పాదపద్మములకు ఈ చిరు పుస్తకమును అంకితము చేయుచున్నాను.               
పుష్పగిరి.కులశేఖర్

ముందుమాట

       మా గురువుగారు పూజ్యపాదులు, ప్రాతఃస్మరణీయులు, కరచర ణాదులతో నడయాడే, దేవుడు, అపర సరస్వతీ మానసపుత్రులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. వారి దివ్యశుభాశీస్సులతో మా పూజ్యపాద గురువు గారి ప్రవచన వాగ్రూపమునకు, మరి కొంతమంది, పూజ్య పాదులైన స్వామీజీల, పీటాధిపతుల, మఠాధిపతుల, అనుగ్రహ భాషణములకు మరియు  ప్రవచనములకు, యధాశక్తి అక్షర రూపము నిచ్చి, సనాతన ధర్మముల పట్ల, సనాతన ఆచారములపట్ల, భగవంతుని పట్ల, వేదముల పట్ల, పురాణేతిహాసముల పట్ల, ఉపనిషత్తుల పట్ల గౌరవ విశ్వాసములున్న ఆత్మబంధువులకు, ఆసక్తులకు, జిజ్ఞాసులకు, ముముక్షువులకు  నిత్యమూ వారివారి గృహములలో, యధా శక్తి పూజాది కార్యక్రమము లను చేసుకొను చున్న భక్తవరేణ్యులకు, ఈ చిరు పుస్తకమును ఉచితముగా నిచ్చి, తద్వారా ఆ భక్తవరేణ్యులకు మా గురువుగారి మరియు స్వామీజీల,  ప్రవచనముల సారము నిత్య జీవనములో, ధర్మానుస్ఠానము నకు పూజాది కార్యక్రమములకు, సహాయకారి కాగలదని, తెలియని విషయములు ఏదైనా ఉంటే తెలుసుకొని వేదప్రోక్తమైన పూజావిధికి, ధర్మవర్తనకు మార్గము చూపగలదని విశ్వసిస్తూ చేయు, నా ఈ చిన్ని ప్రయత్నమును వేదవిదులు, భక్తాగ్రగణ్యులు ఆసక్తులు, జిజ్ఞాసులు సహృదయముతో స్వీకరించి, నా ఈ చిన్నిప్రయత్నమును ఆశీర్వదింతురని, ఇందు దోషములున్న, తల్లి తన బిడ్డ తప్పులను, మన్నించు రీతిలో మన్నింతురని, మనః పూర్వకముగా, త్రికరణ శుద్ధితో, శిరస్సు వంచి నమస్కరించు చున్నాను.

పుష్పగిరి. కులశేఖర్.





“ఒరులే యవి యొనరించిన నర
వర అప్రియము తనమనంబునకగు తా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మపథములకెల్లన్.”      
   ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధకలుగు తుందో,అలాంటి పనులు,  ప్రవర్తన, మనము ఇతరులపట్ల ప్రవర్తించ కుండా, చేయకుండా  ఉండడముకంటే  గొప్పధర్మము వేరొకటిలేదు.
కృతజ్ఞతలు
                        ఈ చిరు పుస్తకములో సనాతన ధర్మముల, ధర్మవిషయముల కొరకు పూజాది క్రతువు విషయముల కొరకు నేను వాడుకున్న సమాచారములను విషయములను, అందించిన పత్రికలకు, రచయితలకు, వ్యక్తులకు, సంస్థలకు, ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనా దురంధరులకు ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలకు శిరస్సు వంచి సాంజలి బంధకముగా ప్రణిపాతము చేయుచున్నాను.

పుష్పగిరి. కులశేఖర్.
      

 సరైన అవగాహనలేని నాకు, మా అన్న గార్ల జ్ఞాపకార్థము ఏదో చేయాలి  ఏమి చేయాలి, ఎలా చేయాలి, అని ఆలోచనలో నున్న నాకు  తెలియని ప్రేరణనిచ్చి ఎన్నో తెలియని విషయములను నా  ఎరుకలోనికి తెచ్చి ఈ చిరుపుస్తకమునకు పూనికనిచ్చి ఆశీర్వదించిన నాతండ్రి, నా స్వామి నా  ఆరాధ్యదైవము శ్రీ రామచంద్రప్రభువు.  ముద్రించుటకు DTP work ను  పూర్తి చేసిన మా పిల్లలు చి|| హర్షిత, చి||పునీత్, చి||పూజిత మరియు నా సద్ధర్మ పత్ని శ్రీమతి పుష్పగిరి వరలక్ష్మికి మరియు స్నేహితుడు శ్రీ పి.గోపి గారికి, మరియు సకాలములో చక్కటి సలహాలు అందించి ప్రోత్సహించిన మా సహోదరి శ్రీమతి బందరు. లక్ష్మి (కణ్ణక్క) గారికి, శ్రీ బ్రహ్మదేశం. రాజేంద్ర ప్రసాద్ గారికి, మిత్రులు శ్రేయోభిలాషి శ్రీ డి. ఓబుల్ దాస్ గార్లకు మరియు నా సహోద్యోగి శ్రీ KSLN మూర్తి, కడప, గార్లకు, ఈ పుస్తక ప్రచురణకు సహాయ సహకార ములందించిన శ్రీ S.R కులశేఖర్ గారికి, శ్రీ వేలవేటి. బాలకృష్ణ గారికి మరియు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహకరించిన   బంధు-మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియ చేసుకొనుచున్నాను.        
పుష్పగిరి. కులశేఖర్.  
 చంద్రగిరి.
Cell No. 9440006853

పుస్తక సమీక్ష
     శ్రీ పుష్పగిరి కులశేఖర్ గారు వ్రాసిన “ సనాతన ధర్మములు, పరమేశ్వర పూజ ” అనే ఈ చిన్ని పొత్తములో సాధారణ మానవుని మొదలుకొని పండితులకు, ముముక్షువులకు, వైదిక బ్రాహ్మణోత్తములకు, అర్చక స్వాములకు, పురోహితులకు ఉపయుక్తమైనది. పూజా విధానములో ప్రతి గృహస్తుడూ తెలుసుకో తగ్గది. అయితే ఇది సంకలనమే కావచ్చు, ఒక్కొక్క అంశమునకు గల అర్ధములో విశిదపరచడం వలన పరమార్ధం సిద్ధించగలదు. భూమి పూజ, దీపం, నైవేద్యం, ఇత్యాదివాటికి అర్ధం తెలిసి చేస్తే ఫలసిద్ధి సులభం.
శ్రీ కృష్ణుడు వెన్నదొంగ అని అందరూ విన్నదే. సినిమాలలో కన్నదే. వారు చిత్త చోరులు, మానస చోరులు, మనము ఆ పరమాత్మపై ధ్యాస ఎల్లవేళలా ఉంటే, వారు మనకు వశులు. ధ్యాసే ధ్యానము. వెన్న నైనను ఎక్కడ దొంగిలించాడు? తన భక్తురాడ్రైన గోపికల ఇండ్లలోనే. మన మనస్సు వారికి అర్పించితే, దానికి పరమాత్ముడు మనకు వశుడైపోతాడు. ఇది ప్రస్ఫుటంగా రచయిత పేర్కొన్నాడు.
యుగములు, వేదములు, పురాణములని “ లిష్టు ” గా వ్రాశారు. ఇవిఉన్నాయి అని యైన ఆధునికులకు తెలియాలి కదా! నవవిధ భక్తివిధములు మనకు తెలిసినవే, సాయి సచ్చరిత్రలోను, గీతా వ్యాఖ్యలలోను వున్నవే. ఎవరికి ఏరీతిగా అనుకూ లము గానుండునో ఆ రీతిగా సేవించవచ్చు. భక్తితోగాని, వైరముతోగాని భగవన్నామ స్మరణ చేయడంలో మోక్షప్రాప్తి. భగవంతుడు ఎంత దయామయుడో చూడండి. గంగలో జారిపడినా గంగాస్నాన ఫలమబ్బును! భక్తుని వందనము భగవంతునికి బంధనము.    
త్రి మతాచార్యులు అంటే అందఱకు తెల్సు. అదిగురువు శ్రీ శంకరాచార్యులు ఉపనిషత్తులలో కఠోపనిషత్తు ఒకటి. దీనిలో నచికేతునికి యమధర్మరాజుకు మధ్య జరిగిన సంభాషణమున్నది. మనకు యధర్మరాజు అంటే భయం. ఈ భయం మనకు నిజముతెలియకనే. కానీ వారు సమవర్తులు. మహాజ్ఞానసంపన్నులు. అక్కడక్కడ వారు “మరణ రేఖ” గీత దాటాల్సివచ్చింది! దానికి వారంతటవారు కారకులుకారు. పతివ్రతామతల్లియైన సతీసవిత్రి పాతివ్రత్యము, మార్కండేయుని “శివభక్తి” గీత దాటింపజే సినవి. అదీ లోకానికి పతివ్రతాధర్మము గొప్పది, స్త్రీలకు అది ఛాలునని, “భక్తి” బ్రహ్మవ్రాతను మార్చగలదని పరమేశ్వరుడు తెలియచెప్పడానికి. ప్రజలు ధర్మవర్తనలుగా నుండుటకే.
ఇకపోతే మృత్యువు, శరీరము నశించుట, ఇవి ప్రకృతి ధర్మములు. ఇవి వేదపండితులు, పురోహితులు, శవయాత్ర విషయములో తెల్సుకోతగ్గవి. అసలే ఆత్మీయులు మరణముతో శోకతప్తులైనవారికి ఈ శవసాగుదలలో తీసుకోవాల్సిన చర్యల నిబ్బరం వారికి రాదు.
సాక్షి చిత్రగుప్తుడన్నారు. కరెక్టు. నేను సర్వాంతర్యామి యైన పరమేశ్వరుడు సాక్షీభూతుడంటాను. చిత్రగుప్తుడు యమధర్మరాజు గారి లేఖకుడు. వీరు పరమేశ్వరునిచే నిర్ణ యింపబడిన మినిస్టర్సు లాంటివారు. వారి పోర్టీఫోలోయోలు అవి! అందువలన మనమేపనిచేసిననూ ప్రత్యక్ష సాక్షీభూతుడు ఆ పరమేశ్వరుడని తెలుసుకొని సమ్యగ్ జీవనము సాగించి, ఈ ఆగామి కర్మఫలమే రాబోయే జన్మకు సంచితము కాగలదు. తస్మాత్ జాగ్రత్త.! “దేనినివిత్తువో దానిని కోయుదువు” అని పవిత్ర బైబిలిలోని సువార్త.
ఇక చిట్టచివరిది, నేటి సమాజాన్ని పీడిస్తున్న సమస్య “వృద్దులైన తల్లితండ్రుల సమస్య” శ్రీ కులశేఖర్ గారు దీన్ని తమ సంకలన సనాతన ధర్మములో జోడించడం చాల హర్షణీయం. “ధర్మపథంలో నడవాలంటే, నిలబడవలెనంటే నాన్నమ్మలు, అమ్మమ్మలు ఉండితీరాలి”  అని కులశేఖర్ గారు వ్రాశారు. ఎక్కడిధర్మము, ఎక్కడిన్యాయము; ఉద్యోగ అహంభావముతో, ధనమదంతో కన్నుమిన్నుగానని సుపుత్రులు ఎందరున్నారో లెక్కింపతరంగాదు. అట్టివారు చేసే తీర్థయాత్రలు, పూజాదికములు, హోమములు నిరర్ధకములే. తల్లితండ్రులు ప్రత్యక్ష దైవాలని మరచి, జ్ఞ్యాన శూన్యులై తమభార్య, పిల్లలపైన చూపే అసక్తిలో రావ్వంతైనా తల్లితండ్రులపై జూపే పరిస్థితి లేదు. అందుకే వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి. కని, పెంచి విద్యా బుద్ధులు నేర్పి, ఇంతవాడిని అంతవాడినిగా చేసిన తల్లితండ్రులు నిరాదరణకు గురియై, మనోవేదనతో బయటికి చెప్పుకొలేక వారి మనోవేదన తమనే నరకంలో పడవేస్తుందని ఎంతమందికి తెల్సు? ఆస్తి ఇచ్చి, బ్యాంక్ బ్యాలెన్సులు యిచ్చిన తల్లితండ్రులగతీ యింతే.
నేను “అమ్మానాన్నలను నాదగ్గర వుంచుకొని అన్నం పెడుతున్నానని”   ఎప్పుడూ అనకండి అని కులశేఖరుగారు బాగా చెప్పినారు. “తల్లి సాక్షాత్ పరదేవత”  అనివ్రాశారు రచయిత.
శ్రవణ కుమారునికి, ధర్మవ్యాధునికీ ఆ అతీంద్రియ శక్తులు పుణ్యఫలం ఎక్కడనుండి వచ్చినవి. మాతా పితరుల సేవవలనగదా! సర్వసంగ పరిత్యాగులు, సన్యాసులైన ఆదిశంకరులు, శ్రీ రమణ మహర్షులు వారు అంత్య కాలంలో తల్లిని కడతేర్చలేదా? అలాంటప్పుడు గృహస్తులమైన మనము తల్లితండ్రులను నిరాదరించినపుడు, వారు కన్నవారు గాన శపింపకపోవచ్చు, శపించరుకూడా! కానీ అంతర్యామి, సమవర్తి, వారి చిట్టావ్రాసే చిత్రగుప్తుని చిట్టాలో చేరక తప్పదు.
ఈ విధముగా కులశేఖరుగారు “సంకలనము – సనాతనధర్మ ములు”  వెవరించిన ఈ గ్రంధమునకు నా అభిప్రాయం వ్రాయమన్నారు. నా అభిప్రాయముకూడా విస్తృతంగా వున్నదుకు క్షమార్హుడను.
శ్రీ కులశేఖర్ గారు Postal ఉద్యోగియైనను పారమార్ధిక జిజ్ఞాసతో ఈ పొత్తమును వెలువరించడం చాలా అభినందనీయము.
జయహో మాతా! శ్రీ అనసూయా! రాజరాజేశ్వరీ, శ్రీ పరాత్పరి! జయహో లలితా పరమేశ్వరి.
                                     నమస్తే, నమస్తే, నమస్తే, నమః.
ఇట్లు బుధజన విధేయుడు,
మిట్నాల వీరరాఘవశర్మ. 
ఆదోని                                                                                   
01.08.2012.                                                                                                  




మంచి మనసులూ – మంచి మనుషులూ
కావలోయ్! కావాలి!!
                                                                                                                                                                   ఆచార్య కసిరెడ్డి. 
ఏది సనాతనం! ఏది ధర్మంఅనే అంశం మీద ఎందరో మేధావులు చర్చలు చేశారు. మూడు కాలాల్లోనూ ఉండేది సనాతనం. ఆ సనాతనమే దైవమనీ తీర్మానించారు. సనాతన ధర్మమంటే దేవుని ధర్మమనీ అర్ధం చెప్పారు.
అంటే త్రికాల బాధితమై ఉన్న దైవమే ధర్మమని అర్ధం. శ్రీమద్భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనసు, బుద్ధి ఇవన్నీ నావిభూతులే అన్నారు. ఇంతేకాక ఈశ్వరుడు హృదయప్రదేశంలోనే ఉన్నాడన్నాడు. “భాగవతంలో ప్రహ్లాదుడు – చక్రి ఎందెందు వెతికితే అందందే కనిపించును” అన్నాడు. అంటే శాశ్వత సత్యం సనాతనమైనది దైవమన్నమాట. అదైవమే సనాతన ధర్మమన్నమాట.
కానీ మనిషిలో దైవీ సంపద నింపడానికి “ ఉత్తమములైన గుణాలన్నీ ధర్మములే ”  అని పెద్దలు ప్రతిపాదించారు. అవే సనాతన ధర్మములని ప్రచారం చేశారు. ధర్మానికి దశలక్షనాలంటూ స్మృతికారుడు ఈ క్రింది విధంగా ప్రతిపాదించాడు.

శ్లో|| దృతిః క్షమా, దామో న స్తేయం శౌచమింద్రియ విగ్రహాః|
     ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్ ||


దృతి అంటే ధరించడం స్తిరత్వం, క్షమా అంటే ఓర్పు, దమం అంటే క్లేశాలను ఓర్చుకోవడం, అస్తేయం అంటే దొంగతనము చేయకుండడం, శౌచం అంటే శుభ్రత (శారీరక – మానసిక – వాక్సుద్ధి అన్నమాట) ఇంద్రియనిగ్రహం అంటే నాలుక, నాసిక, కన్ను, చెవి, చర్మం తదితరాల కట్టడి అని గ్రహించాలి. ఇక ధీ అంటే బుద్ధి అనీ మతి అనీ అర్థం, సత్యమంటే శాశ్వతమైనదీ నిజమైనదీ అని అర్ధం, అక్రోధమంటే ఆగ్రహం లేకపోవడమని అర్ధం.
పై పది అంశాలూ గుణశీలాలే. ఈ గుణశీలాలే ధర్మాలు. అయితే కుటుంబములోని వ్యక్తులుగా వారివారి ధర్మాలు నిర్వర్తించినప్పుడు భర్త – భార్య, కొడుకు – కూతురు – కోడలు – అల్లుడు ఇలా ఎందరి ధర్మాలో విభజించి చూపవచ్చు. అదే విధంగా రాజు – మంత్రి – సేనాధిపతి – భటుడు తదితరుల ధర్మాలు వర్గీకరించి చెప్పవచ్చు. ఇక ఆధునిక కాలంలో అయితే మంత్రి – కార్యదర్శి – ఉద్యోగి – వ్యవసాయదారుడు – వ్యాపారి అంటూ అనేకవిభాగాలుగా చూపవచ్చు.
ఇలా అందరూ ధర్మగాములు కావాలని చెప్పుకొంటూనే ఉన్నాం! అయితే అన్ని పురాణాలు వ్రాసిన వ్యాసులవారిని ద్వాపరయుగం చివరలో అడిగినప్పుడు అందరూ “ ధర్మాన్ని”  వదలి అర్ధకామాల వెంబడి పరుగెత్తుతున్నారని అన్నారు.
  
శ్లో||  ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచకశ్చిత్ శృణోతిమే|
        ధర్మార్ధశ్చ కామాశ్చ సధర్మః కిం నసేవ్యతే||
                                  
ధర్నాన్ని అనుసరించి అర్ధకామాలు పొందండి అని నేను రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా అరచి చెబుతు న్నాను, అయినా నామాట ఎవరూ వినడంలేదు. ధర్మాన్ని అనుసరించేవారే కనిపించడం లేదు అన్నారు వ్యాసులవారు.
ద్వాపరయుగములోనే ఈ పరిస్థితి ఉంటే ఇక కలియుగాన్ని గురించి ఎంచెప్పేది! అయిన అలనాటి వ్యాసులవారి వలెనె నేడుకూడా ఎందరో ఆయన మార్గంలోనే బోధిస్తున్నారు. తట్టి చెబుతున్నారు. తిట్టి చెబుతున్నారు. కొట్టి చెబుతున్నారు. అయినా ధర్మం వదిలేవారు, అధర్మమార్గాలల్లో పయనించేవారు, ధర్మమార్గాన నడిచేవారిని అణచి వేసేవారు ఈ కలిలో కనిపిస్తూనే ఉన్నారు.
తనను కుట్టుతున్నా, కొట్టుకు పోతున్న తేలును రక్షించిన సాధువులను చూచి, ఆ విషప్పురుగును ఎందుకు రక్షించారు స్వామి! అది అన్నిసార్లు కుట్టినా మీరు వదలలేదే అంటే, కుట్టడం విషప్పురుగు ధర్మం, రక్షించడం సాధువుగా(నా) ధర్మం అన్నారట ఒ స్వామి.
ధర్మాన్ని ఆచరించినా ఆచరించకపోయినా ఆర్యులైన (ఉత్తములైన) వారు పట్టుదలతో తాము చెప్పాల్సింది చెబుతూనే ఉంటారు. వ్యాసులవారి నుండి నేటి చాగంటివారి వరకు ఎందరో ఎందరో!
అటువంటి చాగంటి వారి ప్రబోధాలకు ముగ్దుడైన మనలోని మంచి మనిషి పుష్పగిరి కులశేఖర్ గారు ఈగ్రంధం మనకందిస్తున్నారు. “సనాతన ధర్మములు – పూజలు” ఈ గ్రంధము నిండా వివరింపబడ్డాయి. “నేను చెప్పాలనుకొన్నది నాకన్నా ముందే ఎవరో చెప్పే ఉంటారు; ఆ చెప్పేదేదో నేను చెప్పిన దానికన్నా బాగానే చెప్పిఉంటారు.” అన్నాడో తెలుగు కవి.  

ఈ సంగతి సరిగా మిత్రులు పుష్పగిరి కులశేఖరుల వారికి తెలుసు. అసలీ పేరులోనే ధర్మమున్నది. పుష్పగిరి ఆంధ్ర  (తెలుగు) ప్రజావళి ధర్మపీఠం. జగద్గురు శంకరుల పీఠం. తెలుగునాట ధర్మప్రచారానికి నిలబడ్డ మొట్టమొదటి పీఠం. అది వీరి ఇంటిపేరు; ఆ పీఠంతో వీరికి ఎటువంటి సంబంధము లేదు. ఇక కులశేఖరులు వైష్ణవ తత్వాన్ని పరమ రమణీయంగా అందించిన పరమ గురువులు. ధర్మపీఠం మీద ఉన్న గురువు అనే అర్థం వీరి పేరులో ఉంది. ఆ పేరుపెట్టిన తల్లితండ్రులు మహోన్నతులు. అందుకే మహోన్నతులు, మహాదార్శనికులు, తత్వవేత్తలైన మహామనీషుల ఆలోచనలను సంకలనం చేశారు.
సంకలన మనేకంటే వీటిని మనకర్థమయ్యే శైలిలో తీరిగ్గా తిరుగవ్రాసి అందించారనే చెప్పాలి. ఇది ఒకరకమైన అనుసరణ అనువాదం, అనుసరణ, అను సృజన, అనుకల్పితము అనే కొన్ని పదాలున్నాయి. వీటిలో అనుసరణ పదమే బాగానప్పుతుంది. ఈ క్రింది విషయం చూడండి! “ తల్లి – భార్య – ఎవరు ఎక్కడున్నారు!”  అనే శీర్షిక క్రింద వ్రాసినది.


        “ మనము అమ్మవారి ఆలయానికి వెళతాము. అక్కడ అమ్మవారికి పడీ  పడీ దండాలు పెడతాము. అప్పుడు అమ్మవారు ఏ మనుకుంటారో తెలుసా!
నీవు ... నీవు చేయు ఈ పూజ, ఈ సేవ, ఈ దండాలు బంధు ప్రీతి కోరకో లేదా బుధజన ప్రీతికొరకో! అంతేకానీ నీ కొరకో, నా కొరకో కాదు; బంధుజనము ప్రీతి చెందుతారేమో కానీ, బుధజనము నీగురించి తెలిసిన వారు ధర్మమును ఆశ్రయించినవారు, ధర్మపరులు హర్షించరు. ఎందుకంటే అమ్మవారు ఇలా అంటారు.
ఇక్కడకు వచ్చి పడిపడి దండాలు పెడుతున్నావు. ఇక్కడ నేను సమిష్టి రూపంలో ఉన్నాను; అక్కడనేమో మీ గృహములో వ్యష్టి రూపంలో ఉన్నాను. నీకు తల్లిగా, నీకు భార్యగా, నీకు చెల్లెలిగా, నీకు అక్కగా, నీకు ఒక వదినగా మరదలుగా ........
కాబట్టి ముందు అక్కడనుండి మొదలు పెట్టరా – ఈసేవ – పూజ. అక్కడ అమ్మకు పట్టెడు అన్నం పెట్టవు; అమ్మా ! నీకు ఆరోగ్యం ఎలాఉంది అని అడిగిన పాపాన పోవు.

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ, 
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కులధర్మపత్నీ.   
     అనికదా అన్నారు? మరి అలాంటి ధర్మపత్ని; నీకు – మీ వంశానికి, వంశోద్ధారకుణ్ణి ప్రసాదించి, నిన్ను నీ ముందు తరాలవారిని, పున్నా మ నరకం నుండి తప్పించడానికి తనప్రాణాలనే ఫణముగా పెట్టి యోగ్యమైన సంతానాన్నిచ్చి, మిమ్ములను ఉద్ధరింపజేసే నీ సహధర్మచారిణిని, కట్నం తేలేదనో, లేదా మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేదనో, నరకయాతనలకు గురిచేయు ధూర్తుడా! నీవా ఇక్కడికి వచ్చి పడిపడి దండాలు పెడుతున్నావు. ఎవరికి కావాలి ఇలాంటి నటనల పూజ!.....”

ఇంకావుంది! నాకుకూడా ఈ మిత్రుని సంకనాలెన్నో ఇలాంటివి ఉదహరించాలనే ఉంది! ఈ ఒక్కటి చాలుకదా! ఉడికిందా  ఉడకలేదా  అని అన్ని మెతుకులు పట్టిచూడం కదా! ఈ ఒక్కటిచాలు. ఇందులో ఏది ధర్మమో! ఏది వుచ్చ్హమో సోదాహరణముగా విసిదీకరింపబడినది. తల్లికి తండ్రికి అన్నం పెట్టనివారు ఇంకెవరికి పెట్టి ప్రయోజనమేమిటి  దొంగపూజలు దొంగ నటనలు పెరిగిపోయిన లోకంలో చెంపపెట్టులాంటి ఉదాహరణ ఇచ్చారు కులశేఖరులు.
ధర్మసూత్రాలు, మంత్రాలు వల్లెవేయడంకన్నా ఒక సంఘటన, ఒక సన్నివేశం, ఒ చిన్నకధ ..... ధర్మాన్నీ- అనుష్ట్టా న వేదాంతన్నీ బలంగా గుండెలలో నాటుతుంది. ఇలాంటివి కొల్లలుగా ఉన్న ఈ గ్రంధాన్ని మల్లెలాంటి మనసున్న మంచి మనిషి అందిస్తున్నాడు. మనల్ని క్రియాశీలక ధర్మమూర్తులుగా ఎదుగ మంటున్నాడు.
అందుకే ఈ పుష్పగిరి కులశేఖరులను అభినందిద్దా౦! ఈ గ్రంధాన్ని అక్షర ప్రపంచములోకి ఆహ్వానిద్దాం. 


ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి 
                 కార్యదర్శి. ,హిందూ ధర్మ ప్రచార పరిషత్ 
                 తిరుపతి, తి. తి. దేవస్తానములు.