ఆళ్వారులు
వారి వివరములు
పరమేశ్వరుడు కలియుగం ప్రారంభమైన తర్వాత కలి
ప్రభావంతో కలియుగము లో మానవులు ధర్మమార్గమును అనుసరించుటకు అనువైన పద్దతులను
అందులోని ధర్మసూక్ష్మాలను మానవ జాతికి అందించడానికి మరియు కలియు గంలో ధర్మము
నాలుగు పాదముల మీదకాక ఒంటికాలిమీద కుంటి నడక నడుస్తుందని ధర్మదేవతకు మరియు సనాతన
ధర్మములకు వాటి ఆచరణము లకు విపరీతమైన విఘాతములు జరుగగలవని ఆ శ్రీమన్నారాయణుడే 12
మంది ఆళ్వారులుగా ఈ భూమిపై జన్మించి ఎంతో భక్తి బోధనలు చేశారు. విష్ణు చిత్తులైన
ఆళ్వార్లు విష్ణు భక్తిని విష్ణువుయొక్క గుణగణములను,
గుణగానము చేయుచూ ఈ కలియుగములో ధర్మాచరణములకు పునర్జీవం పోశారు.
శ్రీ
పూదత్తా ఆళ్వారులు :- శ్రీ మహావిష్ణువు యొక్క కౌమోదికి అనబడే(శ్రీ మహావిష్ణువు
యొక్క గద) అంశతో క్రీII పూII 7వ శతాబ్దములోద్రవిడ
దేశంలో మైలపోరిఅనే గ్రామములో జన్మించారు.
శ్రీ పొయ్ గై ఆళ్వారులు :- శ్రీ మహావిష్ణువు యొక్క
పాంచజన్యము యొక్క అంశతో క్రీIIపూII7వ శతాబ్దములో ద్రవిడ దేశంలో
కాంచీపురం అనే గ్రామములో జన్మించారు.
శ్రీ పేయాళ్వారులు:- శ్రీ మహావిష్ణువు యొక్క నందకము
యొక్క అంశతో క్రీII పూII 7వ శతాబ్దములో ద్రవిడ దేశంలో మైలాపూరు అనే
గ్రామములో జన్మించారు.
శ్రీ పెరియాళ్వారులు:- శ్రీ మహావిష్ణువు యొక్క
గరుత్మంతుని అంశతో క్రీIIపూII 9 వ శతాబ్దములో ద్రవిడ
దేశంలో శ్రీ వళ్ళి పుత్తూరు అనే గ్రామములో జన్మించారు.
శ్రీ తిరుమళిశై ఆళ్వారులు:- శ్రీ మహావిష్ణువు
యొక్క సుదర్శనచక్రము యొక్కఅంశతో క్రీIIపూII 7వ శతాబ్దము లో ద్రవిడ దేశంలో తిరుమళిశై అనే గ్రామములో జన్మించారు.
శ్రీ కులశేఖర్ ఆళ్వారులు:- శ్రీ
మహావిష్ణువు యొక్క వక్షస్థలము పై ఉన్నకౌస్తుభము అనే మణి యొక్క అంశతోక్రీII పూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరువంజికొళ్లం అనే
గ్రామములో జన్మించారు.
శ్రీ తిరుప్పాణి ఆళ్వారులు:- శ్రీ మహావిష్ణువు
యొక్క హృదయము నందు గల శ్రీవత్సము అనే చిహ్నం యొక్క అంశతో క్రీIIపూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో
ఉరైయూర్ అనే గ్రామములో
జన్మించారు.
శ్రీ తొందరడి ప్పొడి ఆళ్వారులు:- శ్రీ
మహావిష్ణువు యొక్క వనమాల అంశతో క్రీII పూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుమన్డన్ గుడి అనే గ్రామములో జన్మించారు.
శ్రీ తిరుమంగై ఆళ్వారులు:- శ్రీ
మహావిష్ణువు యొక్క సంగీత వాయిద్యమైన సారంగి యొక్క అంశతో క్రీIIపూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుక్కురయలూర్
అనే గ్రామములో జన్మించారు.
శ్రీ నమ్మా ఆళ్వారులు:- శ్రీ
మహావిష్ణువు యొక్క సేనాధిపతివారగు విష్వక్సేనుని యొక్క అంశతో క్రీII పూII 9వ శతాబ్దములో ద్రవిడ దేశంలో అళ్వార్ తిరునగరి
అనే గ్రామములో జన్మించారు.
శ్రీ మధురకవి ఆళ్వారులు:- శ్రీ
మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడుని (వినత యొక్క కుమారుడైన వైనతేయుడు యొక్క) అంశతో
క్రీIIపూII 9వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుకొల్లూరు అనే
గ్రామములో
జన్మించారు.
ఆండాళ్(గోదాదేవి):- శ్రీ మహావిష్ణువు గారి
సతీమణి అగు భూదేవి యొక్క అంశతో క్రీII పూII 9వ శతాబ్దములోద్రవిడ దేశంలో శ్రీ వళ్ళిపుత్తూర్ అనే గ్రామములో
జన్మించారు.
పై
విధముగా 12గురు ఆళ్వార్లు విష్ణుఅంశసంభూతులుగా విష్ణు భక్తిని, 64 మంది నాయనార్లు శైవ భక్తికి శివాంశ సంభూతులుగా, ఎనమండు గురు మధ్వాచార్యులు ఈ కలియుగం లో మానవజాతి సముద్దరణకు మానవజాతి
మనుగడకు భంగం కలుగకుండా కాపాడుటకు మరియు మానవజాతి ఉద్దరణకు కలిపురుషుని
ప్రభావమునకు ఈ జాతి బలికాకూడదని అమాయకులను భగవద్భక్తులను ఉద్దరించుటకు ఈభూమిపై
జన్మించినారు .
పూజ ఎందుకు?
“ కోటిమంది వైద్యులు కూడివచ్చినకాని మరణమన్న
వ్యాధి మాన్పలేరు”
బ్రహ్మ శ్రీ
చాగంటి కోటేశ్వర రావు గారు
“జాతస్యః ధృవో మృత్యుః”
భగవద్గీత
“పుట్టుటయు నిజము పోవుటయు నిజము”
అన్నమయ్య
“పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం”
ఆదిశంకరాచార్యులు
ఇలా
ఎందరోమహానుభావులు ఎంతో అనుభవముతో ఆర్తితో జ్ఞానంతో చెప్పిన వన్నీ వింటున్నాం, కానీ ఏ రోజైన దీనిని గురించి ఆలోచించామా? కనీసం
ఆలోచించే ప్రయత్నమైనా చేశామా? ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించండి .“మాకురుధన జన
యవ్వన గర్వం హారతి నిమేషాత్కాలః సర్వం , మాయా మయ మిద మఖిలం
హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశం విదిత్వా”
ఆదిశంకరాచార్యులు
మనకు ఏది అవసరమో, ఏది నిత్యమో ఏది సత్యమో తెలియచేయు చున్నారు. కావున ఈ మానవ ఉపాధి
మహోత్కృష్టమైనది.కొన్ని కోట్ల కోట్ల జన్మలకు, కానీఎన్నో
ఉపాధులు దాటితే కానీ ఈ మానవ ఉపాధి లభించదు. లభించిన ఈ ఉపాధిని భగవంతుడు మనకు
ఇచ్చిన ఈ మహద్భాగ్యాన్ని అవకాశమును అవివేకంతో, అజ్ఞానంతో
దుర్వినియోగం చేసుకొనరాదు. ఈ మహదావకాశమును దుర్వినియోగం చేయడం అవివేకం, అజ్ఞానం. భాగవతం అష్టమస్కందములో 37,46 పద్యములలో
శ్రీ పోతన గారి ద్వారా అపరధర్మావతార మూర్తి “రామో విగ్రహవాన్ ధర్మః” అని కీర్తించబడిన ఆ శ్రీ రామచంద్రప్రభువే శ్రీ
పోతనామాత్యులవారి తో పలికించినట్లు ఈ
ఉపాధికి (ఆత్మకు) ఎన్ని కోట్ల కోట్ల మంది (భార్యల తో/భర్తల తో/పిల్లల తో) సంబంధ
బాంధవ్యములు ఉన్నాయో ఆలోచించండి.
వృద్ధాశ్రమాలలో తల్లితండ్రులు
ఈ నాటి
ప్రపంచంలో యువత, బాల, బాలికలు, ఈ లోకం ధర్మపథంలో నడవాలంటే, నిలబడాలంటే, ప్రతి ఇంటిలోనూ నాన్నమ్మలు, అమ్మమ్మలు ఉండితీరాలి. కానీ నేడు నాన్నమ్మలు, అమ్మమ్మలు వృద్ధాశ్రమాలాలో ఉంటున్నారు. వృద్ధులు గనుక వారు మన ఇళ్లలోనే వారు
ఉండితీరాలి.
ఎందుకంటే
ఇక్కడ ఒక పర్యాయము బాగా ఆలోచించండి, మన కొరకు మన తల్లితండ్రులు నిద్రాహారాలు లేక
మనకు సేవలు చేస్తూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో కదా, ఎన్ని
ఉపవాసాలు చేశారో, ఎన్ని మ్రొక్కులు మ్రోక్కెరో, ఎంత శ్రమ చేసేరో, ఎంత వ్యధ చెందినారో,
అన్నిశ్రమలూ పడితేనేకదా మనము ఈ రోజున ఇంతవారమయ్యాము. వారికి ఆకలేసినా వారు కడుపు మాడ్చుకొని
మనకు మూడుపూటలా అన్నం పెడితే తిని వృద్ధి చెందినవారము కాదా? దినకూలీ చేసుకునే తల్లితండ్రులు కూడా నా బిడ్డ ఇంగ్లీషు చదువులు చదివి
అభివృద్ధి చెందాలని వృద్దిలోనికి రావాలని, మనము
పడే కాయ కష్టము మనబిడ్డలు పడకూడదని పస్తులుండి మనకు అన్నం పెట్టి మన స్కూల్ ఫీజులు
కట్టినవారు మన తల్లితండ్రులు. మనము చిన్నతనములో కానీ,
యవ్వనములో కానీ మన తల్లితండ్రులకు కోపముకలిగించే పనులు,
విసిగించే పనులు, అసహ్యము కలిగించే పనులు చేయకనే ఇంతవారమయ్యామా? ఒకసారి మనస్పూర్తిగా ఆలోచించండి. మరి ఆనాడు మనలను మన తల్లి తండ్రులు మనలను
అసహ్యహిచుకొని, కోపగించుకొని వదలేసి ఉంటే మనము ఏ అనాధాశ్రమము పాలో అయి
ఉండేవాళ్లము కదా? లేక ఏ వీధి రౌడీగానో, ఏ
దొంగగానో, రాక్షస ప్రవృత్తులతో పదిమందీ అసహ్యకించుకొనేలా
బ్రతుకుతూ ఉండేవారము. ఈ సభ్య సమాజములో నిర్భయముగా జీవించే అవకాశము ఉండేదా? ఇది నేర్పినవారు ఈ విధముగా మనలను తీర్చిదిద్ది,
విద్యాబుద్ధులు, సభ్యత, సంస్కారములు
నేర్పి ఈ నాడు మనకు ఈ సభ్య సమాజములో అందుచున్న ఈ గౌరవ ప్రతిష్టలను భిక్షగా
పెట్టినవారు మన తల్లితండ్రులు. మనము
అభివృద్ధిలోకి వస్తే, ఒక ఉద్యోగము రావడం,
ఉద్యోగములో ప్రమోషన్లురావడం, వ్యాపారమైతే ఆర్ధికముగా బాగా స్తిరపడి, ఉన్నతస్థాయికి రావడం, ఒకగొప్ప పదవిని చేపట్టి పదిమందిచేత మంచివాడు
అనిపించుకొనడం ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి తల్లితండ్రులు ఎంత పొంగిపోతారో, ఒకవేళ వారు వృద్ధాశ్రమాలాలోఉన్నా వారికి ఈ విషయం తెలిస్తే ఎంత
పొంగిపోతారో, పొంగి తబ్బిబై పోయి మనలను ఆ ఆనంద హృదయముతో
దీవిస్తారు, ఆ దీవనలే మనకు శ్రీరామరక్ష. గుడిలో దేవుని
ఆశీస్సులకన్నా, గుడిలో అమ్మవారి అనుగ్రహముకన్నా తల్లితండ్రులు ఆనంద
హృదయముతో పరవశించి దీవించే దీవెనలు శ్రేయస్కరమైనవి. అవే మనకు శ్రీరామరక్ష. ఎందుకంటే
కరచరణాదులతో కదలాడుతూ, మనకు సేవలుచేసి,
వృద్ధాప్యములో మనచేత సేవలు చేయించుకొనే ప్రత్యక్ష్య దేవుళ్లు తల్లితండ్రులు.
వారికి మించిన దైవములేదు. కాబట్టి వారు పొరపా
టునకూడా మనలను తిట్టరు శపించరు. వాడు పిల్లాపాపలతో పదికాలాలపాటూ చల్లాగాఉంటే
అంతేచాలు అదే మాకు పదివేలు అంటారే కానీ, పొరపాటున కూడా మనలను
తిట్టరు శపించరు అదే (అదే భగవంతుడు, భగవంతుడుకూడా ఎవరినీ శపించడు, తిట్టడు బగవంతునికి అందరూ సమానమే) మాతృహృదయం. మరి అలాంటి మన తల్లితండ్రులను, నాన్నమ్మలను
, అమ్మమ్మలను, తాతయ్యలను విజ్ఞులమైన మనము వృద్ధాశ్రమాలాలో ఉంచడము ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.
అసలు
వారిని వృద్ధాశ్రమాలలో ఉంచడానికి గల కారణాలను ఒక పరి లోతుగా పరిశీలిస్తే మనకు బోధపడేఅంశాలు, అమ్మ నాన్నలు మన మాట వినలేదనో, వారికి సేవలు చేయవలసి
వస్తుందనో, మన సుఖసంతోషాలకు ఆటంకమనో, లేదా వారి అనారో గ్యమునకు,
మందులకు,
డాక్టర్లకు డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుందనో కారణాలు తప్ప మరే ఇతర కారణాలు
కనబడుటలేదు. మనము మన తల్లితండ్రులను చిన్నతనములో,
యవ్వనములో, చదువు కునే రోజులలో క్లేశములు కలిగించలేదా? మరి వారు కూడా మనలాగే ఆలోచించి మనలను నిర్లక్ష్యము చేసిఉంటే మనకు ఈ రోజు
ఈ స్థితి ఉండేదా? మరి
చిన్నతనములో, యవ్వనములో,
చదువుకునే రోజులలో, మనము
మన తల్లితండ్రులు కు కలిగించిన క్లేశములకంటే, మన
తల్లితండ్రులు మనకు ఎక్కువ క్లేశము కలిగించినారా? బాగా ఆలోచించండి.
మరి మన పిల్లలు
మన తల్లితండ్రులలాగే విసిగిస్తారు, కోపం తెప్పిస్తారు, అనవసర
ఖర్చులు చేయిస్తారు మరి మనబిడ్డలను మనము పై కారణాల వలన ఏ ఆశ్రమములోనో లేదా ఏ వసతి గృహలలోనో
వదలివేయగలమా? వదలలే ము. ఎందుకు? మనది
కన్నప్రేమ, పెంచినప్రేమ,
మమకారము, కడుపుతీపి, పేగుబంధము కదా! మన
తల్లితండ్రులకు మనపట్ల ఇవి ఉండవా? మన పిల్లలకు బడిలోనో లేదా ఒక కాలేజీ లోనో మంచి
మార్కులు వస్తే, లేదా MBBS లోనో
, లేదా ఏ BITSPILANI లోనో, IIT లోనో, ఏదో ఉన్నత కళాశాలలో ఫ్రీ సీటు వస్తే మనము ఎంతసంతోషిస్తాము, పదిమంది మనలను మన బిడ్డలనూ అభినందిస్తుంటే ఎంత పొంగిపోతాము, మరి ఇవన్నీ మన తల్లితండ్రులకు మనమీద ఉండవా? వారు
మన దినదినాభివృద్ధిని చూచి పొంగిపోవాలని, ఆ ఆనందాన్ని పదిమందితో వారి
స్నేహితులతో బంధువర్గముతో పంచుకోవాలని ఆనందించాలని, వారికుండదా? ఆలోచించండి.
కాబట్టి
మన తల్లితండ్రులను, నాన్నమ్మలను
, అమ్మమ్మలను, తాతయ్యలను వృద్ధాశ్రమాలాలో కాక వారు మన
ఇంటిలోనే ఉంటే, ఆలోచించండి
మనము మన తల్లి,తండ్రుల
ఋణమును కొంతవరకైనా తీర్చుకొన్నవారము అవుతాము. తల్లికి ఎంత సేవ చేసినా తల్లి
ఋణము తీరేదికాదు. తల్లితండ్రులకు సేవలు, సపర్యలు, చేయడం ఎంత గౌరవం ఎన్ని జన్మజన్మల పుణ్యమో, తల్లి ఋణము తీర్చుకునే భాగ్యము మనకు కలుగుతుంది. అందుకే “నేను ఇంకా
మా అమ్మకు అన్నం పెడుతున్నాను”
అని ఎప్పుడు కానీ పొరపాటున కూడా అనరాదు. అంతకంటే దౌర్భాగ్యపు బ్రతుకు, మానవత్వము ను మరచిన బ్రతుకు, మరొకటి లేదు. కృతఘ్నతకు
ఇంత కంటే నిదర్శనము మరోటిలేదు. తల్లి సాక్షాత్తు పరదేవత. నేను ఇంకా ఇంత వయసు
వచ్చినా(55 సం|| 60 స|| వచ్చినా అంటే తల్లి
తండ్రులు కలిగి వున్నవారు) “నేను ఇంకా మా అమ్మ చేతి అన్నం తింటున్నాను” అని
సగర్వంగా త్రికరణశుద్దిగా చెప్పుకొని పొంగి పోయే జన్మము ధన్యము. తల్లి తండ్రుల
అవసరాలు తీర్చుచూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ఇక్కడ మరో విషయం
బాగా ఆలోచించండి. తల్లి తండ్రులను మనం సేవించడం వలన మనకు పుణ్యప్రదము మరియు వయో
వృద్ధులు , జ్ఞానవృద్ధులు అనుభవ వృద్ధులు ఐన తల్లితండ్రులు
ఇంటిలో ఉండడం వలన వారి ద్వారా మన పిల్లలకు మనము అపారమైన, విలువ
కట్టలేని, ఆధ్యాత్మికమైన,
ధార్మికమైన, పురాణ విషయ సంపదలు,
అనుభవపూర్వ కమైన మంచి చెడు విషయములు, అందించినవారమౌతాము. వాటి
యొక్క విలువలు మనకు ఇప్పుడు తెలియవు. మన పిల్లలు ప్రయోజకులై ఈ ప్రపంచంలో బ్రతుకు
తెరువుకై వెళ్ళినపుడు మాత్రమే అవగతమవుతాయి. ఈ సమాజంలో ప్రతి మనిషి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ పరంగా ఉదయం నుండి సాయంకాలంవరకు, మరీ రాత్రి వరకు బయట అలసి సొలసి విశ్రాంతికై ఇంటికి చేరుతారు. అప్పుడు మన
పిల్లలు సందేహాలు, ధర్మ విషయాలు,
న్యాయాన్యాయ విషయాలు, సమాజ విషయ సందేహాలు మనల్ని అడిగితే, మనము మన శారీరక, మానసిక, బడలికల
వలన విసుగు ప్రదర్శించడం. లేదా మీ టీచర్లను అడగండి అనడం, మరీ
మరీ అడిగితే ఇప్పుడు కాదు, అని విసిగించుకోవడం జరుగుతుంది. ఔనా? మరి మన పిల్లల సందేహాలు మన పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఎలా తెలుసుకుంటారు ఆలోచించండి.
కాబట్టి ఇంటిలో
అమ్మమ్మలు, నాన్నమ్మలు,
తాతయ్యలు ఉన్నట్లయితే మనకు ఈ శ్రమ ఉండదు కదా? మరియు
పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ,
అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ,
విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని
అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే
పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు.
మరొక్క
విషయము ఆలోచిస్తాము మనకు ఈ యవ్వనము శాశ్వతమా? ఈ
దేహము శాశ్వతమా? మన శరీయములో ఉన్న ఈ బలము శాశ్వతమా? ఈ సంపదలు శాశ్వతమా?
మనకు వృద్ధాప్యము రాదా? మరి మనలను మనబిడ్డలు వృద్ధాశ్రమములో ఉంచరని
గ్యారంటీ ఉందా? అపుడు మనకు కలిగే ఆలోచనలు మనలో జరిగే సంఘర్షణలు
ఇపుడు మనతల్లితండ్రులకు ఉండవా? ఎక్కడుంది
ధర్మము. మనము మనసంస్కృతి ఎక్కడికి వెళుతోంది?
నిజానికి మనము ఎక్కడ ఉన్నాము?
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములలో ఈ వృద్ధాశ్రమాలు ఉన్నట్లు దాఖలాలు
లేవు. ఈ కలియుగములోనే అనాధాశ్ర మాలు, వృద్ధాశ్రమాలు, చైల్డ్ కేర్ సెంటర్లు పట్టణాలలో వీధికొకటి వెలుస్తున్నా యి. మరీ ప్రతి
మండల కేంద్రములో ఒక వృద్ధాశ్రమము వెలుస్తున్నది. ఇది వ్యాపారమే కావచ్చు కానీ ఆశ్రమ
నిర్వాహకులు ఎంత సేవచేసినా ఆ వృద్దులకు తృప్తికలుగుతుందా? మనము
ఇచ్చే పది రూపాయలతో వారి సేవలకు విలువ కట్టగలమా?మరి
వారు ఎంతో సహృదయముతో సేవాధృక్పధముతో వారుచేసే శ్రమకు,
సహనానికి, సేవలకు మనము విలువ కట్టగలమా? ఆ వృద్ధులు తృప్తిపడితేనేకదా వారి సేవలకు విలువ? ఆ
వృద్దులకు ఏమను కుంటారు మనబిడ్డే ఉంటే ఎంతబాగా చూచు కొనేవాడో కదా అంటారు కానీ తృప్తిపడరు.
అవునా?
మన బిడ్డలు మన ప్రతిచర్యనూ మన బిడ్డలు చాలా
జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారనేవిషయం మనము మరువరాదు. మన నడవడిని మన ప్రతి అడుగునూ
గమనించే మన బిడ్డలు, వారుకూడా అలాగే ఉండాలని, నడవాలని అలాగే ప్రవర్తించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎలాగంటే వేప
విత్తనమును నాటి మామిడిపళ్లు కావాలంటే వస్తాయా రావు వేపపళ్లే వస్తాయి, ఆలోచించండి?
పూజ ఎవరు
చేయాలి ? ఎందుకు చేయాలి ?
వారు వీరను
బేధములేక, వర్ణ, వర్గము తేడాలేక, వయసు
లింగబేధము లేక కుల, మత బేధములేక ఎవరైనా గురుముఖతః పూజా విధానమును
అభ్యసించి కానీ లేదా వారి వారి గృహములలో వారి పెద్దలు చేయుచున్న విధముగా కానీ
పూజాది కార్యక్రమములను చేసుకొనవచ్చును. పరమాత్మ(భగవంతుడు) అందరివాడు ఇందులో ఎలాంటి
సందేహమూలేదు.
చూచే
వారికొరకు వారి ప్రశంసల కొరకు (అబ్భ వారు
ఒక గంట లేదా రెండు గంటలసేపు ఎంత సేపైనా,
ఏకధాటిగా పూజ చేస్తారండి) చేయు
పూజ నిరుపయోగము. అందుకే శ్రీ త్యాగరాజస్వామి
గారు “ మమతా బంధనయుత నరస్తుతి సుఖామా,
రాముని సన్నిధి చాలా సుఖమా, నిజముగతెల్పుమో మనసా” అని ప్రార్ధన చేస్తారు. కావున పూజను త్రికరణశుద్ధిగా, మనో, వాక్కాయ, కర్మలతో, అనగా మనస్సును,
నోటిమాటను, మరియు చేతలను,
ఒకటిగా అనుసంధా నము చేసి పూజ చేయాలి. మన ఉద్ధతి కొరకు భగవంతుని ప్రీతి కొరకు చేయాలి కానీ ఇతరుల ప్రశంసలకొరకు
కాదు. నరులమెప్పు కొరకు ఏది చేసిన ఎన్ని చేసినా వృధానే, అదే నారాయణునిమెప్పు కొరకు ఒక్కటిచేసినా ఆ జీవితము ధన్యము. నరులుమెచ్చే
పూజ, భక్తి నరకముకు మార్గము, నారాయణుడు మెచ్చే పూజ,
భక్తి, స్వర్గమునకు మార్గము. త్రికరణశుద్ధితో పూజ చేసిన ప్పుడు వారు పొందు అనుభవము, అనుభూతి, ఆ దివ్యానుభూతి వర్ణనాతీతము. ఆమధురానుభూతిని, దివ్యానుభూతిని తెలియ చేసే భాష ఈ ప్రపంచములో ఇంతవరకూ ఏదీ
లేదు.
ఉదాహరణకు మామిడి
పండు చాలా తీయగా ఉంటుంది. ఆ తీపులో బంగినపల్లి మామిడి పండు రుచివేరు, మలగూబా మామిడిపండు రుచివేరు, బేనీషా పండు రుచివేరు, రసాలు (ఖాదరు, కాళేపాడు) పళ్ల రుచులు వేరు. ఈపళ్ల రుచులను ఫలానా పండు రుచి (అన్నీ తీపే,
తీపిపళ్లే) ఇది అని చెప్పుటకు భాష ఉందా? బాగాఆలోచన చేయండి
త్రికరణశుద్ధితో పూజ నారాయణుడు మెచ్చే పూజ ఎలా ఉండాలంటే
కొంతమంది సినిమాలలో , ఇంటిలో టివిలో సీరియల్స్ చూచుచూ ఆ సినిమా, సీరియల్ పాత్రలలో పూర్తిగా
లీనమైపోయి ఎక్కడలేని ఉద్రేకమునకు వీరు లోనై వీరు ఏకధాటిగా బిగ్గరగా ఎక్కిళ్లు
పెట్టి ఏడుస్తారు, అందులో కొన్ని సంఘటనలలో మమేకమై హృదయము
తాదాత్ప్య్మము చెంది, తన్మయత్వముతో (అందులోని
త్యాగములకు, కొన్ని అనుభూతులకు,
కొన్నికొన్ని సంఘటనలకు ప్రతిస్పందనగా) హృదయము ద్రవించి ఆనందభాష్ఫములు కళ్ళు చమర్చడము, కన్నీరు ధారాపాతము కావడము గమనించారా. అలా మనము చేయు పూజలో మనము మమేకమై, తాదాత్ప్య్మము,
తన్మయత్వము చెంది, అనన్య భావములులేక ఏకాగ్రతతో, పూజా కార్యక్రమము చేసిన, స్వామి
ప్రీతిచెంది మన భక్తికి స్వామి దాసుడై అబ్భ ఎంతభక్తి, ఎంత ఏకాగ్రత,
ఏమిపూజ అని, మన స్వామి కళ్ళలో, మన కళ్ళలో ఆనందభాష్ఫములు రాలాలి. అది పూజంటే. మనకు అదీక్ష ఏది?
మనకు తాదాత్ప్య్మము ఏది? మనకు ఆతన్మయత్వము ఏది? మనదంతా తంతు పూజ.
భక్త కన్నప్ప భక్తికి శివుని కంటిలో రక్తము
కారలా? కన్నప్ప తనకన్నును తీసి స్వామికి ఇవ్వలా? ఆ భక్తి
పారవశ్యము ఉండలేకానీ భగవంతుడు ఒక కన్నప్పకేకాదు అందరికీ ఆభగవంతుడు దాసాను దాసుడే.
ఉదా:- మనము ఏ వర్ణము వారైన శ్రీ
సత్యనారాయణ స్వామి వ్రతము చేయాలంటే మనము మన పురోహితులవారు (మన ఇంటి బ్రహ్మ గారు)
వచ్చి వ్రతమునకు కావలసిన సామగ్రీల
వివరములు మనకు తెలియచేసి, ఆ సామగ్రిని సిద్దము చేయమని తెలుపుతారు. వాటిని
మనము సిద్ధముచేసిన తర్వాత, భార్య భర్తలను పీటలమీద కూర్చో పెట్టి మనచే పురోహితులవారు
(ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ
స్వాహా) అని ఆచమనము చేయించి మనచేత పూజ, వ్రతముచేయిస్తారు కదా? కావున వర్ణవర్గ బేధములేక వారివారి గృహములలో వారివారి ఇష్ట దైవములకు పూజా
విధిని భక్తి,
శ్రద్దలతో, భయ భక్తులతో నిర్వహించవచ్చు.
1.మనము ఉదయం కాగానే నిద్ర లేస్తాము. నిద్ర లేచాము అంటే అందులో మన ప్రమేయము
ఏమాత్రమో ఆలోచించండి. నిద్ర పోయిన తరువాత నిద్ర లేస్తామని మనకు పడుకునే ముందు
ఏదైనా గ్యారంటీ ఉందా? భగవంతుడు నిద్రలో (మనము నిద్రించుచున్నప్పుడు)
మన శ్వాసను ఆగి పోనీకుండా మనకు మరునాడు ఉదయమును చూచే భాగ్యమును ప్రసాదించినందుకు
పూజ చెయ్యాలి.
2.ఉదయాన నిద్ర లేచినది మొదలు మరలా
సాయంకాలం (రాత్రి) నిద్రకు ఉపక్రమించేంత వరకు (పగలంతా) ఈ మానవ ఉపాధిలో శ్వాసను అలాగే
ఉంచి ఈ ఉపాధికి మంచి బుద్ధిని, మనస్సును ఇచ్చి పుణ్య కర్మలు, సత్ కర్మలు చేయించి నందుకు, త్రికరణ శుద్దిగా
భగవంతునికి పూజ చెయ్యాలి.
3.మనము అందరమూ చాలా ధర్మ నిష్ఠాపరులము,
భగవంతుని మీద అపారమైన నమ్మకము కలిగియున్నవారము. మనకు భక్తి ఉంది, సనాతన ధర్మముల మీద గౌరవం ఉంది. నమ్మకమూ ఉంది. రోజూ కాక పోయినా సందర్భములు, పండుగలు సమయములను బట్టి ఆలయాలకు, తీర్థయాత్రలకు
వెళ్లుచున్నవారము కదా! అయినా నిత్య పూజ అవసరమా? అనే
సందేహం అవునా? ఆలోచించండి:-భాగవతములో
అజామిళుడు ఏమయ్యాడు? అజామిళుడు ఎంతటి భక్తిపరాయణుడు. ఎంతో పరమ నిష్టాగరిష్ఠుడు. సకల శాస్త్రకోవిదుడు, వేదవేదాంగములు అవపోసనపట్టిన మహాజ్ఞాని కదా? మరి
ఒక్క క్షణంలో చూడ కూడని దృశ్యమును చూచి దానికి బానిసై పతనమయ్యాడా లేదా? అరిషడ్వర్గములకు లోనై పతనమయ్యాడు. ఎంత నిష్టాగరిష్ఠుడైనా అరిషడ్వర్గములకు
లోనైతే ఏమవుతాడో అజామిళో పాఖ్యానము మనకు దృష్టాంతము. అందుకే నారాయణ శతకంలో “ఒక
వేళ నున్న బుద్ధి యొక వేళ నుండ దింక నేమి సేతూ విశదంబుగా జేయవే నీవు నాచిత్తమును
నారాయణా”... అని ప్రార్థిస్తారు.
4.ఇంద్రియాలు పరమాత్మవేపుకు చూడడానికి అటు వైపు వెళ్ళడానికి సహకరించవు.
ససేమిరా ఒప్పుకోవు. అవి ఎంత సేపూ
తాత్కాలిక సుఖ, భోగముల వైపు మన మనస్సును ఉంచడానికే
ప్రయత్నిస్తాయి. శాశ్వతానందము వైపు మరలవు. మనసును అటువైపుకు మరల్చటానికి
సహకరించవు. వాటిని అటు వైపు నుండి శాశ్వతానందము వైపుకు త్రిప్పడమే పూజ. అజామిళుని
లాగా ఏక్షణములోనైనా ఈ బుద్ధి పాడు కావచ్చు. అందుకే ఈ బుద్ధిని క్రమ బద్దీకరించి
నిత్యము నిరంతరమూ పరమాత్మ వైపు త్రిప్పడానికి
పూజ.
నిత్య సత్ కర్మల వలన అంతః శుద్ధి ఏర్పడుతుంది.
5.పరమేశ్వరుడు మనకు పంచేంద్రియములను ప్రసాదించి తద్వారా మనకు సుఖదుఃఖములను
ప్రసాదించాడు. అందుకొరకు పరమేశ్వరునికి కృతజ్ఞతలు వ్యక్తము చేయడం మన కనీస విధి.
ఒక్కో ఇంద్రియంతో కొన్ని కోట్ల
సుఖములను మనకు ప్రసాదించాడు. భగవంతుడు ఎంత గొప్ప శిల్పి. మనకు నోరును పైన
పెట్టి కడుపును క్రింద పెట్టినాడు. నోటిలో ఏది పడినా శ్రమ లేకుండా కడుపులోకి జారీ
పోతుంది. ప్రతి మానవుని చేతులలో ఎన్నో గీతలు గీశాడు. ఆ శిల్పి ఏ సిరాతో గీశాడో
కానీ ఎన్ని మార్లు కడిగినా ఆగీతలు జీవితకాలం చెక్కు చెదరడంలేదు.
6. నిద్ర అనే సుఖమును ప్రసాదించాడు. ఆ నిద్రలో ఇంద్రియాలను మనసులోకి, ఆ మనస్సును ఆత్మలోకి తీసుకెళ్ళి రాత్రంతా ఇంద్రియాలకు శక్తిని ప్రసాదించి
మరలా ఉదయం కాగానే ఇంద్రియములు పనిచేయుటకు అవకాశం శక్తి కల్పిస్తు న్నవాడు
పరమేశ్వరుడు.
7. సాధారణముగ 108 నామములతో పూజ చేస్తారు. అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి
ప్రాణి అనగా 84 కోట్ల జీవ రాసులు క్షేమంగా ఉండాలని. ఎలాగంటే ప్రతి ప్రాణి ఏదో ఒక
నక్షత్రంలో జన్మిస్తుంది. నక్షత్రములేని సమయం ఉండదు. (ఒక్క రోజుకి 86,400 సెకన్లు ఏ ప్రాణి ఐనా ఏదో ఒక సెకనులో జన్మించాలి) ఒక నక్షత్రమునకు 4
పాదములు. 27 నక్షత్రములకు 27x4=108 పాదములు. కాబట్టి ప్రతి ప్రాణి
ఆయురారోగ్యములతో ఉండవలయునని పూజ చేస్తాము. అందుకే అత్యవసర మైతే 108 ఫోన్ చేస్తాము
108 వాహనము వచ్చి మన ప్రాణములను కాపాడుటకు ICU లో
మనలను ఉంచితే మనవారంద రూ ICU అద్దాల దగ్గర I see you అంటూ చూచేవారే కానీ ఏమీ చేయలేరు. బాగా ఆలోచించండి. అపుడు
భగవంతుడనే వైద్యుడు “వైద్య నారాయణో
హరిః” కదా, కాబట్టి భగవంతుడే Doctor
గారి రూపములో ICU లో మనలను కాపాడుతాడు. బాగా ఆలోచించండి. 108 కు
ఫోను చేయడం జరుగుతుందే కానీ 108 నామాలలో (భగవంతుని నామాలతో) ఒక్కటి ఒక్కటంటే
ఒక్కటి గుర్తుకు వస్తుందా? పలుకుతామా?
పిలుస్తామా? ఏవండీ, ఎవరండి, అయ్యో, అయ్యయ్యో, కుయ్యో, మొర్రో, “ఏవండీ ఎవరైనా 108 కు phone చేయండి” అంతే గాని గోవిందా, నారాయణ, రామ, శివా, సాయిబాబా ఎవరూ గుర్తుకురారు. అందుకే నిరంతర స్మరణ, నిరంతర
స్మరణ అలవరుట కొరకే పూజ.
8. పంచేంద్రియములకు ఒక భయం. ఏమంటే ఆత్మకు భగవంతునికి సంబంధించిన విషయములు
ఎక్కడ ఈ మనసు గ్రహించి శరీర భ్రాంతిని విడిచి పరమాత్మవైపుకు వెళుతుందో, అని, నిరంతరమూ అత్యంత జాగరూకతతో భగవంతునికి సంబంధిoచిన విషయ వాసనలను, దరి దాపులకు రానీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఎంత
సేపూ ప్రాపంచిక విషయాలపై, ధ్యాసను,
ఆసక్తిని, అనురక్తిని పెంచి పోషిస్తాయి.
కాబట్టి ఐదు కర్మేంద్రియాలు+ఐదు జ్ఞానేంద్రియాలు+బుద్ది =11 ఇంద్రియములను
తన ఆధీనములో ఉంచుకొని మనస్సు నిరంతరం భగవత్ చింతనకు మనలను దూరంగా ఉంచుతుంది. దాని
ఆధీనము నుండి 11 ఇంద్రియములను తప్పించి నిత్యమూ
నిరంతరమూ సర్వకాల సర్వావస్థలయందు భగవంతునివైపుకు త్రిప్పుట కొరకే పూజ.
9.ఒక నాలుగు రోజుల పాటు మనము తెచ్చిన కూరగాయలను తిను బండారములను
ఉపయోగించకుండా అలా బయట ఉంచితే ఏమవుతాయో ఆలోచించండి. క్రుళ్లిపోయి దుర్గంధం వెదజల్లడమేకాక
క్రిమికీటకాదులకు ఆశ్రయమిచ్చి మనలను అనారోగ్యం పాలు చేస్తాయి. అవునా? మరి మనము ఈ ఉపాధి (శరీరం) లో షడ్రుచులతో కూడిన ఎన్ని ఆహార పదార్థము లను
ఎంత ఆహారాన్ని ఎంత కాలంగా ఇందులో వేస్తున్నామో కదా! మరి చెడు వాసన రాదేo? క్రిమికీటకములు ఉత్పన్న ము కావటం లేదేం?
ఆలోచించండి. మనము వండిన ఆహారమును అలా బయట నాలుగు రోజులు ఉంచితే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈశ్వరుడు జఠరాగ్ని స్వరూపంలో ఈ
శరీరంలో పడవేసిన దేనినైనా పచనం(జీర్ణం) చేయకపోతే మనము జీవించగలమా? ఈ శరీరం పరస్థితి ఏమిటి? పరమేశ్వరుడు మనకెందుకు ఇంత ఉపకారం చేయాలి? అంత ఉపకారం ఒక రోజు కాదు రోజుకు మూడు పూటలా, ఇన్ని
సంవత్సరములుగా చేయుచున్న ఈశ్వరునకు కనీసం పూజ ఐనా చేసి మన కృతజ్ఞతను ఆవిష్కరించాలా
లేదా? మీరే ఆలోచించండి. ప్రతి రోజు మూడు పర్యాయములు తినడానికి
సమయం ఉంది. మరియు “ప్రొద్దు పోవక
యున్నను, వేసరక పొరుగిండ్ల, తిరుగుగానీ,
బుద్ధి మాలిన చిత్తము నీ యందు పొందదే నారాయణా”... అన్నారు. అయినా పరమేశ్వరునికి పూజ చేయడానికి రోజుకు
కనీసంలో కనీసం ఒక అరగంట సమయం లేదా? ఎంత కృతఘ్నల మండీ మనము. ఒక్కసారి ఆలోచించండి.
10. సొంతముగా ఒక ఇల్లు కట్టుకోవా? ఎంత
కాలం ఈ బాడుగ ఇళ్ళలోబ్రతుకుతావు? పరమాత్మ ప్రతి ఒకరికీ సొంత ఇల్లు నిర్మించుకునే
అవకాశము కేవలం ఈ ఒక్క మానవ ఉపాధికి మాత్రమే ఇచ్చాడు. మిగతా ఏ ఒక్క ఉపాధికి ఈ
సౌలభ్యము ను భగవంతుడు ప్రసాదించలేదు. ఈ మానవ ఉపాధిలోనికి వచ్చిన తర్వాత సొంత
ఇంటిలోకి వెళ్ళవలయును కానీ మరలా ఏదో ఒక ఉపాధి తీసుకొని బ్రతక కూడదని భగవంతుడు మానవ
ఉపాధిని ప్రసాదించాడు.
ధర్మవర్తన అనే
పునాదులపై భక్తి అనే ఇటుకలతో, జ్ఞానము అనే ఇసుక, తపన
అనే నీళ్ళు, దానధర్మము లనే సిమెంటుతో వైరాగ్యమనే (కప్పు)
శ్లాబుతో ఇల్లు నిర్మించాలి. దానికి సాధన అనే మెట్లు(తాపలు) కట్టి, నిత్య పూజ అనే ద్వారములు, నిరంతర ధర్మకర్మానుష్ఠానమనే కిటికీలు ఉంచి, సాధకుడు జీవాత్మను ఆ ఇంటిలో గురువు సహాయంతో ప్రవేశించాలి. తేనెలో పడ్డ ఈగ
లాగా భక్తి మకరందాన్ని త్రాగి త్రాగి మత్తెక్కి ఇక అందులోనుంచి లేవలేని లేవలేక
అందులో పడిన ఈగ లాగ కావడానికే పూజ.
11. సుడి గాలి వచ్చిందంటే దుమ్ము ధూళి పైకి లేచి కళ్ళలో పడి మనము కళ్ళు
తెరవలేక అలా కళ్ళు మూసుకొని కళ్ళు నలుపుకుంటూ ఆ గాలి యొక్క ధాటికి తాళలేక ఎలా వెళుచున్నామో
తెలియక ఎలా బాధపడతామో కదా. అపుడు ఆ సమయంలో వర్షం పడిందనుకోండి అపుడు ఎంత బలమైన
గాలి వచ్చినా దుమ్ము ధూళి పైకి లేవగలదా మనలను ఇబ్బంది పెట్టగలదా? ఆలోచించండి. అలాగే మనము గత జన్మలలో చేసుకున్న ఈ జన్మలో చేసిన చేస్తున్న
అకృత్యములకు, అధర్మవర్తనకు,
పాపములకు ఈ ఈతి బాధలు, అకాల మరణాలు, అశాంతి
ఇలాంటి రుగ్మతలను మరియు అరిషడ్వర్గాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాలంటే భగవంతుని
అపార కృపా వర్షము మన మీద కురవాలి. అవునా ఆలోచోంచండి అందుకే పూజ.
12.మన అంగీకారం లేనిదే అహం స్వార్థం మనలో ప్రవేశిoచిందా? మనం ఆశతో చూచే చూపులే కదా దానికి ఆధారం. మన కోరికలు బలహీనతలే కదా
స్వార్థం యొక్క గుర్రాలు. ఈ ఆసరాలతోనే అహం అనే ఏనుగును చేసి కోరికలు అనే అంబారీ పై
ఊరేగుచున్నాము. అవునా ఆలోచించండి.
ఒక మహాత్ముడు ఏమన్నాడు
డబ్బుల కుంపటి మీద కోరికలు అనే ఎసరు పెట్టుకున్నది మనం. దాహంతో, వ్యామోహంతో అవకాశాల కోసం అంగలార్చుచు చున్నది మనం కాదా? ఆశ, ఆర్భాటములు,
స్వార్థముల వలన కలి మనలో పరకాయ ప్రవేశం చేయడానికి మనమే అనుమతిoచాం. అది మన వేలితో మన కన్నే పొడి చేస్తుంటే ఈ కలిమాయలో పడ్డ మనకు
కర్తవ్యం బోధపడటం లేదు. ఈ మృగతృష్ణ తీరడం లేదు. అరిషడ్వర్గాలను జయించలేక సంసార
సాగరమును ఈదుచున్నాము. అందుకే ఈ సంసార సాగరమును,
ధర్మబదద్ధముగా, వేద హితముగా ఈది, ఆవలి
వొడ్డు చేరాలంటే వేదములు తెలియాలి ధర్మా ధర్మములు తెలియాలి ఆశ్రమ ధర్మాలు తెలియాలి
అందుకే నిత్యం పూజ, పురాణ ప్రవచనాలు వినడం ఈ ఉపాధికి అత్యంత అవసరము.
13. మనలని మనం ప్రమదాల నుండి కాపాడుకోవడo ఎలా? మనము రాత్రి పూట పడుకుంటాo.
పడుకునే ముందు Fan తిరుగుతోంది చిన్న Zero
light (తక్కువ కాంతిగల) వేసుకుని పడుకున్నాం. రాత్రి ఎప్పుడో ఆ zero light కాలిపోయింది. అందు వలన గది అంతా చిమ్మ చీకటి. ఏమీ
కనిపించనంత చీకటి. ఆ చీకటిలో, మధ్యలో మనకు మెలుకువ కలిగింది. లేచి బాత్రూంకి
వెళ్లాలి. వెళ్లాలంటే వెలుతురు కావాలి.
అరెరె కరెంట్
పోయినట్లుంది అని అనుకున్నాము. కానీ Fan తిరుగుతోంది అంటే
కరెంట్ ఉంది మరి చీకటి ఎలా వచ్చింది ఓ హొ
బల్బు మాడిపోయింది అనుకొని వేరొక పెద్ద light
వేయడానికి స్విచ్ బోర్డు కొరకు తడుము తుంటే ఒక చిన్న వ్రేలు ప్లగ్లోకి దూరింది.
వెంటనే షాక్ కొట్టి క్రింద పడిపోయాము. ఎంత వారికైనా అజ్ఞానము అనే చీకటి
ఆవహించినపుడు జ్ఞానము అనే కాంతిని దగ్గరకు రానీయదు. కోరికలు, స్వార్థం, సంసారం లోని అరిషడ్వర్గముల అనే చీకటులు ఆవహించి
ఉన్నపుడు గురువు (భగవంతుడు) అనే (జ్ఞానము) వెలుతురు కావాలి. గురువు (భగవంతుడు) అనే
స్విచ్ దొరకాలి. అపుడు స్విచ్ నొక్కితే వెనువెంటనే చీకట్లు మాయమై వెలుతురు
ప్రకాశిస్తుంది. వెలుతురు వస్తే గాని ఏ వస్తువు ఎక్కడుoదో, ఎవ్వరూ ఎక్కడున్నారో, ఎవ్వరు ఏమిటో తెలుస్తుంది. ఎప్పుడైతే నిత్య పూజ, ధర్మానుష్ఠానము, నిరంతర స్మరణ ఉంటాయో,
అప్పుడు ఎంత చీకటిలో నైనా స్వీచ్ మన చేతికి అందుతుంది. అందుకే నిత్య పూజ.
14.పరమాత్ముడు ఈ ఉపాధికి నవ రంధ్రములు కళ్ళు-2,
మలమూత్ర విసర్జనా స్థానములు-2, ముక్కు-2, ఒక
నోరు పెట్టి ఇందులో పది వాయువులను, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త అనే ఈ పది వాయువులను సప్తధాతువులు
చర్మము, రక్తము, క్రొవ్వు, మాంసము, అస్తి, శుక్ల, మేధ
ఇందులో ఉంచి
ఆ పది వాయువులను బయటకు పోకుండా సప్తధాతువులు
పాడుకాకుండా తయారు చేసి జీవన్ముక్తిని చతుర్విధ పురుషార్థములు సాధించమని ఈ ఉపాధిని
మనకు ఇచ్చాడు. అందుకు నిరంతర కృతజ్ఞతావిష్కరణకు పూజ అవసరము.
15. ఈ ఉపాధిని ఆశ్రయించిన జీవాత్మ ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మ నుండి. మరలా ఈ ఉపాధిలోని జీవుడు (జీవాత్మ) ఎక్కడికి వెళ్లాలి
పరమాత్మలోకి అవునా. అందుకు ఈ ఉపాధిని ఉపయోగించాలి.
ఉదా:- మనము ఇంటి నుండి బయలు దేరి ఆఫీసుకు,
బజారుకు, ఒక పని చేయడానికి,
పొరుగూరికి, ఒక గుడికి,
విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళతాము. మరి అక్కడే ఉండి పోతామా? లేదే తిరిగి మరలా మన ఊరికి (అది సొంత ఇల్లు కానీ, అద్దె
ఇల్లు కానీ) మనము వచ్చేస్తున్నాము. ఆఫీసుకు,
బజారుకు, లేదా ఒక పనికో వెళ్ళినపుడు ఆ రోజు సాయంకాలనికి ఇల్లు
చేరుచున్నాము. విహారయాత్రలు, తీర్థయాత్రలు, మరో
పోరుగూరో వెళితే కొన్ని రోజుల తరువాతైనా మన ఇంటికే మనం వస్తున్నాం. ఔనా? అంటే ఎక్కడి నుండి (ఇల్లు) బయలుదేరినామో అక్కడికే వచ్చి చేరుతున్నాం. కదా!
మరి పరమాత్మ నుండి విడివడి బయలు దేరిన ఈజీవుడు (జీవాత్మ) మరి పరమాత్మ వద్దకు
చేర్చవలసిన బాధ్యత మనది కాదా?
ఉదా:- ఒక పిల్లవాడు తల్లి తండ్రులతో విహారయాత్రకు,
తీర్థయాత్రకో వచ్చి దారి తప్పుతాడు. (తల్లి తండ్రులను వదిలి తప్పుతాడు). అపుడు
విజ్ఞులయిన మనము అతనిని చేరదీసీ వారి యొక్క విలాస వివరములు తల్లితండ్రుల విలాస
వివరములు తెలుసుకుని ఆ తల్లి తండ్రులకు తెలియజేసి వారి కడకు వారి బిడ్డను
చేర్చడానికి ప్రయత్నము చేస్తాము. లేదా రక్షణ విభాగము (పోలీసు) వారి దగ్గరకైన
చేరుస్తాము. మరి ఈ ఉపాధిలో ఉన్న జీవుని
(జీవాత్మ) పట్ల మన కెందుకు ఇంత వివక్షత? ఇంత నిర్లక్ష్యము? ఆలోచించండి. అందుకే పూజ అవసరము.
16. ఒక
కుటుంబం విహారయాత్రకో, తీర్థయాత్రకో వచ్చారు. అందులో ఒక 5 సం|| బాబు తప్పిపోయాడు. విజ్ఞులైన మనము ఏమీ చేస్తాము. ఆ బాబుని దగ్గరకు
తీసుకొని వివరాలు విలాసాలు విచారిస్తాం. పిల్లవాడు గోలగోల చేస్తుంటాడు. ఎక్కి
ఎక్కి ఎక్కుళ్లు పెడుతూ ఏడుస్తుంటాడు. మధ్యమధ్యలో మా అమ్మకావాలి, నాన్నకావాలి అని ఏడుస్తుంటాడు. మనము వానిని బుజ్జగించి బాబు ఈ పాలు
త్రాగు అంటాము. నాకు వద్దు మా అమ్మకావాలి! ఈ బిస్కట్ తినరా వద్దు మా అమ్మకావాలి!
పోనీ ఈ చాక్లెట్లు తినరా వద్దు మా అమ్మకావాలి! నాన్న కావాలి! పిల్లలు బిస్కట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు అనిన చాలా ఇష్ట పడుతుంటారు. అంత
పరమ ఇష్టమైన పదార్థాలు ఇచ్చినా, నాకు వద్దు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అని భీష్మించుకొని ఏడ్చి ఏడ్చి శోష వచ్చి పడిపోతాడు. ఇది
తినరా మీ అమ్మ దగ్గరకు తీసుకెళతాను అంటే, ముందు తీసుకెళ్లు తరువాత
తింటాను అని అంటాడు. తల్లి తండ్రులను చేరే వరకు ఏమి ముట్టడు. ఎంత తపన? ఎంత బాధ? ఎంత ఆర్తి? అమ్మను
నాన్నను చేరడానికి మరి ఇన్నేళ్లు వచ్చాయి మనకేదీ ఆ ఆర్తి, ఏది ఆ తపన, ఎక్కడ ఆ బాధ. ఇంకా అరిషడ్వర్గాలనే బిస్కట్లు చాక్లెట్లు, పండ్లు రకరకాల షడ్రుచులు కావాలనే భావనే కానీ అమ్మ నాన్నలను చేరాలనే కోరిక
ఎక్కడ? ఆ కోరిక పుట్టిoచడానికే
పూజ.
ఈ ఉపాధిలోని
జీవుడు (పరమాత్మనుండి విడివడిన) తన అమ్మ నాన్నలతో కలవాలని ఎంత తపన పడుతోందో? ఎంత పొర్లి పొర్లి ఏడుస్తుందో? ఎలా అల్లాడిపోతుందో? దాని గోడు మనకు వినబడుతోందా? వినబడినా కూడా విననట్లు
నటిస్తున్నామా? అని మనము విజ్ఞతతో ఆలోచించుకోవాలి. ఈ తప్పిపోయిన
బాలుడికి (జీవునికి) కార్లు చూపిస్తాము, బంగారము చూపిస్తాము, సుఖాలను చూపిస్తాము నిజంగా ఆనంద పడుచున్నాడా? లేక ఏడ్చి
ఏడ్చి శోషతో పడిపోతున్నాడా? ఎందుకు ఆవిధంగా ఆలోచింపరు? అక్కడ బిడ్డను పోగొట్టుకున్న తల్లితండ్రుల పరిస్థితి ఏమిటి. ఆ తల్లి నా
బిడ్డో, నా బిడ్డో అని నేలబడి ద్రొల్లుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. అన్న పానీయాలు ముట్టదు. భర్త మిగిలిన బంధువులు చెబుతారు, బిడ్డ దొరుకుతాడు లేమ్మా
కాస్త ఎంగిలి పడు అంటారు. అయినా ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఎవరు చెప్పినా ఆ తల్లి
వెర్రి చూపులతో బిడ్డకోసం ఆర్తితో అంటుంది, అందరూ ఇక్కడ నాకు చెప్పేవారే కానీ మీలో ఒక్కరైనా వెళ్ళి బిడ్డ కొసం
వెతుకుతున్నారా? వెతికే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకీ వ్యర్థమైన కాలయాపన, వ్యర్థమైన కబుర్లు, ఓదార్పులు ముందు నా బిడ్డను వెతికించే ప్రయత్నం
చేయండని ఆ తల్లి పడే బాధను ఊహించండి. అలాగే పరదేవత కూడా మన గురించి ఎంత తపన ఎంత
బాధపడుతోందో ఆలోచించండి. మనకు దారిచూపడానికి మన యొక్క విలాసము, వివరములు తెలియజేయడాని ఎందరో మహానుభావులను పంపింది. ఒక ఆదిశంకరాచార్య, ఒక రామానుజాచార్య, ఒక మద్ద్వాచార్య, ఒక
రమణమహర్షి, ఒక అరబిందో, ఒక
చంద్రశేఖరేంద్ర భారతీ సరస్వతి స్వామి
ఎందరో అవధూతలు ఎందరో మహానుభావులు వచ్చారు. మనలను ఈ భవబంధముల నుండి బయటకు
లాగి మన అసలైన చిరునామా, మన వివరములు తెలియజేయడానికి, మనలను మరలా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళే మార్గము చూపడానికి. కానీ మనకు వారిని
కలిసే సమయమేది? వారి పాదపద్మముల మీద పడి ప్రణిపాతము చేసే
సంస్కారమేది? వారి ప్రవచనాలను వారి జీవిత గాథలను చదివే
సమయమేది? ఎంతసేపూ నా
సంసారం, నా పిల్లలు, నా సంపాదన, ఇదే ధ్యాస. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారన్నట్లు “ఎంత సేపూ చేసిన
సంసారమే చేయిస్తావు, తిన్న తిండే తింటావు ఎంత కాలమిలా బ్రతుకుతావు? నీలో మార్పురాదా?” అన్నారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనకు
పశుపక్ష్యాదులకి తేడా ఏముంది?
పూజాలో
పొందవలసిన అనుభూతి
మనము ఒక సినిమా
చూచేటప్పుడు, ఒక TV సీరియల్ చూచేటప్పుడు
అందులోని సన్నివే శాలలో లీనమైపోయి, ఆ సందర్భానుభూతిని, మనము
అనుభవించుచున్నప్పుడు, మన హృదయము తెలియని అనుభూతికి లోనై, కళ్లు చెమర్చడం, ఏడ్వడం,
బాధపడడం జరుగుతుంది. మరీ కొన్ని కొన్ని హాస్య సన్నివే శములలో నైతే పొట్ట
చక్కలయ్యేటట్లు నవ్వడం, నవ్వి నవ్వి కడుపు పట్టుకోవడం, మరీ విపరీతముగా నవ్వడం వలన, కళ్ళలో ఆనంద భాష్పములు
రావడం, జరుగుతోంది కదా! ఇక్కడ మనము బాగా సుదీర్ఘముగా
ఆలోచించగలిగితే, ఒక విషయం బోధపడుతుంది. నిజానికి సినిమాను
నిర్మించే, నటించే వారికి అందరికీ, ఆ
సినిమాను చూచి ఆనందించి, ఆదరించే ప్రేక్షకులే దేవుళ్లు. నటులు
కానివ్వండి, దర్శకులు కానివ్వండి, ఆ
పరిశ్రమలో పనిచేయు వారెవ్వరైనాసరే, ప్రేక్షకులు చూచి మెచ్చి చాలాబాగుందని
అదరిస్తేనే (సినిమా, TV సీరియల్ పరిశ్రమల) వారికి జీవనం, మరియు సినిమా టివి పరిశ్రమలు వృద్ధి చెందుతాయి.
మరి మనము, విభిన్న మనస్తత్వాలు, విభిన్న ఆలోచనలు,
అభిప్రాయాలు, విభిన్న పద్దతులు,
ఆచారవ్యవహారాలు, కలిగిన ప్రేక్షకులు సినిమా పరిశ్రమ పట్ల, దేవుళ్లైతే, ఆ దేవుళ్లను మెప్పించడానికి (సినిమా,TV సీరియల్ పరిశ్రమల) వారు ఎంత కఠోర పరిశ్రమ చేయాలి. వివిధ దర్శకాగ్రేసరులు
(సంగీతం, అలంకరణ, ఛాయా, నృత్యం,సంభాషణలు) ఎంతగా శ్రమించాలి. మరి నటులు,
దర్శకులు వివరించిన విషయమును, ఆసందర్భమును, ఆ
పాత్రయొక్క, గుణగణములను జీర్ణించుకొని, ఆ పాత్రలోనే జీవించుచూ, ఆ పాత్ర యొక్క భావములను, తను అనుభూ తి చెందుచూ, తన నటనతో ఆ భావమును వ్యక్తీకరించి, ప్రేక్షకులకు అందించాలి. అలా జీవించి నటించకపోతే, చూచే
మనకు, ఆ మధురానుభూతి కలుగుతుందా? ఆ
సినిమాను చూచిన మనము, ఆనందించగలమా? వారు, వారి వారి పాత్రలపట్ల, వృత్తిపట్ల ఎంత న్యాయము చేస్తున్నారనే విషయం, ప్రేక్షక దేవుళ్లమైన మనము నిర్ణఇంచి ఆదరించుచు న్నాము. అవునా?
ఒక సినిమానే
కాదు ఒక సంగీత విద్వాంసుని సంగీతం, ఒక చిత్రకళా తపస్వి చిత్రం, ఒక నవలా రచయిత రచన, ఒక ఉపాధ్యాయుని పాఠం, ఒక
నాట్యకళాకారుని నాట్యం, ఒక పురోహితుని మంత్రపఠనం, ఒక దేశరక్షకు (సైనికుడు) ని త్యాగం, ఒక
అధికారి అధికారం, ఒక వైద్యుని వైద్యం ఇలా ఎందరెందరో వారివారి పాత్రలలో వారు లీనమై
జీవించి పనిచేయక (ఫొటోల కొసమో,
పబ్లిసిటీ కోసమో లేదా పత్రికల కోసమో) వారు పనిచేస్తే,
ప్రేక్షకులమైన మనము, వారినాదరింతుమా, వారిని
అభిలషింతుమా, మనము ఆదరించక పోతే వారికి మనుగడెక్కడిది?
మరి భగవంతుడు
మనకొక పాత్రనిచ్చి ఈ జానారణ్యమనే నాటకరంగము పై మనలను, మనయొక్క
సనాతన ధర్మములను,
వేదములను, గౌరవించి వేదయుక్తముగా,
ధర్మబద్ధముగా, నడుచుకోమని,
జీవించమని, మనకు గొప్ప అవకాశము ఇస్తే, మనము చేయుచున్నదేమిటి, వేదములు,
ధర్మవర్తన మాట అటుంచి, కనీసములో కనీసము నిత్య పూజను, ఆలయదర్శనమును కూడా మరచిపోయాము.
ఈ ఉపాధిని మనకు
భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనము పరమాత్మ చెప్పినవిధముగా వేదముల సారము
గ్రహించుచూ వేదప్రోక్తముగా, ధర్మబద్ధముగా, జీవనము
సాగించుచూ భగవంతునకు చేయు పూజలో మనము అందులో మమేకమై నిత్యమూ పూజా విధిలో జీవించుచూ
పూజలో లీనమై ఆత్మానుభూతి చెందువిధముగా పూజచేస్తే, అటు
పరమాత్మ కన్నులలో, మనకన్నులలో ఆనంద భాష్పములుకాక మరేమొస్తాయి.
ఆలోచించండి.
భక్తికి
భగవంతుడు ఎప్పుడూ దాసుడు, అనడానికి
చాలాఉదాహరణలు
శ్రీ వేంకటేశ్వరుడు అన్నమయ్య భక్తికి దాసుడై
సకుటుంబముగా అన్నమయ్య వివాహానికి తరలివెళ్లి,
అన్నమయ్య పల్లకీని, తనభుజాలమీద మోయలేదా?
1.
పాహి పాహి
ఇతహః పరంబెరుంగ, అని గజేంద్రుడు ప్రార్ధిస్తే....... అలవైకుంఠ
పురంబులో అమూలసౌధంబులో, ఉన్న పరమాత్మ, పరుగెత్తి
రాలా, అదీ ఎలావచ్చాడు?
సిరికించెప్పడు, శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడు, అలా ఆగమేఘాలమీద పరుగు పరుగున పరుగెత్తి రాలా?
ఎవరికోసం వస్తాడండీ? ఆయన దీనజన బాంధవుడు. త్రికరణ శుద్ధిగా భక్తితో
ప్రార్ధిస్తే భక్తికి దాసానుదాసుడు.
2.
కుచేలోపాఖ్యానములో
కుచేలుడు (పరమ ప్రీతితో భక్తితో ) తెచ్చిన అటుకులకు పరవశించి అష్టైశ్వర్యములు
ప్రసాదించలా?
3.
కురుమహాసభలో
అన్నా నీవేదిక్కు ,అని
ద్రౌపతి తన రెండు చేతులూ పైకి ఎత్తి ప్రార్ధించగానే శ్రీ కృష్ణపరమాత్మ తామర
తంపరగా వస్త్రదానము (చీరలు) ప్రసాదించలా?
4.
శ్రీ
త్యాగయ్య భక్తికి పరవశుడైన, శ్రీ సీతా రామచంద్రులవారు, లక్ష్మణ స్వామీ, అంజయనేయ స్వామి సమేతంగా త్యాగయ్య ఇంటికివచ్చి
విందారగించలా?
5.
శ్రీ
రామదాసు భక్తికి దాసుడై, చనిపోయిన రామదాసు పుత్రుణ్ణి బ్రతికించాలా?
6.
ఈ
స్తంభములో నీ విష్ణువు ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడుగగా,
ప్రహ్లాదుడు ఉన్నాడు, అని, ఇందుగల డందులేడ ని
సందేహమేల, ఖచ్చితంగా ఉన్నాడు. అని చెప్పి ప్రహ్లాదుడు
ప్రార్దించగా తన భక్తుని మాటకోసం,
తన భక్తుని మాట నెలబెట్టడంకోసం స్వామి
స్తంభమునుండి బయటకు రాలా? వచ్చి హిరణ్యకశిపున్ణి సంహరిచలా?
7.
శ్రీ
తులసీదాసు భక్తికి తులసీదాసు తల్లి దగ్గర, రామయ్య
వీపు వాతలు పడేలా దెబ్బలుతినలా? అమ్మా కొట్టద్దు,
కొట్టద్దు అని దెబ్బలు తినలా?
8.
వైర భక్తి
పరాకాష్టకు నిదర్శనంగా హిరణ్యకశిపుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు,
రావణాసురుడు వీరంతా మోక్షమును పొందాలా?
9.
మూఢ
భక్తికి నిదర్శనంగా తిన్నడు (కన్నప్ప ) తన కాలి చెప్పుతో,
శివలింగము పై నిర్మాలిన్యాన్ని తీయగా, మరియు తిన్నడు శివునకు
కన్ను పెట్టడానికి, కన్ను గుర్తుకొసం తన కాలి బొటనవ్రేలును, ఉంచి తనకన్నును తనశరీరము నుండి పెకలించి పెట్టగానే మోక్షాన్ని
ప్రసాదించలా?
ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నోనిదర్శనములు ఉన్నాయి. ఒక
విషయం ఆలోచించండి పైన ఉదహరించిన వారందరూ మానవ మాత్రులు కారా? మరి మనమూ మానవులమేకదా, మరి వారికి మనకు ఎక్కడుంది తేడా? వారికి పలికిన భగవంతుడు మరి మనకెందుకు పలకడు? ఎందుకు
మాట్లాడడు? ఎవరికోసం పలుకుతాడండీ,
ఎవరికోసం మాట్లాడుతాడు? మనలో ఆ భక్తి పారవశ్యమేది? భగవంతుని పట్ల సమాజము పట్ల ఆసేవాభావమేది. భగవంతునికి మనము ఆ దాస్యం, సేవ చేస్తేకదా?
ఇక్కడ ఒక
ముఖ్యమైన విషయం గమనించాలి. అసలు దాస్యం, అంటే ఏమిటి? సేవచేయడం అంటే ఏమిటి తెలియాలి. దాస్యం ఎలాచేయాలి, సేవలు
ఎలాచేయాలి, ఇవి తెలుసుకుంటే, అలా
చేస్తే భగవంతుడు, పరమాత్మ మనకు దాసుడౌతాడా, లేదా, అనే విషయం తెలుస్తుంది. మహాభారతంలో పాండవుల
పురోహితులైన శ్రీ ధౌమ్యుల వారు, ఓ ధర్మరాజా మీరింతవరకు, సేవలు, దాస్యము చేయించుకొన్నవారే కానీ దాస్యం చేయడం, సేవలు
చేయడం చేసినవారుకారు. మీరు విరాటరాజు కొలువులో, సేవక
వృత్తి, దాస్య వృత్తి చేయాలి. సేవ, దాస్యము అనగా ఒక తల్లి తనబిడ్డకు ఏ ఏ పనులు చేస్తుంది. బిడ్డ అడిగితేనే చేస్తుందా? లేక ఏది తనబిడ్డకు అవసరమో అవి చేస్తుందా? తల్లి కి తెలుసు తన బిడ్డకు ఎప్పుడూ ఏది అవసరమో, మలమూత్రము శుభ్రం చేసి,
ఒక స్నానపానాదులే కాక ప్రతి చిన్న విషముము జాగ్రత్తగా గమనిస్తూ కంటికి రెప్పలా
తనబిడ్డను తాను చూచుకొంటుంది. పాండవులకు
సేవలుచేయు, విధానము గురించి మరియు దాస్యం, ఎలాచేయాలి, అనే విషయాల గురించి పాండవుల పురోహితులైన, శ్రీ ధౌమ్యుల వారు సవివరంగా వివరిస్తారు. అలా మనము కూడా భగవంతునికి, త్రికరణ శుద్దిగా, పంచేద్రియాలను ఒకటిచేసి, తపన, ఆర్తితో దాస్యం, సేవా (శరణాగతి)
చేస్తే, భగవంతుడు మనకు,
దాసుడుకాక ఎక్కడికి పోతాడు.
స్త్రీ పాత్ర
- తల్లి, భార్య, ఎవరు ఎక్కడున్నారు
“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ”
మనుస్మృతి
ఎక్కడ
స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వ
సంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.
మనము అమ్మవారి ఆలయానికి
వెళతాము అక్కడ అమ్మవారికి పడీ పడీ దండాలు
పెడతాము. అప్పుడు అమ్మవారు ఏమనుకుంటారో తెలుసా? నీవు
నీవు చేయు ఈ పూజ, ఈ సేవ, ఈ
దండాలు నేను కాక ఎవరో నిన్ను చూడాలని చూచి
వారు నిన్ను మెచ్చుకోవాలని, లేదా ఏ బంధు ప్రీతి కొరకో లేదా బుధ జన ప్రీతి కొరకో అంతే కానీ నీకొరకు నాకొరకు
కాదు. బంధు జనము ప్రీతి చెందుతారేమో కానీ, బుధజనము, నీగురించి తెలిసిన వారు,
ధర్మమును ఆశ్రయించినవారు, ధర్మపరులు హర్షించరు. ఎందుకంటే అమ్మవారు అంటారు ఇక్కడకు వచ్చి, పడి పడి దండాలు పెడుతున్నావు. ఇక్కడ నేను సమిష్టి రూపంలో ఉన్నాను. అక్కడ మీ గృహములో వ్యష్ఠి
రూపంలో ఉన్నాను. నీకు తల్లిగా, నీకు భార్యగా, నీకు చెల్లిలిగా, నీకు
అక్కగా, నీకు ఒక వదినగా,
మరదలుగానే కాక, ప్రతి స్త్రీ మూర్తిలోనూ వ్యష్ఠి రూపములో
ఉన్నాను, కాబట్టి ముందు అక్కడ నుండి మొదలుపెట్టరా, నీ సేవ, నీ పూజ. అక్కడ
అమ్మకు పట్టెడు అన్నం పెట్టవు. అమ్మా నీకు ఆరోగ్యం ఎలా వుంది అని అడిగిన పాపాన
పోవు.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కులధర్మపత్నీ. అని కదా అన్నారు ? మరి అలాంటి ధర్మపత్ని, నీకు, మీ వంశానికి, వంశోద్ధారకుణ్ణి ప్రసాదించి, నిన్ను,
నీ ముందు తరతరాలవారినీ, పున్నామనరకము నుండి తప్పించడానికి తన ప్రాణాలనే
ఫణముగా పెట్టి యోగ్యమైన సంతానాన్నిచ్చి,
మిమ్ములను, మీ వంశన్నీ ఉద్ధరింపచేసే స్త్రీ మూర్తి, నీ సహధర్మచారిణిని, కట్నం
తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు.
ఇక్కడ ఒకవిషయం ఎవరైనా సరే మనస్పూర్తిగా ఆలోచించాలి
మనకు ఆరోగ్యం బాగా లేక పడకవేస్తే,
ఆమె బాధపడుతుంది, ఆక్రోశిస్తుంది, అల్లాడి పోతుంది, తల్లడిల్లిపోతుంది, వివిలలాడుతుంది మన అలనా పాలనా చూచి,
సమయానికి మందులు, మాత్రలు, సరియైన
ఆహారం ఇవ్వడం, మనకు సేవలు చేయడం,
కన్నతల్లి లాగా, ఎక్కువగా మనలను సేవించి మనకోసం, మనకుటుంబముకోసం, అన్నీ తానై పాటుపడే సహనమూర్తి, త్యాగశాలి ధ్ర్మపత్ని. అందుకే కదా కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని
గౌరవించి స్త్రీ మూర్తికి అగ్ర తాంబూలం
ఇచ్చారు. మరి అలా తల్లిడిల్లినపుడు, బాధతో ఆక్రోశించినపుడు,
విలవిలలాడేటప్పుడు, రాత్రంతా నీ మంచము ప్రక్కన కుర్చీలో కూర్చొని
కునికిపాట్లు పడుతూ సేవలు చేస్తూ నీకోసం అహోరాత్రము శ్రమిస్తుంది. మనము బ్రతికి
(ఆరోగ్యం కుదుటబడి) బట్టకడితే ఈ జనులు, బుధజనులు ఏమంటారో తెలుసా
“ఆ తల్లి మాంగల్యం గట్టిది, ఆతల్లి పూజాఫలము
ఆయనకు పునర్జన్మ నిచ్చింది” అంటారే కానీ నీ గొప్పనో లేక నీ అదృష్టమనో అనరు. మన
ఆకలిని ఎరిగి తనకు లేకపోయినా తన అమృత హస్తాలతో కొసరి కొసరి వడ్డించి అన్నము పెట్టే
నీ సహధర్మచారిణి (భార్య) లో భోజన సమయములో అమ్మ కనిపించడములేదా?
అమ్మతనాన్ని చూడలేవా? దాసిగా సేవలు చేయు నపుడు, మన కోపాలను, దుర్భాషలను,
రాక్షసప్రవృత్తిని ఆ స్త్రీమూర్తి భరించు నపుడు
ఆమె క్షమా గుణంలో భూమాతను దర్శించలేని నీవు, కట్నం
తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. ఎవరికి కావాలి ఇలాంటి ఈ నటనల పూజ. ఇక్కడ ఆలయంలో
అమ్మవారికి పూజచేస్తూ ఒక సెకను నీ పంచేంద్రియాలను అమ్మవారి పాదముల చెంత
ఆవిష్కరించలేవు, పూజ చేస్తూ కూడా పక్కన ఓ అమ్మాయి కనబడ్డా, ఒక స్త్రీమూర్తి కనబడ్డా ఇక్కడే నీ బుద్ధి, మనము
వెర్రివేషాలు వేస్తుంటే చూస్తూ అన్నందిస్తావు. పరస్త్రీలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు. పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవత ను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?
ఇవే కాక మన పిల్లలకు
తల్లి దగ్గర, నాన్నమ్మ,
అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ,
విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని
అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే
పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు. ఎందుకంటే అది తన రక్తం, పేగుబంధం కాబట్టి బిడ్డలు ఎక్కడ
వున్నాతల్లి ఆ బిడ్డను వేయి కళ్ళతో వారి ప్రతి అలోచనను, ప్రతి
అడుగును గమనిస్తూ ఉంటుంది. కావున కేవలం తల్లి కే (ఆ పరదేవతకే) అది సాధ్యం. బిడ్డలు
చేసిన పనులను, ఆలోచ నలను, వారి అసంతృప్తు
లను, మంచి చెడులు ఎప్పటి కప్పుడు వివరించి, ధర్మాధర్మములను వివరించి, బిడ్డలను తీర్చిదిద్ద కలిగే శక్తి ఒక్క తల్లికి
మాత్రమే ఉంది. తండ్రికి కాదు. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిని సమాధానపరచ గలదు
తల్లి. అందుకే వేద వేదాంగములలో మొదటి నమస్కారము తల్లికే “మాతృదేవోభవ” అన్నారు. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించింది కావున ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గమునకు మన భారతదేశము ఇతర దేశములకు
ఆదర్శముగా పూజనీయ మైనది గౌరవప్రదమైనది. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించి తన
బిడ్డలను ధర్మమార్గంలో నడపగలిగితే ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గ మునకు మన భారతదేశము ఇతర దేశములకు భావితరాలకు కూడా ఆదర్శము
కాగలదు.
కాబట్టి ఈ
సమాజమును మార్చగలిగే శక్తి ఒక్క స్త్ర్రీమూర్తికి మాత్రమే ఉంది. ఇందు పురుష పాత్ర
ధర్మ జీవనం, ధర్మ సంపాదన, ధర్మ
వర్తనము (స్త్రీ అయిన పురుషుడైన) కలిగి మన పిల్లలకు మనమే తొలి గురువులు కాబట్టి, మన
పిల్లలు మనలను ఆదర్శంగా తీసుకొని, వారి భావి జీవితాన్ని వారి చుట్టు ప్రక్కల
సమాజానికి, ఆదర్శపాత్రులైన నాడు, మనం మన
బిడ్డలను చూచి, మనము సగర్వంగా గర్వపడతాము. “నేటి బాలలే
రేపటి పౌరులు” కదా మరి ఆలోచించండి గృహస్తాశ్రమము (సంసారజీవనము) లో స్త్రీ
పాత్ర ఎంతటిదో. అలాంటి స్త్రీ మూర్తిలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు. పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవతను,
తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?
తన ధర్మపత్నిలో
పర దేవతను చూచిన మహానుభావులు పుట్టిన దేశంమనది,
అంతగొప్ప సంస్కృతి మనది. ఉదా :- శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన
ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.
పరమాత్మ పట్ల
కృతజ్ఞతా? కృతఘ్నతా?
ఈ
శరీరంలో నిలబడడం (భుక్తి) కోసం, మనము, మనకు నిర్ణయించిన
కాలమునకు, మన పనిని మనము,
చేయుచున్నామా లేదా? ఉదా:-ఒక ఉద్యోగికి ఉదయం 10 గం|| ఆఫీసు. ఆ టైమ్ కు వెళుచున్నాడా లేదా?
ఒక కూలి ఉదయం 8 గం|| వెళ్ళుచున్నాడా?, ఒక
కార్మాగార ఉద్యోగికి మధ్యాహ్నం 2గం|| లకు duty కరెక్టుగా ఆ time కు వెళ్లుచున్నాడ లేదా?, ఒక వ్యాపారి ఉదయం 8గం|| వ్యాపారం
ప్రారంబించాలి, చేస్తున్నాడా లేదా?,
ఇంట్లో ఇల్లాలు తన భర్త పిల్లలు ఉదయాన 7గం||
బయలుతేరి వెళ్లాలంటే, పాపం ఆ ఇల్లాలు, వేకువజామునే
ఏ నాలుగింటికో లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, పిల్లలకు, భర్తకు ఉదయం అల్పాహారం,
మధ్యాహ్నం భోజనం ఉదయం 7గం||కు, సిద్దం చేసి వారి వారి
విధులకు, భంగం కలగకుండా వారిని, పంపుతోందా?, పైన వివరించిన వివిధ పనులు వివిధ సమయ పాలన ఎందుకు. కేవలం భుక్తి కొరకు.
మన సంసారం పిల్లలు అందరి శరీరాలు భుక్తితో నిలబడడానికేనా? బాగా ఆలోచించండి? మరి ఒకొక్కరూ రోజుకు 8గం||లు, మరీ అదనపు ఆదాయం
ఇస్తామంటే, ఇంకా ఎక్కువ గంటలు పనిచేయడం లేదా? మరి భగవంతుడు మనకు ఈ మానవ శరీరం, మానవ
ఉపాధి ఇవ్వకపోతే, ఇవన్నీ మనము చేయగలమా? మాన
ఉపాధి కాక (ఏ కుక్కో, ఏ పామో, ఏ
బల్లో) ఉపాధి అయితే ఇవన్నీ సాధ్యమా? ఈ జనజీవనంలో మిగతా ఉపధులను మనము చూడడంలేదా? అవి ఎలా బ్రతుకుతున్నాయో, మనము నిత్యమూ చూడడంలేదా? అవి ఉపాధులు కావా వాటికి జీవం లేదా? అవి
బ్రతకడంలేదా? వాటికి క్రమశిక్షణ ఉన్నదా? మంచి చెడులు ఆలోచించే జ్ఞానము కలదా? మరి
భగవంతుడు మనకు ఇంతగొప్ప ఉపాధిని ఇచ్చి దీనితో వేదములు,
ఉపనిషత్తులు, పురాణములు చదివి, విని
అర్ధంచేసుకొనే శక్తినిచ్చి, పెద్దలు చెప్పిన విధముగా బ్రతుకమని, నిత్యమూ ధర్మమును గురించి ఆలోచించుచూ, సత్త్య
భాషణమే చేయుచూ, పరోపకారియై, ధర్మాన్ని
రక్షించుచూ, నిత్యమూ భగవంతుని పూజలో, భగవంతుని ధ్యానముతో బ్రతుకమని భగవంతుడు మనకు అవకాశము ఇస్తే దానిని ఇలా
వృధా చేయడం న్యాయమా?
పరమాత్మకు మనము
మాతృ గర్భములో ఉన్నప్పుడే పరమాత్మను ప్రార్ధించాం,
ప్రమాణము చేశాము. పరమాత్మా నన్ను త్వరగా ఈ (మురుకి కూపమునుండి)
మాతృగర్భము నుండి బయట పడవేయుము. బయటకు వచ్చిన తర్వాత నేను నీకుకృతజ్జ్ణుడుగా
(నన్ను ఈమురుకి కూపమునుండి బయట పడ వేసినందుకు) ఉంటూ నిత్య పూజలతో, భజనలతో, ధ్యానముతో నిన్ను మరువను, పొరపాటునకూడ ఈ సంసార బంధనములో చిక్కుకోను, నన్ను
నమ్ము అని మాట ఇచ్చి, పరమాత్మకు ప్రమాణము చేసి, ప్రస్తుతము మనము చేయుచున్న దేమిటి? ఒకసారి
హృదయ ము మీద చేయి వేసుకొని ఆలోచించి నిస్పక్ష పాతముగా చెప్పండి? రోజూ, ఒక గంటసేపైనా స్వామికి
పూజ చేయడానికి మనకు, తీరిక, సమయము లేదా? పురాణ కధలు వినడానికి, తీరిక, సమయము లేదా? ఇంతగొప్ప ఉపాధిని ఇచ్చిన పరమాత్మను,
ఆలయమునకు వెళ్ళి చూడడానికి, ఆలయములకు వెళ్ళడానికి, తీరిక, సమయము లేదా? మిగతా అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి, అడ్డమైన పనులు చేయడానికి, సోల్లు కబురులు చెప్పుకోవడానికి, పరనిందలు చేయడా నికి, తీరిక, సమయమూ, పుష్కలంగా ఉందా? ఒక్కసారి బాగా లోతుగా ఆత్మవిమర్శ చేసుకొని
గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి?
నిజం చెప్పాలంటే
మనము పరమాత్మ పట్ల చూపు వినయము,విధేయత, చేయు
సేవ, దాస్యము,
ధ్యానమూ పూజ, హోమము కేవలం పరమాత్మ
కొరకు మాత్రమేకాదు. మన అభ్యున్నతికి, మన చుట్టూ ఉన్న సమాజము అభ్యున్న
తికి, మన పిల్లలూ, వారి పిల్లలూ
(వంశాబివృద్ధికి, దేశాభివృధికి) అభివృద్ధికి మాత్రమేనని
మరచిపోకండి. ఈ మానవ ఉపాధి, శరీర పోషణకు
ఆహారము, నీరు,
గాలి, వెలుతురు ఎంత అవసరమో, మనలోని జీవాత్మకూ,
పరమాత్మల పోషణకు సత్యభాషణమూ, ధర్మానుష్టానమూ,
నిత్య పూజ, నిరంతర స్మరణ అంతే అవసరము.
గర్భములో
శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?
స్త్రీ
గర్భములోనే శేషన దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన
తరువాత శిశువు పరిణామక్రమము.
ఒక రోజుకు ఖలిలమౌతాడు.
ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది.
పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.
ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది.
రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి.
మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి.
నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి.
ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి.
ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.
మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన
మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకాను భవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది.
తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు (ఉప్పు) లవణాది
పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చేత ప్రేవుల చేత
చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధశిరస్కుడై తల్ల
కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షి లాగా జీవుడు గర్భంలో బంధింప బడి ఉంటాడు. అప్పుడు
భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి.
అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుచూ ఉంటాడు. కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని
గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు
కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో (మరలా మానవ జన్మ ఇచ్చినందుకు)
గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు.
గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ
మానవజన్మ. అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం
చేస్తాడు.
ఓ శ్రీహరీ నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము,
మమకారము, కామము వీటియందు పడి, సంసార
నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి,
చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన
సంపాదనే ధ్యేయంగా, చేయకూడని,
చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను. అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి
పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా
పాలు అయినది.
ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను
బయటపడవేయుము. నేను బయటపడితే ఈ సారి పాపకృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము. మీ
చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి
పొందడానికి ప్రయత్నము చేస్తాను. ఈ సారి నాకు సంసారబంధములను కట్టబెట్టవద్దు.
పొరపాటున కూడా సంసారము జోలికి పోను. పరాత్పరా ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును
భరిచలేక, మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను. భరించలేకున్నాను. నన్ను
బయట పడవేయుము. మిమ్ములను మరచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు.
మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా? ఆలోచించండి. మీరే తగు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనము విజ్ఞులము.
గరుడ పురాణ ప్రధమాధ్యాయ ఇహిక, ఆనుష్మిక, దుఃఖ నిరూపణము నుండి.
మాతృగర్భము-మరుభూమి.
మనము అందరమూ
ఆలోచించే శక్తికలవారము. భగవంతుడు మనకు మాత్రమే అంతటి జ్ఞానాన్ని శక్తిని ఇచ్చాడు.
దయచేసి బాగా నిస్వార్థంగా ఆలోచించండి.
ఎంతటి వారైనా కోటీశ్వరుడైనా,మిలీనియరైనా, బిలీనీయరైనా, చక్రవర్తి అయినా, ఎవరైనా
ఈ భూమి మీదకు రావడానికి ద్వారం మాతృగర్భమే. ఈ కలియుగంలో కరాచరణాదులతో కదలాడే ఎంతటి
వారైనా స్వాములు అయినా భాగవతులైనా మాతృగర్భంనుండే వస్తారు. మరలా వెళ్ళేది
మరుభూమికే. అవునా? మాతృ గర్భంనుండి రావడానికి రెండు మార్గాలు. 1)
సహజ జననం (సాధారణ కాన్పు) 2)వైద్యవిధమైన క్లిష్టమయిన కాన్పు(సిజేరియన్) కత్తులతో
కోసి బిడ్డను తల్లిని రక్షించడం. అంటే జననం ఎలా జరిగినా మాతృగర్భంనుండే
జరుగుతుంది.
మరణం తర్వాత ఈ మరణిచిన శరీరం వెళ్లిపోవడానికి రెండే రెండు మార్గాలు :-
1)ఖననం చేయడం.(శరీరమును భూమిలో గొయ్యి తీసి భూమిలో కప్పేయడం. 2)దహనము. చితిపేర్చి
అగ్నితో దహింప చేయడం. ఏదైనా మరుభూమిలోనే జరుగుతుంది.
ఇపుడు ఆలోచిస్తే
మరుభూమికి, మాతృగర్భానికి ఎలాంటి తేడాలేదు. మాతృగర్భం
మురికి కూపం, మల మూత్రాల నిలయం. దుర్గంధ భూయిష్టం. అలాగే
మరుభూమి కూడా బహు జుగుప్సాకర ప్రదేశం. బహు భయంకరమై భయమును కల్గించే ప్రదేశం. దుర్వాసనలతో, దుర్గంధ పూరితమైన స్థలం. మరి రెంటికీ తేడా ఏమిటి.
మాతృ గర్భము
నుండి జననము జరిగే సమయంలో, బంధువులు మిత్రులు అందరూ ఎప్పుడెప్పుడు జననం
జరుగుతుందా బిడ్డను చూద్దామా అని ఆదుర్ధాగా ఉంటారు. మరి మరుభూమిలో ఎప్పుడు ఈ
కార్యక్రమం అయిపోతుందా ఎంత తొందరగా ఇంటికి వెళదామా అని ఆదుర్దా? అవునా? ఆలోచించండి. అందుకే మన పెద్దలు అన్నారు “ప్రసూతి
వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని”.
ఏది శాశ్వతము?
మనము అందరమూ
విజ్ఞానవంతులం. చదువుకొన్నాం. ఏదైనా ఒక విషయమును లోతుగా చర్చించగలము. బాగా
ఆలోచించగలము. ఔనా? అయితే
మనము పూజలు చేసే దేవుళ్ళు( రాముడు, కృష్ణుడు, శివుడు, సాయిబాబా, లక్ష్మీదేవి) ఇలా ఎంతోమంది. వారివారి అభిమతమును
బట్టి, విశ్వాసమును బట్టి వారి పూర్వీకుల ఆచార వ్యవహారములను
బట్టీ ఆయాదేవుడు. ఈ ఉపాధిని(మానవ శరీరమును) సృజించినది దేవుడు. కదా?మరి ఈ ఉపాధి శాశ్వతమా? దేవుడు సృష్టిస్తున్నాడు, చెట్లను, రకరకాల ప్రాణులను,
అడవులను, నీటిని, గాలిని మరి అవి శాశ్వతమా? మానవుడు సృష్టించిన ఈ ధనము, బంగారము, మిద్దెలు, మేడలు,
శాశ్వతమా? ఆలోచించండి. దేవుడు సృష్టించిన సృష్టికే శాశ్వతత్వము
లేనప్పుడు మనము సృష్టించుకొన్న ఈ విషయ వాసనలు శాశ్వతమా? ఎందుకు
మనకు ఇంత వ్యామోహం. ఆలోచించండి.
కనీసం యుగములు
శాశ్వతమా? కృతయుగం,త్రేతాయుగం,
ద్వాపరయుగం,
కలియుగం, ఏ యుగము శాశ్వతముగా ఉందో ఆలోచించండి? ఆయా యుగ కర్తలు ఆ యుగములలో ధర్మరక్షణకు ధర్మసంస్థాపనకు వచ్చిన మహాపురుషులు
దేవుళ్ళు, వారైనా శాశ్వతమైయున్నారా? వారి
గుణములను వారి ధర్మవర్తనను ఈనాడు మనము కీర్తిస్తున్నాము,
భజించుచున్నాము , పూజించుచున్నాము కానీ ఆచరణమునకు మాత్రం
ప్రయత్నించడం లేదు. లేదా ధర్మమును ఆచరించాలి, అనే
ప్రయత్నమును గురించి కూడా ఆలోచింపము. ఔనా?
ఎలాగంటే ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము లా ఉంటుందే కానీ, ఆచరణకు మాత్రం ధర్మం యోగ్యముకాదు. ఔనా?
గుడిలోనో, ఉపన్యాసము వింటున్నప్పుడో, లేదా
ఏదేని ఉత్సవాలు జరుగుచున్నప్పుడో అందరూ
ధర్మపన్నాలు వల్లిస్తాం. బయటకు రాగానే యధా జీవితం. ఔనా? కాదా?మనకు మనము ఆత్మవిమర్శ చేసుకుందాం. ఆలోచిద్దాం.
త్రేతాయుగము
చివరన శ్రీ రామ నిర్యాణం జరుగలేదా? ద్వాపరయుగం ఆఖరున శ్రీ కృష్ణ నిర్యాణం జరుగలేదా? మనము చదువుకోలేదా? తెలుసు
బాగా తెలుసు. ఆలోచించండి మనము శ్రీరామచంద్ర ప్రభువు కంటే గొప్పవారమా? శ్రీ
కృష్ణ పరమాత్మ కంటే జ్ఞానులమా, అధికులుమా? మరి ఏంటి
మన గొప్ప. మన డాబు, మన దర్పం, మన అహం
ఇలాంటి అరిషడ్వార్గాలను నిత్యమూ పెంచిపోషిస్తున్నాము. ఈ పెంచి పోషించిన ఫలము కూడా
మనకు తెలుసు. అందుకే శ్రీ పోతన గారు భాగవతములో “లోకంబులు, లోకేశులు,
లోకస్తులు తెగిన తుదిని పెంచీకటి కవ్వల నేవ్వండేకాకృతి వెలుగు,
అతనినే భజింతున్ ” లోకాలు లోకాది దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లోకస్తులు అందరూ వెళ్ళిన తర్వాత కూడా చివరలో ఈ
బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అలాగా అన్నీ
లోకములు లోకముల దేవతలు అధిపతులు పోయినా కూడా అంత గాఢాంధ కారములో ఏ పరబ్రహ్మము, జ్యోతి స్వరూపముతో నిలబడి ఉందో ఏ పరదేవత ఉందో వారికి నేను నమస్కరిస్తాను.
వారే శాశ్వతులు. యుగాలను, యుగపురుషులను,
లోకాలను, లోకాధిపతులను సృజించే పరదేవతే ఆపరమాత్మే నిత్యుడు,శాశ్వితుడు.
మనసు బుద్ధి
దేనిని ఏది సంస్కరించాలి?
భగవంతుడు కేవలం
శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది.
ఇందులో స్పందన వేరు, కదలిక వేరు,
కార్యము వేరు.
ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు
చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ
నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన
సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది.
కార్యమైతుంది.
మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు
తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు.
మనస్సు కూడా అంతే.
సంకల్పము-పట్టుకోవడం
వికల్పము-విడిచిపెట్టడం
మనస్సు-చిన్నపిల్లవాడు
బుద్ధి-అమ్మ
ఉదా:- చిన్న బిడ్డ
తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక
దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత
బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా?
ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా
మట్టిగాని మలము తినాలని అనిపించినా
దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ
చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి
వెళ్ళడు.ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ)
ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే
మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ
దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి.
కాబట్టి బుద్ధి
బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి
రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు.
“గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు
దాని పాపమేమె కానరాదు
అఖిల పాపములకు నిలయమైన
మనసు గొరగడేమి మానవుండు”
చూశారా మనసు పరిస్థితి.
మనసు
ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు
సాధన సహాయము ఆసరా అవసరం లేదు.
ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది
నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి
సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా? ఎవరైనా హంసను చూచిన
దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు.
అందుకే పరమహంస అంటే పరమాత్మను, జగత్తును విడకొట్టి సత్యాసత్యములను
తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి
తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే
విషయం మనకే తెలుస్తుంది.
పూజ ఎలా
చేయాలి. ఎవరు ఎవరికి చేయాలి.
పరమాత్మ నుండి
విడివడిన ఈ జీవాత్మను(మానవ ఉపాధిని ఆశ్రయించిన) మరలా పరమాత్మలో చేర్చడానికి ప్రతి
మానవ ఉపాధి పరమాత్మ ప్రసన్నత కొరకు పూజ చేయాలి. పూజ చేస్తే అంతఃకరణశుద్ధి, ధర్మబద్దమైన జీవనము అలవాటై జీవాత్మ పరమాత్మ వైపుకు తిరుగుతుంది.
ప్రతి మానవుడు
సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తములో నిద్రలేవాలి. బ్రహ్మ ముహూర్తమానగా
సూర్యోదయానికి 88 ని|| ముందు ఉన్న కాలమును బ్రహ్మముహూర్తకాలమని
అంటారు.
నిద్ర ఎలా లేవాలి?
1) ప్రతి రోజూ నిద్రనుండి మేలుకువ వస్తోంది అని తెలియగానే మన మనస్సులో మన
కులదైవం పాదాలను దర్శించాలి. ప్రణమిల్లాలి.(నమస్కరించాలి).
2) శ్రీ హరి, శ్రీ హరి, శ్రీ
హరి అంటూ నిద్రలేవాలి.
3) నిద్ర నుండి లేవగానే తన చేతులు (అరచేతులు) చూచుకోని మనస్సులో
నమస్కరించాలి.
“కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ,
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం” అన్నారు ఆర్యులు.
1) భూమి మీద కాలు మోపే ముందు భూమాతకు నమస్కరించి భూమిపై పాదములు (ముందు
కుడిపాదము, తర్వాత ఎడమ పాదము)పెట్టాలి.
2)
నిద్రలేచి
భూమి మీద నిలబడగానే మన మనస్సులో మన గురువు గారిని వారి పాద పద్మములను
స్మరిస్తూ(నిజంగా గురువు గారే మన ముందు నిలుచున్న భావనతో) నమస్కరించాలి.
తమ తమ ఇష్ట దైవములను పూజ
చేయుటకు ఉపక్రమించాలి.శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ
వెంటకేశ్వరుడు, శివుడు, శ్రీ
వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, సాయిబాబా, లక్ష్మీదేవి,
సరస్వతి, పార్వతి, అల్లా, జీసస్, ఎవరైనా కావచ్చు. నిజానికి భగవంతునికి లింగ బేధము లేదు. పరమేశ్వరుడు
పురుషుడు కాదు, స్త్రీ కాదు,
నపుంసకుడు కాదు అరూపరూపి. వారి వారి నమ్మకములను బట్టి వారి వారి గురూపదేశమును
బట్టి పూజిస్తారు.
సూర్యుడు ఉదయించక పూర్వము
మరలా సూర్యుడు అస్తమించక పూర్వము (సూర్యుడు అస్తమించేముందు). పూజ చేయాలి.ఎందుకు?
సూర్యుడు బ్రహ్మ, విష్ణు, శివాంశ
స్వరూపముల కలయికే సూర్యభగవానుడు. యదార్థమునకు సూర్యుని స్వరూపము ఒక కాంతి ముద్ద. ఈ మాంస నేత్రములతో చూడగలిగిన ప్రత్యక్ష దైవం సూర్యుడు. “ఆరోగ్యం
భాస్కరాద్యిచ్ఛేత్”. కావున సూర్యభగవానుని గమనాన్ని అనుసరించి, పూజాదికార్యక్రమాలు జరగాలి. కాలకృత్యములు తీర్చుకొన్న తర్వాత స్నానం చేయాలి.
పరబ్రహ్మ స్వరూపమైన ప్రాతఃకాల సూర్యుడు ఉదయించే సమయానికి:-యజ్ఞోపవీతం(జంధ్యము)
ఉన్న ప్రతి ఒక్కరూ సంధ్యావందనం చేయాలి.కేవలం యజ్ఞోపవీతం ఉన్నవారే కాదు అందరూ కూడా
సంధ్యావందనం చేయవచ్చు.
“బ్రహ్మే ముహూర్తే ఉత్తిష్టేత్” అందుకు చెప్పింది వేదము. బ్రహ్మ ముహూర్తము సూర్యోదయానికి
88 ని|| ముందు లేచి స్నానము చేసి సంధ్యావందనం పూర్తి చేసుకొని
ఆర్ఘ్యం ఇచ్చేసి సంధ్యావందన గాయిత్రి జపం చేస్తున్నవాడవై భగవంతునకు స్వాగతం పలుకుచున్నట్లు
గాయత్రి జపం చేస్తూ ఉండాలి.
యజ్ఞోపవీతము
(జంధ్యము)యొక్క వివరణ
ఉపనయనములో ధరించునది - “బ్రహ్మ సూత్రము”
వివాహంగముగా ధరించునది - “యజ్ఞ సూత్రము”
యజ్ఞోపవీతము లోని దారములు 3X3=9 ఆతొమ్మిది దారముల వివరణ
1 ఓంకారము – ప్రధమ
తంతౌన్యసాని
2 అగ్ని - ద్వితీయ
తంతౌన్యసాని
3 నాగాన్ - తృతీయ
తంతౌన్యసాని
4 సోమం - చతుర్ధ తంతౌన్యసాని
5 పితౄన్ - పంచమ
తంతౌన్యసాని
6 ప్రజాపతి - షష్ఠ
తంతౌన్యసాని
7 వాయుమ్ - సప్తమ
తంతౌన్యసాని
8. సూర్యం - అష్టమ తంతౌన్యసాని
9 సర్వాన్ దేవాన్ – నవమ తంతౌన్యసాని
ఈ యజ్ఞోపవీతము యొక్క విలువ ప్రాశస్త్యము ఈ విధముగా ఉండడమేకాక
“ఇదం ద్యావా పృధివీ సత్తమస్తు Iపితర్మా తర్యది హోప
భృవేవా
భూతందేవానామావమేఅవోభిః
Iవిద్యామేషం వృజనం జీరదనుమ్”.
జందెపు పోగు
తెగినపుడు, జాతశౌచము,
మృతాశౌచము, గ్రహణము తర్వాత, ప్రతి
నాలుగు మాసములకు, శవమును తాకినపుడు నూతన యజ్ఞోపవీతమును విధిగా
ధరించాలని వేదము తెలియచేస్తున్నది.
మూత్రవిసర్జన సమయంలో జంద్యమును కుడిచెవికి
చుట్టుకోవలయును.
పురీషాది శౌచకర్మలందు (బహిర్బూమిలో) జంద్యమును
ఎడమ చెవికి చుట్టుకోవలయును.
గోదాన సమయములో
గురువులకు, బ్రాహ్మణులకు మొII వారికి
యజ్ఞోపవీతము దానమీయవలయును. పితృదేవతలను పూజించి వస్త్రములతోపాటు యజ్ఞోపవీతమును
దానముగా ఇవ్వవలయును. శ్రాద్దమున వస్త్రములను దానము చేయలేనివారు యజ్ఞోపవీతమును
దానము ఇవ్వవలయును.
యజ్ఞోపవీతమును
ఎలా ధరించాలి
యజ్ఞోపవీత ధారణ విధిః
తూర్పుదిశగా కూర్చొని ఆచమనము చేయాలి.
ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మదుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోధరాయ నమః
ఓం శ్రీ వాసుదేవాయ నమః
తర్వాత ప్రాణాయామము చేయాలి:-
ముక్కుతో, గాలి వదులుతూ, కుడి
ముక్కును మూసి, ఎడమ ముక్కుతో, గాలిని
పీల్చుతూ, చేయునది పూరకం.
“ ఓం భూః ,ఓం
భువః, ఓం స్వః,ఓం
మహః, ఓం జనః,ఓం
తపః,ఓం సత్యం.”
కుంభకం:- రెండు ముక్కులు మూసి గాలిని లోపల బంధించడం.కుంభకం
చేస్తూ
I
II II I I II
“ఓం తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః
ప్రచోదయాత్!
ఓ మాపో జ్యొతీ రపోమృతం
బ్రహ్మ ”
రేచకం:-
ఎడమముక్కును మూసి, కుడిముక్కుతో గాలిని పూర్తిగా వదలడం.
కుడిముక్కునుండి గాలిని వదులుతూ
“భూర్భువ స్సువరోమ్ ”
అని చెప్పిన తర్వాత కుడిచేతితో కుడిచివిని తాకవలెను.
వినాయక ప్రార్ధన:-
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
సంకల్పము
శ్రీ గోవింద! గోవింద! గోవింద! శ్రీ మహావిష్ణో రాజ్ఞయా
.................................................. భగవత్ భాగవత ఆచార్య
కైంకర్యరూపేణ మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుస్టాన యోగ్యతా సిధ్యర్ధే నూతన
యజ్ఞోపవీత ధారణే వినియోగః.
యజ్ఞ్యోపవీతమును ఒక తట్టలో మన ముందుంచుకొని తీర్థముతో ఈ క్రింది మంత్రముతో
అభిమంత్రించవలెను.
అపోహి ష్టేతి త్రిర్చస్యసూక్తస్య సింధుద్వీప
అంబరీష ఋషిః
అపోదేవత గాయత్రీఛందః జలప్రోక్షణే వినియోగః |
అపోహిష్టామయో భువస్తాన ఉర్జేదధాతన
మహేరణాయ చక్షసే||
యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహవః |
ఉశతీర్ వ మాతరం||
తస్మా అరంగమామవో యస్యక్షయాయ జివ్వాధ |
అపోజనయాధాచనః ||
ఓం హిరణ్యవర్ణాశ్శుచయః పవకా యా సుజాతః కశ్యపోయా
స్వింద్రః
అగ్నింయాగర్భం దధీరేవసునాస్తాన ఆపశ్యం
స్యోనాభవంతు
యాసాంరాజా వరుణో యాతిమధ్యే సత్యానృతే అనపశ్యంజనానాం
మధుశ్చుత శ్శుచయో యాః పావకా స్తానా ఆపశ్యంస్యోనాభావంతు
యజ్ఞోపవీతమును చేతిలో (దోసిలిలో) ఉంచి సూర్యమండల మధ్యవర్తి నారాయణునికి
చూపుతూ మూడు పర్యాయములు ఈ క్రింది మంత్రమును పఠించాలి.
ఉద్యన్నద్యేతి యజ్ఞోపవీతం తిసృభిః సూర్యాయ
దర్శయిత్వా
ఓం ఉద్యన్నద్య మిత్రమహః ఆరోహ న్నుత్తరాం దివమ్ |
హృద్రోగమ్మమసూర్య హరిమాణం చ నాశయ ||
యజ్ఞోపవీతమును గాయత్రిమంత్రముతో ఒక్క మారు
స్పృశించవలెను
ఓం భూర్భువస్స్వః తత్స వితుర్వరే
ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః
ప్రచోదయాత్!
కుడి అరచేయిని పైకి వచ్చు విధముగా కుడి అరచేతిలో యజ్ఞోపవీతము ముడి
అంగుష్టంవైపు ఉండునట్లుగా, ఎడమ అరచేయని క్రిందకువచ్చు విధముగా అరచేతిలో
యజ్ఞోపవీతమును ఉంచుకొని రెండు చేతులూ ముందుకుచాచి ఈ క్రింది మంత్రమును, మంత్రయుక్తముగా అనుసంధానము చేసుకొని యజ్ఞోపవీతమును కంఠము నందు
ధరించవలెను.
యజ్ఞోపవీతమితి
మంత్రస్య పరబ్రహ్మఋషిః, పరమాత్మా దేవతా,
త్రిష్టుప్ ఛందః, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుస్టాన యోగ్యతా
సిధ్యర్ధే నూతన యజ్ఞోపవీత ధారణే వినియోగః.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపటతేర్యత్సహజం పురాస్తాత్!
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు
తేజః !
గృహస్తు మరి రెండు యజ్ఞోపవీతములను పైవిధముగా ఆచమనం చేసి మంత్రమును, మంత్రయుక్తముగా అనుసంధానము చేసుకొని యజ్ఞోపవీతధారణ చేయవలయును.
జీర్ణ
యజ్ఞోపవీతమును (మనము ధరించియున్న పాత యజ్ఞోపవీతమును) విసర్జిస్తూ
ఈ క్రింది శ్లోకమును అనుసంధాన ము చేసుకొని యజ్ఞోపవీతమును పైకి
అనగా, శరీరము తలవైపునుండి తీయరాదు. శరీరము క్రింద భాగమునుండి
అనగా కడుపు, కాళ్ళవైపు నుండి కాళ్లు తగలకుండా పవిత్రముగా, భక్తితో తీయవలయును. పాత యజ్ఞోపవీతమును పళ్ళెములో ఉంచి పవిత్ర
జలముతో సంప్రోక్షించిన తర్వాత ఆ యజ్ఞోపవీతమును కళ్ళకు అద్దుకొని ప్రక్కన
పెట్టవలయును.
ఉపవీతం యజ్ఞసూత్రం కశ్మలమ్ మలదూషితం
విసృజామి హరే బ్రహ్మన్ వర్చో దీర్ఘాయురస్తుమే!
జీర్ణ యజ్ఞోపవీతం విసృజ్య
సముద్రంగచ్చస్వాహేతి మంత్రేణ విసర్జయేత్!
ఓం సముద్రం గచ్చస్వాహాతరిక్షం గచ్చస్వాహ దేవగుం
సవితారం గచ్చస్వాహ||
జీర్ణ యజ్ఞోపవీతమును తొలగించిన తర్వాత ఎవరూ త్రొక్కని
ప్రదేశములో వదలివేయవలయును.
తర్వాత మళ్ళీ ప్రాణాయామమును చేసి,
గాయత్రీ మంత్రమును అనుసంధానించవలయును.
ముఖ్యగమనిక :- యజ్ఞోపవీతమును ధరించిన ప్రతి ఒక్కరూ
నిత్యమూ ఉభయ సంధ్యావందనములు విధిగా ఆచరించి
తీరవలయును.
సంధ్యా వందనము ఎందుకు మరియు ఫలము
ఎన్నోవేల కోట్ల
జీవరాసుల మధ్య జడమై,అజరమై, జడపదార్థం కాని ఎన్నెన్నో
జీవరాసుల మధ్యలో ఉన్న తేజస్సుకొరకు సంధ్యావందనం. లోకంలో
స్థావరమై, జంగమమైన అనేక రూపాలలో మానవ జన్మ అత్యున్నతమైనది. జీవన
సాఫల్యం చెందడానికి,(ఎందుకు జన్మించాము) తన చుట్టూ ఉన్న సమాజమును
ఉద్దరించ డానికి, ఒక వ్యక్తిగా ఉపాసించడమే సంధ్యావందనము. గాయత్రి అనగా భూదేవియే ఉపస్తుగా, విష్ణువే హృదయంగా, శివుడే సర్వవ్యాపి తముగా ఉండే దేవి పరదేవత.
విశ్వభూతరాళాంత మధ్యలో అంతర్గతంగా ఉండే స్వరూపం ఈ గాయిత్రి మాత. ఒక యోగిగా, ఒక ఋషిగా మనము ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయనవసరం లేదు. ప్రతి రోజు ఒక 25
ని||ములు ఈ గాయత్రీ జపం చేయడం వలన తన జన్మకు సాఫల్యం
చేకూర్చినవాడు కాగలడు. మన జీవన యానాన్ని మన చుట్టూ ఉండేవారి జీవనా న్ని, కుటుంబాలని, సమాజాన్ని,
నవోన్వేషణము వైపుకు నడపడం, అమ్మకు(తల్లి)
నాన్నకు(తండ్రి) గురువులకు, పితృదేవతలకు, మాతృ దేవతలకు, మనకు కనిపించని హితోపదేశులకూ, అందరికీ వారిని
స్మరించుచూ వారి శ్రేయస్సుకు, వారి పురోగమనానికి, ఒక
నీటి చుక్క విడువడమే, సంధ్యావందన పరమార్థం. మరియు ఈ మాన ఉపా ధిని
ప్రసాదించిన తల్లి తండ్రులకు, ఈ ఉపాధిని సన్మార్గంలో నడపడానికి చుక్కానియైన
గురువు గార్లకు, హితులకు, సన్నిహితులకు, మిత్రులకు, దైవోపగతు లకు,
ఆత్మీయులకు, ఆత్మజులకు, మన
ఇరుగు పొరుగులకు,సర్వులకు నమస్కరించి వారి అభ్యున్నతిని, శ్రేయస్సును, త్రికరణ శుద్ధిగా అభిలషిస్తూ చేయడమే సంధ్యావందనము.
సంధ్యావందనము
సంద్యావందన సమయ వివరణ
ప్రాతః సంధ్యాసమయము ఉదయం 5-12 AM నుండి 6.00 AM వరకు
మద్యహ్నసంధ్యాసమయము ఉదయం 11-12 AM నుండి 12.00 వరకు
సాయం సంధ్యాసమయము సా II
5-12 PM నుండి
6.00 PM వరకు
ప్రతి రోజూ
ప్రాతః సంధ్యావందనము, ఉత్తర సంధ్యావందనము విధిగా ఎక్కడ ఉన్నా ఏ
ప్రదేశములో(దేశములో) ఉన్నా సంధ్యావందనము తప్పనిసరి.
సూర్యోదయమునకు
ముందు శౌచముతో శుచిగా(స్నానం చేసి)తూర్పు దిశగా కుడి కాలును సగం మడచి ఎడమకాలును
పూర్తిగా మడచి, గొంతుకు కూర్చొని అంటే (ఎడమ కాలు మిడిము మీద
పృష్టభాగము పిర్రలు ఆనించి) పృష్టభాగము(ముడ్డి,గుదము) నేలను(భూమిని) తాకకుండా కూర్చొని, ఆచమనం
చేయాలి.అలా ఆచమనం చేయడం వలన స్థూల, సూక్ష్మ, కారణ
శరీరము యందలి తాపములు, వెంటనే ఉప శాంతిని పొందుతాయి.అపుడు మనస్సు
నిలబడుతుంది.
ఎప్పుడు ఆచమనం చేసినా ఇదే విధానంలో చేయాలి.
ముఖ్య గమనిక :-
సంద్యావందనసమయములో తుమ్మడం,దగ్గడం,అపానవాయువును (పిత్తులు,చెడు గాలిని) వదలడం జరిగిన వెంటనే ఆచమనము చేసి
కుడిచేతితో కుడిచేవినితాకలి లేదా తడిగా ఉన్న భూమిని తాకాలి.
“ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాంగతో పివా!
యస్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిరి!”
అంటూ శిరస్సు మీద జలము(శుద్ద జలము)కుడి చేతి బొటన వ్రేలితో శిరస్సు మీద
చల్లుకొనుచూ
ఓం పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్షాయ నమః”
కేశవ నామాలు ఆచమనం.
కుడి కాలును సగం మడచి ఎడమ కాలును పూర్తిగా మడచి రెండు కాళ్ళ మీద
పృష్టభాగము భూమికి తగులకుండా కాళ్లపైనే కూర్చొని(గొంతుకు)కూర్చొని ఆచమనం చేయాలి.
కుడిచేతి చూపుడు
వ్రేలుకు, మధ్య వ్రేలుకు మధ్య, బొటన
వ్రేలును ఉంచి, చూపుడు వ్రేలుతో బొటన వ్రేలిని అదిమి పట్టుకొని
మిగతా వ్రేళ్లను చాపి ఉంచి, అంటే గోకర్ణాకృతిలో ఉంచి, ఎడమ చేతితో పంచపాత్రలోని శుద్దజలమును కేవలం మినపగింజ మునుగు నంత జలమును, ఉద్ధరణితో కుడిచేతిలో వేసుకొని (తీసుకొనేటప్పుడు కుడి చేతి అరచేతి చివరి
భాగమును క్రింది పెదవికి ఆనించి శబ్దము రాకుండా) ముందుగా
“ఓం కేశవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో
బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
“ఓం నారాయణాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో
బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
“ఓం మాధవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో
బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
“ఓం గోవిందాయ నమః” అని చెప్పుకొనుచూ కుడిచేతిలోని జలమును, ఎడమ వైపు కాలు ప్రక్కన వదలవలయును.
ఎప్పుడు ఆచమనము చేసినా ఇదే పద్దతిన చేయవలయును.
నమస్కారము
చేయుచూ ఈ క్రింది నామములు, భక్తితో త్రికరణ శుద్దిగా అంటే మనము ఉచ్ఛరించే
ప్రతినామమూ యొక్క రూపమును, హృదయమునందు ఊహించుకొనుచూ శ్రద్ధాభక్తులతో మనో
నేత్రముతో స్వామి వారి రూపమును చూచుచూ తదేక
ధ్యానముతో ఉచ్చరించవలయును. (కరన్యాస ప్రక్రియ కూడా కలదు) చేయ దలచిన వారు చేయవచ్చు
లేదా నామములను మాత్రమే కూడా ఉచ్ఛరించవచ్చు.
ఓం విష్ణవే నమః
ఓం మధుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోధరాయ నమః
ఓం సంకర్షనాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అదోక్షజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్థనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
భూశుద్ది :- ఈ మంత్రం చెప్తూ కొద్ది శుద్దజలమును కుడిచేతిలోనికి తీసుకొని మన చుట్టూ
చల్లుకోవలయును. ఎందుకంటే మన గృహంలో నిన్నటి రోజున సింహాసనమునకు చేసిన అలంకారము మరియు
భగవంతునికి సమర్పించిన ధూపదీప నైవేద్య ఫల పుష్పఫలాది నిర్మల్యాన్ని మనకంటే ముందు
భూత పిశాచములు ఆ నిర్మాల్యాన్ని తీయడానికి ప్రయత్నిస్తాయి. అందుకొరకు మనము
సూర్యోదయానికి పూర్వమే ఆ పని చేయాలి. అందుకొరకు ఈ మంత్రం.
“ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యేతే భూమి భారకాః
ఏ తేషా మా విరోధేన బ్రహ్మ కర్మ
సమారంభే ||”
ఈ మంత్రం చెప్పుకొన్న తర్వాత రెండు అక్షింతలు తీసుకొని వాసన చూచి వెనుకకు
వేసుకోవలయును.
శ్లో ||
శుక్లాం భరధరం విష్ణుమ్ శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న
వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
శ్లో|| అగజానన
పద్మార్కం గజానన మహర్నిశం
అనేక
దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే ||
అని చెప్పుకొని వినాయకుని కి
కొద్ది అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు, సమర్పించాలి.
శ్లో ||
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం
భూయో భూయో నమామ్యహమ్.
శ్లో ||
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యేత్రయంబకే
దేవీ నారాయణి నమోస్తుతే||
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
ఓం శ్రీ ఉమామహేశరాభ్యాం నమః
ఓం శ్రీ వాణీ హిరణ్యాగర్భాభ్యాం నమః
ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః
ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
ఓం శ్రీ మైత్రేయీ కాత్యాయనీ సహిత యాజ్ఞ వల్కాభ్యాం నమః
ఓం శ్రీ సర్వదిగ్దేవతాభ్యాం నమః
ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః
ఓం శ్రీ గ్రామదేవతాభ్యాం నమః
ఓం శ్రీ గృహదేవతాభ్యాం నమః
ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః
ప్రాణాయామం:- తూర్పు వైపుకు తిరిగి గొంతుకు కూర్చొని ప్రాణాయామం చేయాలి.
పూరకం:-
కుడి బొటన వ్రేలు ఉంగరపు వ్రేలుతో, ముక్కును పట్టుకొని, మధ్య
వ్రేలినిలోనికి ముడువ వలెను. బొటన వ్రేలును కుడి ముక్కు పైన ఉంగరపు వ్రేలును ఎడమ
ముక్కుపైన ఉంచి. ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతో, గాలి వదులుతూ, కుడి ముక్కును మూసి, ఎడమ
ముక్కుతో, గాలిని పీల్చుతూ,
చేయునది పూరకం.
“ ఓం భూః ,ఓం
భువః, ఓం స్వః,ఓం
మహః, ఓం జనః,ఓం
తపః,ఓం సత్యం.”
కుంభకం:- రెండు ముక్కులు మూసి గాలిని లోపల బంధించడం.కుంభకం
చేస్తూ
I
II II I I II
“ఓం తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!
ఓ మాపో జ్యొతీ రపోమృతం
బ్రహ్మ ”
రేచకం:-
ఎడమముక్కును మూసి, కుడిముక్కుతో గాలిని పూర్తిగా వదలడం.
కుడిముక్కునుండి గాలిని వదులుతూ
“భూర్భువ స్సువరోమ్ ”
అని చెప్పిన తర్వాత కుడిచేతితో కుడిచివిని తాకవలెను.
ఎప్పుడు ప్రాణాయామము చేసినా ఇదేవిధముగా చేయాలి. సందర్భము ఏదైనా ఇందుకు భిన్నముగా ప్రాణాయామము
చేయరాదు.
సంకల్పము:-
కరన్యాసము :-
ఎడమ అరచేతిపై కుడి
అరచేతిని అడ్డముగా బోర్లించిరెండు చేతులు కలిపి కుడి మోకాలుపై ఉంచి సంకల్పము
చెప్పవలయును.
మమ
ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే
శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞ్యాయా ప్రవర్తమా నస్య ఆద్య బ్రాహ్మణ, ద్వితీయ, పరార్ధే,
శ్వేతవరాహకల్పే, వైవస్వర,
మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే,
జంబూద్వీపే, భరతవర్షే,
భరతఖండే, మేరుహో, దక్షిణదిగ్భాగే, శ్రీ
శైలస్య, ఈశాన్య ప్రదేశే, సమస్త
బ్రాహ్మణ, హరి హర, గురు చరణ,
సన్నిధౌ, అస్మిన్, వర్తమానస్య,
వ్యావహారిక చాంద్రమనేనా, శ్రీ .......................... (నందన)
నామసంవత్సరే, ..................(ఉత్తరాయణే) ఆయనే, .............. (వర్ష) ఋతౌ, ................
(వైశాఖ) మాసే, ...........(శుక్ల) పక్షే, ........... (దశమీ) తిధౌ, ........ (సోమ) వాసరే, శుభ
నక్షత్రే, (బ్రాకెట్లలో చూపిన సంవత్సర, ఆయన, ఋతు, మాస, పక్ష, తిధి, వారములు పేర్లు ఉదాహరణకు
మాత్రమేనని గ్రహింప గలరు) శుభయోగే, శుభకరణ, ఏవంగుణ
విశేషణ, విశిష్టాయామ్, శుభ తిధౌ శ్రీ పరమేశ్వర
ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ప్రాతః సంధ్యా, (ఎడమ చేతిలోని ఉద్దరిణితో జలము తీసుకొని
కుడిచేతిని పాత్ర పైన ఉంచి ఉద్ధరిణిలోని
జలమును కుడిచేతి మీదుగా పాత్రలోనికి వదలుతూ) ముపాశిష్యే,
(అనిచెప్పుకోవాలి).
శుద్ధోదక స్నానం:-
ఉద్దరిణితో జలము
తీసుకుని కుడి చేతి బొటన వ్రేలిని
ఉద్దరణిలోని జలములో ముంచి తలపై చల్లుకొనుచూ ఈ క్రింది మంత్రమును అను సంధానము చేయవలయును. బ్రాకెట్లో (జ) అని ఉన్న
చోటుకు ముందు ఆపి జలమును తలపై చల్లుకొనుచూ ఈ మంత్రమును అను సంధానము చేయవలయును.
ఓం “ ఆపోహిష్ఠమయో (జ) భువహ తాన ఊర్జే (జ)
తధా తన! మహేరాణా య చక్షసే (జ) యోవ శ్శివత యో
రస్సః (జ)
తస్య భాజయతే హనః (జ) ఉశ తీరివ (జ) మాతరః (జ)
తస్మా ఆరంగ మామ వో (జ) యస్యక్షయాయ జిన్వథ! (జ)
అపో జనయథా చనః!” (జ)
ప్రాతఃస్సంధ్యా వందనములో అనుసంధానించవలసిన
మంత్రము
గోకర్ణాకృతిలో ఉంచుకుని యున్న కుడి చేతిలో జలము తీసుకుని
“ సూర్యశ్చేత్యస్య మంత్రస్య నారాయణ ఋషిః, ప్రకృతీ బంధః
సూర్య మామన్యు
పాతయ రాత్రిర్దేవతాః జలాభి మంత్రణే వినియోగః”
మంత్రము:-
“ ఓం సూర్యశ్చ మామ న్యుశ్చ మన్యు పతయశ్చ మన్యు
కృతేభ్యః
పాపే భ్యో రక్షన్తాo యద్రా త్ర్యా పాపమ కారుషం
మనసా వాచా హస్తా భ్యాం పద్భ్యా ముదరెణ శిశ్నా
రాత్రి స్తద వలుంపతు యత్కించ దురితం మయి
ఇద మహం మామ మృత యోనౌ సూర్యేజ్యోతిషి
జుహోమిస్వాహా !!”
అని సంధానించుకొని చేతిలోని జలమును త్రాగవలెను.
ప్రాతః
సంధ్యావందనం సంపూర్ణం.
మధ్యాహ్నిక సంధ్యావందనం
ఈ మధ్యాహ్నిక సంధ్యావందనము మధ్యాహ్నము 12 గంII లు దాటకముందు చేయవలయును. ప్రాతః సంధ్యావందనము తో
ప్రారంభించి (ప్రారంభమునుండి) కేశవనమాలు, ఆచమనం, భూశుద్ధి, ఫ్రాణాయామము,
సంకల్పము, శుద్దోదక స్నానము వరకు యధావిధిగా ఆచరించి
ప్రాతః సంధ్యా మంత్రము బదులు ఈ మంత్రమును
అనుసంధానించవలయును.
మధ్యాహ్నిక సంధ్యా మంత్రము:-
కుడి అరచేతిలోనికి జలము తీసుకొనవలయును. తర్వాత
ఆపః పునంత్విత్యస్య మంత్రస్య పూత ఋషిః అపోదేవతా
అనుష్టుప్ చంధః అపాంప్రాశనే వినియోగః
మంత్రము:-
I
I I
“ ఓం ఆపః పునంతు పృధివీం పృధివీ పూతా
పునాతు మామ్,
పునంతు బ్రహ్మణ స్పతిః బ్రహ్మ పూతా పునాతు
మామ్ ||
| || | |
యదుచ్ఛిష్టం మభోజ్యం యద్వా దుశ్చరితం మమ |
| || ||
సర్వం పునంతు మామా సోఽ సతాంచ ప్రతి
గ్రహం స్వాహా||
మధ్యాహ్నిక సంధ్యావందనం సంపూర్ణం.
సాయంకాల
సంధ్యావందనము:-
ఈ సాయం సంధ్యావందనము సాయంకాలం సూర్యాస్తమయము నకు ముందు ఈ సాయం సంధ్యావందనము పూర్తిచేయవలయును.
ప్రాతః సంధ్యావందనము మరియు, మధ్యాహ్నిక సంధ్యావందనము వలె, ప్రారంభము నుండి ప్రారంభించి, అనగా కేశవ నామాలు, ఆచమనం, భూశుద్ది,
ప్రాణాయామం, సంకల్పము,
శుద్దోదక స్నానము వరకు యధావిధిగ ఆచరించి సంధ్యామంత్రము (మంత్ర భాగము) సంధ్యా
వందమునకు, ఈ క్రింది మంత్రమును అనుసంధానించుకొన వలయును.
సాయం సంధ్యా మంత్రము:-
కుడి అరచేతిలోనికి జలము తీసుకొనవలయును తర్వాత
“అగ్నిశ్చేత్యస్య మన్త్రస్య యాజ్ఞ వల్క్య ఋషిః
ప్రకృతి ఛందః అగ్ని మామన్యు మాన్యు పతయో
అహర్దేవాతా,
జలాభి మంత్రనే వినియోగః !
మంత్రము:-
|ఓం అగ్నిశ్చ మామన్యుశ్చ మాన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః |
|
పాపే భ్యో రక్షన్తాం! యదహ్నా పాపమ కారుషం
|
మనసా వాచా హస్తాభ్యాం! పద్భ్యాం ఉదరేణ శిశ్నా|
| | |
అహస్త దవలు మ్పతు, యత్కించ దురితం మయి, ఇదమహం
| |
మామమృత యోనౌ, సత్యేజ్యోతిష,
జూ హోమీ స్వాహా|
త్రిరాచమేత్ (మూడు పర్యాయములు ఆచమనం చేయాలి)
సాయం సంధ్యావందనం సంపూర్ణం.
త్రిరాచామేత్ (మూడు పర్యాయములు
ఆచమనము చేసిన తర్వాత)
ఎడమ చేతిని గోకర్ణాకృతిలో ఉంచి కుడి చేతితో ఉద్దరిణితో జలము తీసుకొని ఎడమ
చేతిలో వేసుకొని, కుడి చేతి బొటన వ్రేలితో తడి చేసుకొని
కరన్యాసము చేయుచూ ఈ క్రింది విధముగ అను
సంధానించవలయును.
ద్విః పరిముజ్య :- ఎడమ అరచేతిలోని
జలమును కుడి బొటన వ్రేలిని ముంచి ఎడమ వైపు నుండి కుడివైపునకు కుడివైపు నుండి ఎడమ
వైపునకు పై పెదవిని క్రింది పెదవిని తుడుచుకొన వలయును.
సకృదుప స్పృశ్య:- జలముతో ఎడమ అరచేతిని, కుడి
అరచేతితోను, కుడి అరచేతిని ఎడమ అరచేతిని, రెండునూ ఒక దానితో మరొకటి తుడుచుకొనవలయును.
యత్సవ్యం పాణిం:- కుడి చేతితో, ఎడమ చేతిలోని జలమును తగులుచూ రెండు చేతులూ తుడుచుకొనవలయును.
పాదం................... :-కుడిచేతితో ఎడమ పాదముపై జలము చల్లుకోనవలయును.
ప్రోక్షతి శిరః............... :- కుడిచేతితో జలము తలపై జలము చల్లుకోనవలయును.
చక్షుషీ ................. :- కుడి బొటనవ్రేలు, ఉంగరపు
వ్రేలు రెండూ కలిపి పట్టుకొని కుడి కంటిని ,ఎడమ
కంటిని ఆ రెండు వ్రేళ్ళ కలయికతో తాకావల యును.
నాసికే..............:- ఆ రెండు వ్రేళ్ళతో ముక్కు కుడిభాగమును,ఎడమ భాగమును తాకవలయును.
శ్రోతే .............. :- అదే ఆ రెండు వ్రేళ్ళతో కుడి చెవిని ఎడమ చెవిని తాకవలయును.
హృదయ మాలభ్య:- హృదయముపై జలమును చల్లుకొనవలయును. తర్వాత లేచి సూర్యునికి
ఎదురుగా నిలబడి ఈ క్రింది మంత్రములు అనుసంధానించుకొనుచూ తలపై జలము చల్లుకొనుచూ
అనుసంధానించ వలయును.
ఓం ధదిక్రా ఉణ్ణో అకారిషం జిష్ణోరస్వశ్చ వాజినః తలపై జలము చల్లుకొనవలయును
సురభినో ముఖాకరతు ప్రణ ఆయూగం శ్రీ తారిషతు తలపై జలము చల్లుకొనవలయును
ఆపో హిష్టా మయో భువః తలపై
జలము చల్లుకొనవలయును
తాన ఊర్జే ధదాతన తలపై జలము చల్లుకొనవలయును
మహేరణాయ చక్షసే తలపై
జలము చల్లుకొనవలయును
యోవఃశివత మొరసః తలపై జలము చల్లుకొనవలయును
తస్య భాజయతే హనః తలపై
జలము చల్లుకొనవలయును
ఉష తీదివ మాతరః తలపై జలము చల్లుకొనవలయును
తస్మా ఆరంగ మామవహ తలపై జలము
చల్లుకొనవలయును
యస్యక్షయాయ జన్వథా తలపై జలము
చల్లుకొనవలయును
అపోజనయథా చనః తలపై
జలము చల్లుకొనవలయును
హిరణ్యవర్నాః శుచయః తలపై
జలము చల్లుకొనవలయును
పావకాః యసు జాతః తలపై
జలము చల్లుకొనవలయును
తస్యపో యాస్విన్ద్రః
తలపై జలము చల్లుకొనవలయును
అగ్నిన్యా గర్భం దధీరే విరూపాః తలపై జలము చల్లుకొనవలయును
తానా ఆపహ శరజ్ఞుశ్చోనా భవంతు తలపై జలము చల్లుకొనవలయును
వ్యాసాగుం రాజా వరుణోయాతి....తలపై జలము చల్లుకొనవలయును
మధ్యే సత్యానృతే అవపశ్యం జనానాం తలపై జలము చల్లుకొనవలయును
ఆధుశ్చుతః శుచయోయాః
పానకాః
తలపై జలము చల్లుకొనవలయును
తాన ఆపః శగ్ముశ్చోనా భవంతు.. తలపై జలము చల్లుకొనవలయును
యాసాం దేవాదివి కృన్వంతి
భక్షయా తలపై జలము
చల్లుకొనవలయును
అంతరిక్షే బహుధా భవస్తు
తలపై జలము చల్లుకొనవలయును
పృధివీం పాయ సొన్దంతి
శుక్రాస్తాన
తలపై జలము చల్లుకొనవలయును
ఆపశగ్గ్ స్యోనా భవస్తు
తలపై జలము చల్లుకొనవలయును
శివేనమా చక్షుశాపస్యతా
పశ్శివయా
తలపై జలము చల్లుకొనవలయును
తనువోప స్పృశత త్వచమ్మే తలపై
జలము చల్లుకొనవలయును
సర్వాగ్ం అగ్నిగ్ం రప్సుషదో
తలపై జలము చల్లుకొనవలయును
హుకే వోమయి పర్చోబల
మోజోనిధిత్త
తలపై జలము చల్లుకొనవలయును
తర్వాత
శిరస్సు వంచి కుడిచేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని (అరి చేతులు బయటకు
కనిపించు విధముగా) చెవులను స్పృశిస్తూ
“చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్యశ్శుభం
భవతు”
అని అనుసంధానించి(చెప్పుకొని) ఆచమనం చేయాలి.
ఆచమనం చేసిన తర్వాత
కేశవ నామాలు:-
ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మదుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోధరాయ నమః
ఓం శ్రీ వాసుదేవాయ నమః
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి
శ్రీమన్నారాయణేతి సమర్పయామి.
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
అని అనుకొంటూ తీర్థమును దోసిలితో వదలవలయును.
సంధ్యావందనం సంపూర్ణం
సంధ్యావందనం పూర్తి అయిన తరువాత పూజా కార్యక్రమము.
పూజకు ఏమీ
వస్తువులు కావలయును మరియు ఎలా చేయాలి
ప్రాతః కాలములోనే నిద్రలేవాలి, లేచి కాలకృత్యములు
పూర్తిచేయలి. తర్వాత స్నానముచేసి (Dress
Code పాటించాలి) శుభ్రమైన పొడి
వస్త్రము (ధోవతి) ధరించాలి, ఉత్తరీయమును నడుముకు కట్టుకోవాలి. హృదయము పైన
ఎలాంటి వస్త్రమూ (బనియను, చొక్కా
లాంటివి ధరించరాదు) వుంచుకొనరాదు.
వారివారి సాంప్రదాయమును అనుసరించి నుదుటిభాగమును (విభూదితో కానీ చందనముతో కానీ
తిరుమణితో కానీ శ్రీ చూర్ణముతో కానీ)
తిలకధారణ చేయలి. తిలకధారణ (ముఖాన బొట్టు)
లేకుండా పూజమందిర ప్రవేశము నిరుపయోగము. మనము నుదుట బొట్టు ధరించడము, మన సనాతన ధర్మములపట్ల, వేదములపట్ల,
పునర్జన్మ సిద్ధాంతము పట్ల, నమ్మకమునకు,
గౌరవమునకు సూచన. పూజామందిరము ముందు నిలబడి మెల్లగా చప్పుడు (మూడు పర్యాయములు
మెల్లగా సున్నితముగా చప్పట్లుకొట్టుచూ) చేయాలి. మనము పూజమందిరము తలుపుతీయుటకు
స్వామి వారిని అనుమతిమ్మని కోరుతూ ఇలా
అనుమతిని కోరుతూ చేయుక్రియ. తర్వాత మెల్లమెల్లగా పూజమందిరము తలుపును తీయలి.
పూజమందిరములోనికి వినయముతో, భయభక్తులతో, అతిజాగ్రత్తగా, వినమ్ర
మనస్కులమై లోనకు ప్రవేశించాలి (ఒక అధికారి తో అతి ముఖ్యమైన ఎంతో అత్యవసరమైన పని ఉన్నప్పుడు ఎంతో గౌరవముగా
తలుపువద్ద నిలబడి అతివినయము ప్రదర్శిస్తూ (“MAY I COME IN SIR,”) అని అడిగి లోనకు ప్రవేశిస్తాముకదా. మరి మన స్వామి
జగత్తు కే అధికారి, ఆ అధికారి
గదిలోనికి ప్రవేశించేటప్పుడు, ఎంత జాగరూకతతో
ప్రవేశించాలి, ఒకసారి ఆలోచించండి.
అతి జాగ్రత్తగా
స్వామివారి సింహాసనమును, పూజామందిరములోని నిర్మాల్యమును (నిన్నటి రోజున మనము
స్వామివారికి సమర్పించిన ఫల పుష్పాది తీర్థప్రసాదములను,
కుంకుమాది అక్షితాది పూజా వినియోగములను, దీపారాధన సామగ్రిని) అతి సున్నితముగా, భయభక్తుతలతో,
తొలగించాలి. తదుపరి పూజామందిరమును శుభ్రముగా శుభ్రపరచాలి.
1.
పూజకు సమయ
పాలన అతి ముఖ్యమైన అంశము. ఉదయం 6 గం|| పూజ అంటే మనము ఎక్కడ
ఉన్నా తప్పకుండా ఉదయం 6 గం|| పూజ ప్రారంబించాలి, అనే
నడవడిని మనము మన మనస్సుకు తరఫీదు ఇవ్వాలి.
ఉదా :- పదవీ విరమణ చేసిన ఒక సైనికుడు ఇంటికి వచ్చేస్తాడు. (మిలటరీ
ఉద్యోగి). అయినా అతడు మరణించే అంత వరకు, మిలటరీలో ఎలా అయితే ఉదయం
4 గం|| నిద్ర లేస్తారో,
అదేవిధముగ పదవీవిరమణ చేసి, ఇంటి దగ్గర తన భార్యబిడ్డలతో ఉన్నా, క్రమం తప్పకుండా 4గం|| నిద్రలేస్తాడు. ఎందుకు? అతని
మనసుకు కొన్ని సంవత్సరములుగ మిలటరీ వారు ఇచ్చిన ప్రాక్టీసు.
2.
పూజకు
(పూజ వేళకు) ఉపయోగించడానికి విడి విడిగా పాత్రలలో (పంచ పాత్ర) శుద్ద జలము సిద్దము
చేసుకోవాలి. పూజకు ఒక ఉద్దరిణి, పంచపాత్ర, చిన్న గ్లాసులు రెండు , తట్ట, గంట, హారతి పళ్ళెము సిద్దము చేసుకొనవలయును.
3.
వారి వారి
అభిరుచుల (ఇష్టదేవత/గురూపదేశము) ను అనసరించి అర్చనామూర్తిని సిద్దము
చేయవలయును.
ముఖ్య గమనిక:- దైవము యొక్క ప్రతిమగానీ, Photo గానీ
సిద్దము చేసుకున్న తరువాత, త్రికరణ శుద్దిగా, పూజ
సమయంలో కానీ, పూజానంతరం కానీ, పూజ
గదిలో ఉన్నది ప్రతిమ, Photo అనే భావన ఏ పరిస్థితులోనూ రాకూడదు. అక్కడ
సింహాసనము పై అర్చనా మూర్తి ఆసీనులైఉన్నారని, అక్కడ
కూర్చొని మనలను మన కుటుంబమును ఎల్ల వేళలా, చూచుచూ
మనలను కాపాడు చున్నాడని, మరువ రాదు. స్వామి వారు అక్కడకు వచ్చి కూర్చొని
ఉన్నారు, అనే భావనతో భయ భక్తులతో పూజ ప్రారంభించాలి.
4.దీపారాధనకు పత్తితో తయారు చేసిన వత్తులను సిద్దం చేసుకోవాలి. దీపారాధనకు
యధాశక్తి తైలమును(నూనెను) ఉపయోగించాలి. ఆవు నెయ్యి సర్వశ్రేష్ఠము.
5.ధూపారాధనకు అగరబత్తీలు, ధూప్ స్టిక్కులు,
సాంబ్రాణి సిద్దంచేసుకోవాలి. అగ్ని హోత్రము తయారుచేసి సాంబ్రాణి వేయడము శ్రేష్ఠము.
6.పసుపు, కుంకుమ,
అక్షితలు, పూలు, పళ్ళు,
తమలపాకులు, వక్కలు, గంధము
(అంగడిలో అమ్మే గంధము కాకుండా ఇంటిలో సానరాయి, గంధపు
చెక్క ఉంచుకుని, నిత్యము గంధము తీసి భగవంతునికి సమర్పించడం సర్వ
శ్రేష్ఠము) ఆగరు వత్తులు, హారతికి కర్పూరము, కొబ్బరికాయ (యధాశక్తి) సిద్దం చేసుకొనవలయును.
7. నివేదన నిమిత్తo నిత్యము బెల్లము ముక్కను తప్పనిసరిగా ఉంచవలయును. అలాగే నైవేద్యమునుకు సాత్వికాహారము, సాత్విక పదార్థాము లను, నివేదించవలయును. భగవంతునికి (పూజకు) ఒకటి, మనము
భుజించడానికి ఒకటి, తయారు చేయుట నిషిద్దము. భగవంతునికి ఏమి
నివేదించుతామో మనము కూడా అదే తీసుకొనవలయును. తర్వాత
గురుపరంపర
ప్రార్థన
శ్రీమతే రామానుజాయ నమః శ్రీమన్నారాయణ రామానుజ
యతిభ్యో నమః
పోదు త్తనియన్లు ప్రాతార్నిత్యాను సంధేయ
శ్లోకములు
మణవాళమహామునుల తనియన్ –శ్రీ రంగనాథులు
ప్రసాదించినది.
1) శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్|
యతీన్దృ
ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్||
శ్రీ గురుపరంపర తనియన్- కూరత్తాళ్వానులు సాయించినది.
2) లక్ష్మీనాథ సమారమ్భాం
నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యన్తాం వన్దే
గురుపరమ్పరామ్||
ఎంబెరుమానార్ తనియన్- కూరత్తాళ్వాన్ సాయించినది.
౩. యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే|
అస్మద్గురో ర్భగవతోఽ వ్యామోహత స్య దయైకసిన్దోః
రామానుజస్య చరణౌ శరణం ప్రవద్యే ||
నమ్మాళ్వార్ తనియన్- ఆళవందార్ సాయించినది.
4. మతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యాదేవ నియమేన మదన్వయానామ్ I
అద్యస్య
నః కులపతే ర్వకుళాభి రామం
శ్రీమత్త దం ఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నాII
ఆళ్వారుల
తనియన్ – శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది.
5 భూతం
సరశ్చ మహదాహ్వయ భట్టనాధ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహన్ I
భక్తాంఘ్రిరేణుపరకాల
యతీన్దృమిశ్రాన్
శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోఽస్మి నిత్యమ్ II
గురుపరంపర ప్రార్థన తర్వాత
“శుక్లాం భరధరమ్ విష్ణుమ్” శ్లోకం తో ప్రారంభించి ఇష్టదేవతా
ప్రార్ధనాశ్లోకాలు పద్యాలు, మంత్రాలు పఠించుచూ పూజ చేసుకోవలయును.
వారివారి సమయభారమునుబట్టి శ్రీ విష్ణుసహస్రనామాలు, శ్రీ
లలితా సహస్రనామాలు శ్రద్దాభక్తులతో మనసును
స్వామి పదములమీద ఉంచి ఏకాగ్రతతో పఠించి పూజాకార్యక్రమమును చేసుకొనవలయును.
నిత్యాంతరంగ
ప్రార్ధన
1.
పరమాత్మా
నన్ను బ్రాహ్మ ముహూర్తములో (ఉదయం 4 గంటలకు) నిద్ర నుండి లేచి ఈశ్వరారాధనాభిముఖునిగా
ఉండునట్లు, నా బుద్ధిని
ప్రచోదనము చేయుము. దయా సింధో సర్వకాల సర్వావస్తలయందు, నిన్ను స్మరించు బుద్ధిని నాకు ప్రసాదించు.
2.
సత్సాంగత్యము(భగవాన్
భక్తులతో స్నేహము) నిరంతరము కొనసాగునట్లు నన్ను ఆశీర్వదింపుము. అనాయాస మరణము, చివరి శ్వాస నీ ధ్యాసలో ఉండునట్లు అనుగ్రహింపుము.
3.
అరిషడ్వర్గములను
జయించు శక్తిని, నా బుద్ధికి ప్రసాదింపుము. నిరంతరం పరోపకారమే
పరమావధిగా, మానవ సేవే మాధవ సేవ యను భావము, నాలో నిరంతరము కొనసాగించుము.
4.
దేహాభిమానమును
నాలోని అహమును పారద్రోలుము. ప్రేమతో నా హృదయమును నింపుము. ప్రకృతిలో సకల
జీవరాసులలో, పరమాత్మను చూచు భూత దయను, నాకు ప్రసాదింపుము.
5.
ప్రతి
స్త్రీ యందు మాతృమూర్తిని, పరదేవతను (అమ్మను) దర్శించగలిగే బుద్ధిని, జ్ఞానమును నా బుద్ధికి, మనస్సుకు ప్రసాదించుము.
6.
నిజాయితీతో
ధర్మబద్దమైన జీవితమును, ధర్మయుత సంపాదనను, ధర్మ
పాలనను ప్రసాదించుము. ధర్మానుష్టానములో వచ్చే ప్రమాదములను, బాధలను,కష్టములను, మీ యొక్క ప్రసాదముగా స్వీకరించి నిరంతరము మీరు
ఇచ్చిన దానితో, సంతృప్తిగా జీవించే బుద్ధిని అనుగ్రహింపుము.
ధర్మచట్రములో ఇముడు పనులను మాత్రమే నా
బుద్ధికి మనస్సుకు ప్రచోదనము చేయుము.
7.
తల్లి
తండ్రుల, గురువుల, పాదపద్మములకు, ప్రాతః
కాలమున త్రికరణ శుద్ధితో, సాంజలి బంధకముగా నమస్కరించే బుద్దిని
ప్రసాదించుము.
షోడశోపచారములు
చేయు విధానము:-
ఇక్కడ ఒక విషయము
చాలా ముఖ్యముగా మనము అందరమూ గమనించాలి బాగా ఆలోచించాలి. ఎవరైనా ఒక అతిథి, ఒక బంధువు ,మనకు ప్రీతి కలిగించేవారు, లేదా మనము ఒక ఉద్యోగి అయితే మన పై అధికారి, మనకు
సహాయం చేసినవారు, మనకు సహాయం చేసేవారు,
గురువులు, ఎల్లవేళలా మన శ్రేయోభిలాషులు, మన
ఇంటికి వస్తే, ఎలా గౌరవిస్తాము. ఎలా ఉపచారములు (సేవలు)
చేస్తాము మరీ చెప్పాలంటే క్రొత్తగా వివాహము చేసుకొన్న దంపతులు, అల్లుడు క్రొత్తగా ఇంటికి వచ్చినా, లేదా
క్రొత్త కోడలు క్రొత్తగా మన ఇంటికి వచ్చినా, వారికి
చేయు సేవలు, ఉపచారములు ఎలా ఉంటాయో ఊహించండి.
మరి మనకు సకల శుభములను, జీవించుటకు జీవమును, జీవిత మును ప్రసాదించిన ఆ పరమేశ్వరుని పట్ల
మనము ఎంత వినయంగా, ఎంత భక్తిగా, ఎంత
శ్రద్దగా, త్రికరణ శుద్దిగా మసలుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఆలోచించండి? మనము చేసే ఉద్యోగము ఆయన ఇచ్చింది కాదా?
మనకున్న ఈ సర్వ సంపదలు, వాహనములు, ప్రతి
పూట మనము తినే తిండి ఆయన ఇచ్చినదే. చివరకు మనకు జీవాధారమై, మనము
పీల్చుచూ, విడుచుచున్న గాలి ఆయనది కాదా? ఈ
గాలిని మనము సృజించామా? ఈ ప్రకృతిని మనము సృష్టించామా? మనమునిత్యమూ అనుభవించే ఈ వెలుగు ఎవరిది? మరి
అంతటి అంతర్యామి సర్వభూతములందు, సర్వప్రాణికోటియందు, నిండి
నిమిడీ కృతమయి ఉన్న పరమేశ్వరుడు మన పూజా మందిరమునకు (మన గృహములోనికి) వచ్చి మనలను
కటాక్షిస్తుంటే వారి పట్ల మనము ఎలా ప్రవర్తించాలి. ఒక్కసారి ఆలోచించండి. ఆ పరమేశ్వరుని
పట్ల గౌరవము, భక్తి, ప్రేమ
ఎవరి కొరకు? మనకొరకే, ఆయన
కొరకు కాదు. ఆయన అభ్యున్నతికి కాదు. మన అభ్యున్నతికి, మనకు
ఇంకా ఏదో కావాలని, పరమేశ్వరుడు మనకు ఇంకా ఏదో చేయాలని, చేయుచున్నామే కానీ, ఏ మాత్రము పరమేశ్వరుని అభ్యున్నతికి, పరమేశ్వరుని కొరకు మాత్రం కాదు. ఈ విషయం అందరూ హృదయంతో నిర్మొహమాటముగా
ఆలోచించి మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి.
అందుకే శ్రీ
త్యాగరాజు వంటి వాగ్గేయకారులు అన్నారు “నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల
సుఖమా... నరస్తుతి సుఖమా నిజముగ తెలుపు మనసా” అని, మనము
ప్రాజ్ఞులం కావున మనము అందరమూ ఈ పాటికే విషయాన్ని అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి
ఒక్కొక్క ఉపచారమునకు తగిన సమయమిచ్చి, మనము ఆ ఉపచారము లు స్వామి వారికి చేయునప్పుడు, అందులో
జీవించాలి. నిజంగా స్వామి వారు వచ్చి మన
పూజా మందిరంలో కూర్చునట్లు, పంచేంద్రీయాలు స్వామిపై ఉంచి, శ్రద్దా భక్తులతో, నిజంగా ఈ ఉపచార ప్రక్రియ చేసి చూడండి. మీ
అనుభూతు లు, అనంతము అనిర్వచనీయము. నిజం చెప్పాలంటే, అవి వివరించడానికి ఏ భాష లేదు కేవలం భావన తప్ప ఎలాగూ వివరించలేము చూపలేము
నిర్వచించలేము.
1.
ఆవాహనము
:- స్వామి వారిని మనస్ఫూర్తిగా
సాదరముగా గృహములోనికి ఆహ్వానించుట. అంటే ఎవరైనా వస్తే నము గుమ్మం దగ్గరకు వెళ్ళి, రండి
రండి అబ్బో చాలా కాలం తర్వాత, రండి రండి అని ఆహ్వానిస్తాం కదా! అలానే అంతకంటే
ఎక్కువగానే ఆహ్వానించాలి. “ఉరకెరారు వారధముల కడకు...... మీరు వచ్చుటలెల్ల మాకు
శుభములు కూర్చు మహాత్మా” కదా!
“ఆవాహనం సమర్పయామి”
2.
ఆసనం:- వచ్చిన
అతిథికి ఏదో ఒక ఆసనం, కుర్చీ, లేదా
సోఫా,లేదా మంచం యథాశక్తి చూపిస్తూ దానిని శుభ్రం చేస్తూ రండి
రండి కూర్చోండి అంటామా? అనమా? అలాగే స్వామి వారికి
పూజా మందిరంలో సింహాసనం చూపించి శుభ్రం చేసి సింహాసనం చూపించి (సింహాసనముపై
ఆసీనులుకమ్మని కూర్చోమని వినమ్రతతో ప్రార్ధించాలి.)
“ఆసనం సమర్పయామి”.
3.
పాద్యము:- స్వామి
వారు రాగానే జలము అందించి స్వామీ మీపాదములు కడుగుకోండి, అని
జలము అందించడం (స్వామీ, మీ పాద పద్మములు కడిగే భాగ్యము నాకు ఈ
రోజుప్రసాదించావా అని వినమ్రతతో భక్తితో స్వామి వారి పాదాలను శుద్దజలములతో కడిగిన
భావమును అనుభవించడం) స్వామివారి పాదముల పై
శుద్ద జలమును చల్ల వలయును.
“పాదయోః పాద్యం సమర్పయామి.”
4.
ఆర్ఘ్యము
:- స్వామి వారు వచ్చారు, వచ్చిన వారికి కాళ్ళు చేతులు కడుగుకోవటానికి
నీళ్ళు ఇచ్చి, వారి వెనకాతలే మనము ఒక మంచి తువ్వాలు (పొడి
వస్త్రము) పట్టుకొని, నించుంటాము అవునా? అలాగే
స్వామి వారికి కాళ్ళు చేతులు కడుగుకొన్న తర్వాత పొడి వస్త్రమును అందించుచున్నా మనే
భావనతో, స్వామి వారికి వస్త్రమును తాకించడం.
‘హస్తాయోరర్ఘ్యం సమర్పయామి”
5.
ఆచమనం:- ఇంటికి వచ్చిన అతిథికి లోపలకు రాగానే, ఒక గ్లాసుతో మంచి నీరు ఇస్తాము. రండి రండి నీళ్ళు తీసుకోండి. అని రాగానే
ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాం కదా. అలాగే స్వామి వారు ఎక్కడ ఎక్కడ తిరిగి అలిసిపోయారో, ఎప్పుడు బయలుదేరినారో, మరి ఎంత దాహంతో ఉన్నారో, అనే తపన ఆర్తి మనలో కలిగి, స్వామి వారికి ఉద్దరణితో శుద్ద జలమును
అందించాలి.
“ఆచమనీయం సమర్పయామి”
6.
స్నానము:-
వచ్చిన అతిథికి స్నానము చేయమని నీళ్ళు బక్కెటలోనో, లేదా
మరే పాత్రలోనో సిద్దం చేసి, ఆ... రండి స్నానం చేయండిని పిలుస్తామా. అలాగే
స్వామి వారికి శుద్దజలము సిద్దం చేసి, స్వామి రండి మీరు ప్రయాణ
బడలికతో ఎంత అలసిపోయారో, ఎంత శ్రమ చెందారో, కాస్త
స్నానం చేస్తే ప్రయాణ బడలిక తీరు తుందని, స్వామి వారిని సాదరముగా
ఆహ్వానించడం. స్వామి వారు స్నానము చేయుచున్నారు(స్వామి వారికి
స్నానంచేయించుచున్నాను) అనే భావనతో శుద్దజలమును ఉద్దరణితో స్వామి వారిపై
సంప్రోక్షించడం.
“ఔపచారిక స్నానం సమర్పయామి”
7 వస్త్రం:- వచ్చిన అతిథి బట్టలు తెచ్చుకోలేదు. హడావిడిగా బయలుదేరి వచ్చేశారు. అప్పుడు
మన బట్టలను, అతిథికి ఇచ్చి,
మర్యాదను ప్రదర్శిస్తాము కదా. అలాగే స్వామి వారు వచ్చారు, మన
ఇంటిలో స్నానం చేశారు, మరి బట్టకావాలిగా విడిచిన బట్టలను కట్టుకోరు
కదా? మంచి పొడి వస్త్రమును, స్వామి
వారికి అందించి స్వామి ఈ (పొడి,మడి) వస్త్రమును ధరించి, మమ్ము
ధన్యులను చేయండని అర్థిస్తూ స్వామి వారికి వస్త్రములు(పంచ,
ఉత్తరీయము) అందించడం.
“వస్త్రం సమర్పయామి”
8
యజ్ఞోపవీతం:- వచ్చిన
వారు మార్గమధ్యములో, ఏదైనా మైల పడి ఉండవచ్చు. అలా మైల పడ్డవారు
యజ్ఞోపవీతం మార్చుకోకుండా, సంధ్యా వందనము, పూజ, ఇత్యాది కార్యములు చేయరాదు. కాబట్టి యథాశక్తి యజ్ఞోపవీతమును, మార్చుకొనవలయును. కావున స్వామి వారు మార్గమధ్య మున, ఏదైనా మైలపడి ఉంటారేమో అని యజ్ఞోపవీతమును స్వామికి అందించడము. నూతన
యజ్ఞోపవీతమును, స్వామి వారికి తాకించి, వారి
పాద పద్మముల చెంత ఉంచడము.
“యజ్ఞోపవీతం సమర్పయామి”
8. గంథము :- ప్రయాణ బడలిక, శరీర శ్రమ,
బడలికను సేద తీర్చుట కొరకు, చేయు ఉపచారము. కాబట్టి స్వామి వారికి గంథము
సమర్పిస్తాము. గంథము అంటే బజారులో అమ్మబడే గంథము, కంటే
మనము స్వామి వారి కొరకు కాస్త శ్రమపడి, గంథపురాయి మీద గంథపు చెక్కను అరగదీసి, కొద్ది
పాటి గంథమును స్వామి వారికి సమర్పిస్తే, స్వామి మహదానందము
పొందుతారు. మనము చూస్తున్నాము, బజారులో దొరికే గంధము, వాడడం
వలన మనకు దురదలు రావడం, లేదా మంట కలిగించడం,
చూస్తున్నాము కదా. మరి సర్వేశ్వరుడు, పరబ్రహ్మ మైన, మన స్వామి వారికి ఆ గంథం, ఎంత బాధ కలిగిస్తుందో కదా! కాబట్టి మనము స్వయంగా, గంథపు చెక్కను అరగదీసి తయారు
చేసిన, గంధము ను స్వామి వారిపై చిలుకరిస్తూ, లేదా స్వామి వారికి గంథం పూస్తూ
“గంథాన్ ధారయామి”
10.
పుష్పం:-మన
ఇంటికి వచ్చిన వారు, ఇల్లు దుర్గంధభరితముగా, ఆశుభ్రముగా
ఉంటే, కనీసం ఇంట్లోకి
వస్తారా?
కూర్చుంటారా? మంచి జలము తీసుకుంటారా? అందు
కొరకు మన గృహమును, ఫల పుష్పములతో అలంకరించి, మంచి సువాసనలను గృహమంతా నిండి, వచ్చిన వారి హృదయం, ఆసుగంధ భరితముతో ఆనందించాలి. అంటే సెంటు లాంటివి ఉపయోగించి కాదు. పరమాత్మ
మనకు ఇచ్చిన, సుగంధ భరితములైన పుష్పములతో, స్వామి వారికి స్వాగతం పలికి, పుష్పములు స్వామి వారి
పాదముల మీద సమర్పించడం.
“నానా విధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.”
9 ధూపం:- పై విధముగనే గృహమును, పూజా గదిని, సుగంధ
పరిమళాలతో నింపడం. ఎందుకంటే స్వామి వారు, మన గృహములో ఉండి మన
ఉపచారములను, స్వీకరించాలంటే, మరి
కొంత సేపు ఉండాలి కదా! అలా కొంత సేపు స్వామి వారు ఉండి, మన
ఉపచారములు స్వీకరిస్తేనే కదా, మన కోరికలు తీరేది. కావున ధూపం అలా స్వామి వారి, ముక్కు దగ్గర చూపించి వెంటనే తీసేయాలి, అంతే
కానీ ఊదుబత్తీలు అలా వెలిగించి అక్కడ ఉంచడం కాదు. లేదంటే స్వామి వారికి ఊపిరి ఆడక
ఇబ్బంది పడతారు.
“ధూప మాఘ్రాపయామి”.
12.దీపo:-స్వామివారు, మనము, ఒకరినొకరు చూచుకోవాలి. ఒకరిని ఒకరు పరామర్శించుకోవాలి. అందుకు వెలుతురు
కావాలి. మరి పగలే కదా వెలుతురు ఉంది కదా, అంటే, ఈ వెలుతురు ఉంది, కానీ దీపము, దీపశిఖ, జ్ఞానానికి ప్రతీకలు. మనము
స్వామి వారిని, స్వామి వారు మనలను, కరచరణాదులతో
(శరీరం) కాక, జ్ఞాన పరంగా,
ఆత్మపరంగా, ఒకరిని, ఒకరు, పలకరించుకోవాలి, అందుకు దీపం ఉంచడం. దీపం వెలిగించి, పూజ ప్రారంభించడం. దీపము యొక్క, జ్ఞానకాంతితో, స్వామి వారిని మనము, మనలను స్వామివారు, ఉభయులు
కుశలమును తెలుసుకోవడం కోసం జ్ఞాన దీపం వెలిగించడం.
“సాక్షాత్ దీపం దర్శయామి.”
13. నైవేద్యం:- వచ్చిన అతిధిని, యధాశక్తి, షడ్రషోపేత,
భోజనమును ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమతో, మనము
అందిస్తాము. రండి కూర్చొండి భోజనము చేయండి అని బ్రతిమాలి, బామాలి
గౌరవిస్తాము. మరి తల్లి తన బిడ్డకు, అన్నం తినిపించేటప్పుడు, బిడ్డను చంకలో వేసుకుని, చందమామను చూపిస్తుంది. పిల్లలకు ఇష్టమైన
బొమ్మలను, వస్తువులను, చూపిస్తుంది. ఎంత మారాము
చేస్తే అంతగా బుజ్జగిస్తుంది. తల్లికి, ఓపిక ఉన్నా, లేకపోయినా, అనారోగ్యముతో ఉన్నా, అన్నీ
ప్రక్కనపెట్టి, తన బిడ్డకు అన్నం పెడుతుంది. కదా! మరి మన
గృహమునకు వచ్చి, పూజ మందిరంలో,
సింహాసనముపై ఆసీనులై ఉన్న, మన స్వామి వారికి మనము ఎంత ఆర్తితో, ఎంత ప్రేమతో అందించాలి.
స్వామి వారు మన ఆర్తి చూసి, కను రెప్ప తీసి అలా చూస్తారు. దానినే, మహా ప్రసాదముగా మనము తీసుకుంటాము, భగవంతుడు, దేవతలు తీసుకునే ఆహారం ఏది? మనము యజ్ఞము చేసి, హవిశ్శు
రూపంలో, యజ్ఞగుండంలో పరమ భక్తితో, సమర్పించిన దానిని హవ్యవాహనుడు (అగ్నిదేవుడు) తీసుకెళ్ళి వారికి అందిస్తే, పరమానందంగా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు.
“నైవేద్యం సంమర్పయామి.”
14. తాంబూలము:- అతిధి భోజనానంతరం, గృహస్తులంతా భోజనము చేసిన తరువాత, అందరమూ
కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, మంచి విషయములు, ప్రస్తావించుకుంటూ, భక్తి కబుర్లు,
క్షేత్ర విశేషములు, పుణ్యక్షేత్ర వివరాలు,
దర్శించిన పుణ్యక్షేత్రములను మననం చేసుకుంటూ, ఒకరికి
తెలిసిన విషయములు, మిగిలిన వారు అందరూ పంచుకుంటూ, తెలుసుకుంటూ, సునాతన ధర్మ విషయము, ధర్మ
సందేహములు చర్చించుకుంటూ, తెలియనివి
తెలుసుకుంటూ, ఉపశమనార్థమై ఉపయోగించేది తాంబూలం. మనము
తమలపాకులు, వక్క, సున్నం స్వామివారికి
సమర్పించడం.
“తాంబూలం సమర్పయామి”.
15. నమస్కారం :-వచ్చిన
అతిధికి అందించే గౌరవ పురస్కారములు. అలాగే స్వామి వారి పాదములకు నమస్కరించడం.
“ఆనంద కర్పూర నీరాజనం
దర్శయామి”.
16. ప్రదీక్షిణం :- గృహస్తు, వచ్చిన వారే త్రిమూర్తులని, వారి వారి గొప్పదనములను
కీర్తించడం. వారి వారి సాంప్రదాయ ములను, బట్టి వారి వారి
విశ్వాసములను అనుసరించి, వారి యొక్క దేవతలకు సంబందించిన, అర్చనా కార్యక్రమము, దేవతా స్తుతి,
ప్రార్థనలు చేసుకోవాలి. ఉదా:- విష్ణు సహస్రనామాలు, లలితా
సహస్రనామాలు, శివస్తుతి,
గొవిందనామాలు, ఆదిత్యహృదయం, హనుమాన్
చాలీసా, ఏదైనా అష్టోత శతనామాలు, పూజ
చేసుకోవచ్చు.
తర్వాత “జయమంత్రము” చెప్పాలి
“జయమంత్రము”
1. జయ త్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాభిపాలితః
దాసోహం కొసలేంద్రస్య
రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాo నిహంతా మారుతాత్మజః
2. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ
సహస్రశః
అర్థయిత్వా పురీo
లంకా మభివాద్య చ మైథిలీo
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాo సర్వరక్షసామ్.
“యాని కానిచ పాపాని బ్రహ్మ
హత్యా సమానిచ
తాని తాని వినశ్యంతి
ప్రదిక్షిణ పదే పదే”
అని అనుసంధానము (చెప్పుకొనుచూ)
చేస్తూ మూడు పర్యాయములు, తన చుట్టూ, తను
తిరుగుచూ నమస్కరించాలి.
“మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర!
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అపరాధ సహస్రాణి క్రియoతే అహర్నిశం మయా
దాసోయo ఇతి మాం మత్వాక్షమస్వ పురుషోత్తమ!!”
అని నమస్కారము చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించవలయును.
తీర్థము తీసుకొను నపుడు
“అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి
నివారణం సమస్త పాప
క్షయ కరo శ్రీ భగవత్ పాదోదకం పావనం శుభమ్”
అని మూడుపర్యాయములు చెప్పుకొనుచూ
తీర్థము స్వీకరించవలయును.
తీర్థము తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై
తుడుచుకొనుటగానీ, తలపై త్రిప్పుటగానీ చేయరాదు.
శాంతి మంత్రము
“ఓం ఆసతోమా
సద్గమయ,
ఓం తమసోమా జ్యోతిర్గమయ,
ఓం మృతోర్మా అమృతంగమయ
ఓం సర్వేషాo
స్వస్తిర్భవతు,
ఓం సర్వేషాం మంగళం భవతు,
ఓం లోకాః సమస్తా సుఖినోభవన్తు”.
“ఓం త్ర్యం బకo
యజామాహే, సుగంధి పుష్ఠివర్ధనమ్, ఊర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షియ మామృతాత్, ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం తత్సత్.
వెన్నదొంగ
మనకందరికీ
తెలుసు శ్రీ కృష్ణుడు వెన్నదొంగ అని, నిజంగా శ్రీ కృష్ణుడు
దొంగలించిన వెన్న, ఏమి వెన్న, ఒకసారి
బాగా ఆధ్యాత్మికముగా ఆలోచించండి. ఎవరి ఇళ్ళలో దొంగలించాడు,
నందవ్రజములోని గోపికల, గోపాలుర,
ఇళ్ళలోమాత్రమే దొంగలించాడు. బాహ్యంగాకనిపించే వెన్నా,అంతరంగ మైన
వెన్నా, ఏవెన్న?
మానవ శరీరమనే ఇంటిలో హృదయమనే కడవలో భక్తి, ప్రేమ, పూజ, సాధన, అనే దధిని (పెరుగును) మనసనే కవ్వము వేసి బుద్ధి అనే త్రాటిని మనసనే
కవ్వమునకు చుట్టి భక్తి, ప్రేమ పూజ, సాధన
అనే చేతులతో నిరంతరమూ చెలికితే సంసారము అనే ఆవు నుండి చతుర్విద పురుషార్ధములు అనే సిరలనుండి కోరికలు అనే పాలు (పిండుకొని)
పితికి ప్రేమ అనే పాత్రలో పోసి, సాధన అనే పొయ్యి పై ఉంచి అందులో, అరిషడ్వర్గము లనే కర్రలను (పుల్లలను) ఆ పొయ్యి లో పెట్టి, భక్తి అనే నిప్పు రవ్వలతో అరిషడ్వర్గములనే కర్రలను (పుల్లలను) రగిల్చి, పూజ అనే గాలిని ఊదగా, ఉదగా నిరంతర స్మరణ మంటలు పుట్టి, ఆమంటలతో కోరికలు అనే పాలను కాంచగా, కాంచగా
అవి బాగా కాగి ఆపాలు బాగా పొంగితే, ఆ
పొంగిన పాలను శాంతి అనే ప్రశాంత వాతావరణములో చల్లార్చి విశ్వాసమనే తోడు
(సేమిర) వేయగా, అపుడు జ్ఞానము అనే దధి (పెరుగు) తయారవుతుంది.
అందులో మనసనే కవ్వమునకు, సాధన అనే దారపుపోగులతో తయారుచేసిన, ఏకాగ్రత అనే త్రాటిని చుట్టి, నిరంతర స్మరణ అనే
చేతులతో, జ్ఞానమనే దధిని చిలకగా, చిలకగా
వెన్న అనే ఫలము ముగ్ధ మనోహరంగా, ముద్ద గా తేలుతుంది. సాధకుడు ఆ వెన్నను ఆ ఫలమును,
భగవంతునకు భక్తిగా సంర్పించాలి. ఈ వెన్ననే శ్రీ కృష్ణుడు దొంగిలించి తృప్తీగా
స్వీకరించి వారిని అనుగ్రహించాడు.
యుగములు-వేదములు-ఉపనిషత్తులు-
పురాణములు
కాలము, యుగము రూపములో
తిరుగుచున్నది. కావున పరమేశ్వరుడు, ప్రతియుగములోనూ సకలజీవములకు, రక్షణ
కల్పించుటకు మానవ మనుగడ, సనాతన ధర్మమార్గములో నడిపించడానికి, మానవ జీవోద్దరణకు, మనకొరకు పరమాత్మ,
వేదములను ప్రసాదించాడు.
నాలుగు
యుగములలో అనగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము
ఈ మూడు యుగములలో, భగవంతుడు కరచరణాదులతో మానవులతో, కలసి మెలసి జీవించి, మానవ జాతిని ఉద్ధరించాడు. కానీ కలియుగములో, పరమాత్మ కరచరణాదులతో కనిపించడు. కాబట్టి పరమాత్మ మనకు, వేదములను ప్రసాదించాడు. వేదములే
మనకు ప్రమాణము. అంతకు మించిన ప్రమాణము లేదు.
ఈ వేదములు నాలుగు కానీ మహాభారతము పంచమ వేదముగా
పిలువబడి, వేదములు ఐదుగా విరాజిల్లుచున్నవి. వేదముల నుండి, వేదాంగములు అందుండి ఉపనిషత్తులు,
వేదాంతమునకు, భక్తికి,
వేదములు ప్రారంభస్థానమైతే, వేదాంతమునకు వేదసారములకు ఉపనిషత్తులు చివరి
భాగము.
ఉపనిషత్తులు 108. ఈ ఉపనిషత్తులు ఐదు వేదముల నుండి
వచ్చాయి.
ఋగ్వేదము నుండి 10 ఉపనిషత్తులు
శుక్ల యజుర్వేదము నుండి 19 ఉపనిషత్తులు
కృష్ణ యజుర్వేదము నుండి 32 ఉపనిషత్తులు
సామవేదము నుండి 16 ఉపనిషత్తులు
అధర్వణ వేదము నుండి 31 ఉపనిషత్తులు
మొత్తం 108
ఈ 108 ఉపనిషత్తులలో ప్రధానమైనవి 12 ఉపనిషత్తులు.
1)ఈశోపనిషత్తు 2) కేనోపనిషత్తు 3) కఠోపనిషత్తు 4)
తైతిరీయోపనిషత్తు 5) ఐతరేయోపనిషత్తు 6) ప్రశ్నోపనిషత్తు 7)
ముండకోపనిషత్తు 8) మాండుక్యోపనిషత్తు 9) ఛాందోగ్యోపనిషత్తు 10)
శ్వేతశ్వతరోపనిషత్తు 11)బృహదారణ్యకోపనిషత్తు 12) మహానారాయణకోపనిషత్తు
ఎనిమిది ఉపప్రధానమైన
ఉపనిషత్తులు .
1)
కైవల్యకోపనిషత్తు
2) కౌషితకోపనిషత్తు 3) ఆత్మోపనిషత్తు 4) అమృతబిందోపనిషత్తు 5) బ్రహ్మోపనిషత్తు 6)
పరమహంసొపనిషత్తు 7) సర్వోపనిషత్తు 8)
అరుణేయోపనిషత్తు
ఈ ఉపనిషత్తుల నుండి అష్టాదశ పురాణములు వచ్చాయి. అవీ మన సౌకర్యము కొరకే.
అష్టాదశపురాణములు మూడు భాగములుగా
ఉండి ఒక్కో భాగములలో ఆరు పురాణములు.
బ్రహ్మపురాణములు,
బ్రహ్మతత్వమును గురించి
విష్ణుపురాణములు, విష్ణుతత్వము గురించి
శివపురాణములు, శివతత్వమును గురించి
వివరిస్తూ ఉన్నాయి.
విష్ణుసంబంధపురాణములు-6
1.భాగవత పురాణము:- 18 వేల శ్లోకముల సముదాయము.
2.విష్ణుపురాణము:-
23 వేల శ్లోకములతో విష్ణు భక్తుల గురించి, వర్ణాశ్రమధర్మములను, వేదముల యొక్క ఆరు అంగములను,
కలిపురుషుని లక్షణాలను, శ్వేతా వరాహ కల్పముల విషయములను తెలియచేయుచున్నది.
3.నారదీయపురాణము:- 25 వేల శ్లోకములతో వేదాంత ముఖ్యమైన విషయములను, వేదాంత
సారములను, పూరీ జగన్నాథుడు,ద్వారకానాథుడు, బదరీనాథుల గురించి తెలియచేయుచున్నది.
4.పద్మపురాణము:- 55 వేల శ్లోకములతో భాగవత, రామాయణ, జగన్నాథ, మత్య్సావతార, భృగు మొదలగు విషయముల గురించి తెలియజేయుచున్నది.
5. గరుడపురాణము:- 19 వేల
శ్లోకములతో భగవద్గీత, జనన మరణ, విష్ణు సహస్రనామముల గురించి తెలియజేయుచున్నది.
6.వరాహపురాణము:- 24 వేల శ్లోకములతో కూడిన వ్రతరాజముల
గురించి విష్ణు మహిమల గురించి తెలియజేయు చున్నది.
II.బ్రహ్మసంబంధపురాణములు-6
1.బ్రహ్మానందపురాణము:- 12 వేల శ్లోకములతో వేదముల గురించి ఆదికల్పమును గురించి
తెలియజేయుచున్నది.
2.బ్రహ్మవైవర్తపురాణము:- 18 వేల శ్లోకములతో రాధా కృష్ణుల
గురించి తెలియజేయుచున్నది.
3.మార్కండేయ పురాణము:- 9 వేల శ్లోకములతో రామ కృష్ణుల
లీలలను గురించి తెలియజేయుచున్నది.
4.భవిష్యపురాణము:- 14500 శ్లోకములతో కృష్ణ భగవానుని
మరియు చైతన్య ప్రభువును
గురించి తెలియజేయు
చున్నది.
5.వామనపురాణము:- 10 వేల శ్లోకములతో త్రివిక్రమ స్వామిని
గురించి తెలియజేయుచున్నది.
6.బ్రహ్మపురాణము:- 10 వేల
శ్లోకములతో దక్ష ప్రజాపతికి, బ్రహ్మదేవుడు వివరించిన, విషయములను గురించి
తెలియజేయుచున్నది.
III.శివసంబంధపురాణములు:-6
1.మత్స్యపురాణము:- 14 వేల శ్లోకములతో దేవాలయ నిర్మాణములు, అందు పాటించవలసిన నియమములు,
వామనావతారము వరాహ కల్పమును గురించి తెలియజేయుచున్నది.
2.కూర్మపురాణము:- 17 వేల శ్లోకములతో లక్ష్మీ కల్పము, ధన్వంతరి, కృష్ణ సూర్య, సంవాదముల గురించి తెలియజేయుచున్నది.
3.లింగ
పురాణము:- 10 వేల శ్లోకములతో గాయత్రి మాత నృసింహ,జగన్నాథ్,
అంబరీషుల గురించి తెలియజేయు చున్నది.
4.శివపురాణము:- 24 వేల శ్లోకములతో ఆరు సంహితలతో రోమర్పుల
గురించి తెలియజేయుచున్నది.
5.స్కందపురాణము:- 81 వేల శ్లోకములతో తారకాసురవధ, సుబ్రహ్మణ్యస్వామి గురించి తెలియజేయుచున్నది.
6.అగ్నిపురాణము:- 15400 శ్లోకములతో సాలగ్రామములను
గురించి వివరముగ
తెలియజేయుచున్నది. మానవ జీవితమును ధర్మమార్గములో నడిపించేవి, నడిపించేందుకు ఆదర్శప్రాయ మైన, ప్రమాణికమైన, గ్రధరాజములు ఇతిహాసములు.
ఇతి-హా-అసం
1.శ్రీ రామాయణము 2.మహాభారతము
మన ముఖ్య ఇతర గ్రంథములు:-
1) మనుస్మృతి 2) అర్థశాస్త్రము 3) ఆగమశాస్త్రము 4) తంత్రశాస్త్రము
5) స్తోత్రములు 6) ధర్మశాస్త్రము 7) దివ్యప్రబంధము
8) తివరము 9) రామచరిత మానస 10) యోగ వాశిష్టము
భక్తి
నవవిధములు:-
శ్రీ
నారద మహర్షులవారు సెలవిచ్చినవి నవవిధ
భక్తి మార్గములు.
1.శ్రవణం 2. కీర్తనం 3. స్మరణం 4. పాద సేవనం 5. అర్చనం 6.వందనం 7 దాస్యం 8. సఖ్యం 9. ఆత్మ నివేదనం
ఇందులో ఒక్కొక్క
భక్తి వలన కొంతమంది భక్తులు తరించారు, ముక్తిని పొందారు. ఏ ఏ
భక్తి వలన ఎవరు ఎలా తరించి ముక్తిని పొందేరో .........చూడండి
1 శ్రవణం .......... :- వలన పరీక్షిత్ మహారాజు
2 కీర్తనం
......... :- వలన శ్రీ శుకుడు, శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ మదాసు, శ్రీ అన్నమయ్య, శ్రీ తులసీ దాస్
3 స్మరణం ........ :- వలన ప్రహ్లాదుడు
4 పాదసేవనం ....:- వలన లక్ష్మీదేవి
5 అర్చనం ........ :- వలన పృధు మహారాజు
6 వందనం ........ :- వలన అక్రూరుడు, గరుత్మంతుడు
7 దాస్యం .........
:- వలన హనుమంతుడు
8 సఖ్యం ..........
:- వలన అర్జునుడు, ఉద్దవుడు,గోపాల
బాలురు
9 ఆత్మనివేదనం :- వలన బలి
చక్రవర్తి
శ్రీ
నారదులవారు చెప్పిన నవవిధ భక్తిమార్గములే కాక
1
మూఢ భక్తి
... :- వలన తిన్నడు
2
కామభక్తి
..... :- వలన గోపికలు
3
భయ భక్తి
.... :- వలన కంసుడు
4
వైర భక్తి
....... :- వలన శిశుపాలుడు
5
సంబంధ
భక్తి.. :- వలన విష్ణు వంశమువారు, గోపాలురు
6
ద్వేష
భక్తి ...... :- వలన హిరణ్యకశిపుడు, జరాసంధుడు
7
ప్రేమ
భక్తి........ :- వలన పాండవులు
8
భక్తితో
భక్తి..... ..:- వలన నారదుడు
9 వాలిన
భక్తి .... :- వలన పోతనామాత్యులు
వీరందరూ భక్తి
మార్గములలో సేవించి తరించినవారే.
నమస్కారములు
నమస్కారములు చాలా విధములు అందులో
సాష్టాంగ నమస్కారము:-
ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ
ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.
“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా,
పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్,
ప్రణామోస్థాంగముచ్యతే”
1కాళ్ళు 2 చేతులు 3 ముక్కు 4
చెవులు 5 ఉదరము 6 కళ్ళు 7 నోరు 8 మనస్సు
ముఖ్యగమనిక:- స్త్రీలు
మాత్రము ఈ సాష్టాంగ
నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీలు కేవలం పంచాంగ
నమస్కారము మాత్రమే చేయాలి.
పంచాంగ నమస్కారము :-
పంచాంగములు 1 అరిచేతులు 2 మోకాళ్లు 3 మోచేతులు 4 పాదములు
5 శిరస్సు.
అభివాద నమస్కారము:-
ప్రవరతోటి చేయు నమస్కారము. అభివాద నమస్కారము నిలబడి
చేయరాదు. పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి.
గురువుగార్లలను, ఆచార్యదేవులను,
వేదపండితులను, నిత్యాగ్నిహోత్రులను,
వయోవృద్దులను, జ్ఞానవృద్దులను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు
వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.
ప్రణిపాతము:- ఆర్తితో చేయు నమస్కారము. నేలమీదపడి నమస్కారము
చేయడము.
“మహృదయ క్షేత్రాలలో భక్తి,
అనే బీజాలను నాటండి. దీనిని మనస్సుఅనే
నీటితో తడపండి. దానికి నాలుగు దిక్కుల సంత్సంగం అనే కంచె వేయండి. దానివలన కామాది,
వికృతరూప, పశువులు రాకుండా ఉంటాయి. మీరీ విధంగా వ్యవహరిస్తే ఆ
బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో శాంతి ఆనందం అనే పంట ఫలాలు మన చేతికి
వస్తుంది.”
ఉపనిషత్తులు అంటే
ఏమిటి?
వేదములు-అపౌరుషేయాలు. అంటే తపస్సు చేయుచున్న ఋషులకు, పరమాత్మ ద్వారా కేవలం, ఉదాత్త,
అనుదాత్త స్వరములతో మాత్రమే వినిపించేవి. వీటికి లిపి లేదు. ఆ వేదములు ఋషుల ద్వారా
మానవాళికి, ఆధ్యాత్మిక ధర్మ సంప్రదాయము లకు ముఖ్య
సూత్రములు. సనాత ధర్మమునకు జీవనాడులు. ఈ వేద వేదాంగముల సారమే ఉపనిషత్తులు.
ఉప-ని-షత్ అంటే
గురువు వద్ద కూర్చొని నేర్చుకోనేది. వీటినే శృతులు అని అంటారు. ఈ
ఉపనిషత్తులు 250 పైనే ఉన్నాయి. కానీ వాటిలో 108 మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 108 లో
కూడా ప్రామాణికమైనవి, ప్రాచీనమైనవి 14 మాత్రమే. ఈ 14 ఉపనిషత్తులకు
పరమేశ్వరుడు, భూలోకానికి దిగి వచ్చి మన కొరకు ఆచార్యుల
రూపాలలో పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు,
పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు,
పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ
శ్రీ రమణ మహర్షులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ సరస్వతీ స్వామి వారు ఇలా
ఎందరో మహానుభా వులు వేదములకు, వేద-వేదాంగములకు,
ఉపనిషత్తులకు భాష్యం చెప్పారు.
14 ఉపనిషత్తులు.
1.
ఋగ్వేదము
:– ఐతరేయ ఉపనిషత్తు, కౌషీతకోపనిషత్తు
2.
కృష్ణయజుర్వేదము:-
తైత్తరీయోపనిషత్తు, కఠఉపనిషత్తు, మైత్రాయనీయోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు
3.
శుక్లయజుర్వేదము:-
ఈశావాశ్యకోపనిషత్తు , బృహదారణ్యకోపనిషత్తు
4. సామవేదము:- ఛాదోగ్య ఉపనిషత్తు, కెనోపనిషత్తు
5. అధర్వణవేదము:- ప్రశ్నోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, కైవల్యోపనిషత్తు
ఈ
ఉపనిషత్తులలో లేనివి ఈ ప్రపంచంలో లేదు. అన్నీ ప్రశ్నలకు, సమాధానాలకు
ఈ వేదాలు ఉపనిషత్తు లు మరియు ఆచార్యులు భాష్యములే ఆధారము. మనిషి తల్లి గర్భ
ప్రవేశము నుండి, మరు భూమికి చేరి మరలా జీవుని పరిస్థితిని, కాలగతిని, అన్నీ ఇందులో నిక్షేపింపబడినాయి.
మనకు(దేహానికి) అనారోగ్యము
చేసినప్పుడు, డాక్టరుగారి
దగ్గరకు వెళ్ళి డాక్టరుచే సూదులు వేయించుకొని డాక్టరుగారు
ఇచ్చిన మందులు వాడుతాము కదా? మరి మన జీవికి
(ఆత్మకు) వచ్చిన అనారోగ్యము(అంటే అరిషడ్వర్గములు బాధించే బాధలు జరా-మరణ
బాధలు) మాటేమిటి? ఈ అనారోగ్యమునకు పూజ, జపము, ధ్యానములే మందులు. ఈ మందుల మోతాదును ఉపయోగించే విధానమును మనకు తెలియచేయు
వైద్యుడే గురువు. ఈ విధముగా గురు ఆజ్ఞ మేరకు మనము ఆ మందులను వాడి, ఆ మందులు మన శరీరంలోని అణువు అణువు నిండి నిమిడీకృత మైతే, ఇక మనలో యున్న ఆత్మకు అనారోగ్యము
లేదు.
మన శరీరంలో 72
వేల నాడుల ఉంటాయి. అందులో 14 నాడులు ముఖ్యమైనవి. 1) పింగళ, 2) ఇడ
3) సుఘమ్న 4) సరస్వతి 5) పూష 6) వరుణ 7) సప్తజిహ్వ 8)యశస్విని 9) అలంబస 10) కుహు
11) విశ్వోధార 12) పయస్విని 13) గాంధార 14) శుంభి. ప్రధాన నాడులు. ఇడ,పింగళ, సుఘమ్న. వీటి మూడింటికి త్రిమూర్తులు
అధినాయకులు. సుఘమ్న నాడికి కుడిప్రక్క సూర్యనాడి, ఎడమ
ప్రక్క చంద్ర నాడి ఉంటాయి. ఈ సూర్య చంద్ర నాడులు కలుపు ప్రదేశమే భ్రూమధ్యము.
ఆజ్ఞాచక్రము:-
సూర్య
చంద్ర నాడులు అంతర్ముఖముగా ప్రయాణించి పాలభాగము మీద అర్థ చంద్రాకృతిలో ఉంటాయి.
అపుడు రెండు కనుబొమల మధ్య ఉన్న భ్రూకుటికి ఆజ్ఞా చక్రమని పేరు. ఈ ఆజ్ఞాచక్రము
నిలబడి తెరుచుకుంటే దివ్యజ్ఞానము ప్రభాసిస్తుంది. దివ్యదృష్టి కలుగుతుంది.
శ్లో || నాస్తిలోభసమో వ్యాధిః | నాస్తి క్రోధసమోరివుః
నాస్థిదారిద్ర్యవత్ దుఃఖం |
నాస్తి జ్ఞానాత్ పరం సుఖమ్ ||
లోభాన్ని మించిన వ్యాధి లేదు,
క్రోధాన్ని మించిన శత్రువులు లేరు, దారిద్యాన్ని మించిన దుఃఖం లేదు, జ్ఞానాన్ని,తృప్తిని మించిన సుఖం లేదు.
పంచీకరణము పంచభూతపంచీకరణము
1.ఆకాశము 2. వాయువు 3.అగ్ని 4. జలము 5. భూమి
1.ఆకాశము :-
ప్రధానముగా తీసుకొని ½ భాగము ఆకాశము,
1/8భాగము వాయువు,1/8 భాగము అగ్ని, 1/8భాగము నీరు, 1/8 భాగము
భూమి.
2.వాయువు :- ప్రధానముగా తీసుకొనినా ½ భాగము వాయువు, 1/8 భాగము ఆకాశము,1/8 భాగము
అగ్ని, 1/8 భాగము నీరు,1/8 భాగము
భూమి.
3.అగ్ని:- ప్రధానముగా తీసుకొన్న భాగము అగ్ని, 1/8 భాగము ఆకాశము, 1/8 భాగము వాయువు, 1/8
భాగము నీరు,1/8 భాగము భూమి.
4.జలమును:- ప్రధానముగా తీసుకొనిన 1/2 భాగము జలము, 1/8 భాగము
ఆకాశము,1/8 భాగము వాయువు, 1/8
భాగము అగ్ని, 1/8 భాగము భూమి.
5. భూమిని:- ప్రధానముగా తీసుకొనిన ½ భాగము భూమి, 1/8 భాగము ఆకాశము, 1/8
భాగము వాయువు, 1/8
భాగము అగ్ని, 1/8 భాగము జలము.
పై విధముగా పంచభూత పంచీకరము జరిపిన ఆభావములు
తెలియవచ్చును.
కావున
1) ఆకాశమునకు శబ్దగుణము కలదు
2) వాయువుకు శబ్ద, స్పర్శ
రెండు గుణములు
3) అగ్ని శబ్ద,స్పర్శ, రూప గుణములను కలిగి ఉంది.
4) జలమునకు శబ్ద, స్పర్శ, రూప, రస
రూపములుంటాయి.
5) భూమికి శబ్ద,స్పర్శ, రూప, రస, గంథములనబడే ఐదు
గుణములుంటాయి. కావున పంచభూతములు ఈ సృష్టిలో,
సృష్టిచే శక్తిని పొంది ఉన్నాయి. కావున ఈ సృష్టి అంతా పంచ భూతాత్మకము.ఈ పంచ
భూతములను ఆధారముగా తీసుకొని ఇరవై అయిదు తత్వములు ఏర్పడ్డాయి వీనినే పంచ వింశతి
తత్వము అంటారు. ఎలాగంటే పంచభూత పంచీకరణము ఆధారంగానే పంచ వింశతి తత్వములు వస్తాయి.
పరబ్రహ్మము నుండి ఏర్పడిన ఈ పంచభూత పంచ వింశతిని జాగ్రత్తగా గమనిస్తే మనిషి మనుగడ
మానవుని నడవడి అర్థమవుతుంది.
1. ఆకాశము ప్రదానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము ఆకాశధార పరబ్రహ్మము.
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా మనసు
మిగిలిన
అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా బుద్ది
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా చిత్తము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా అహంకారము
1. వాయువు ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము ధారంగా ఉదాన వాయువు
మిగిలిన
అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా సమానము
మిగిలిన
అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా వ్యానము
మిగిలిన
అర్థభాగములో 1/8 జలము ఆధారంగా అపానము
మిగిలిన
అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా ప్రాణము
1. అగ్ని ప్రధానమైన రెండు భాగములు చేసిన అందు ½ భాగము అగ్ని చక్షువు
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా
శ్రోత్రము
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా త్వక్కు
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా జిహ్వ
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా ఘ్రాణము
1.
జలము
ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము జలరసము
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా శబ్దము
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా స్పర్శ
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా రూపము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా గంథము.
1.
భూమి
ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము భూమి గుదము.
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా వాక్కు
మిగిలిన
అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా పాణి
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా పాదము
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా గుహ్యము
ఇలా స్థూల దేహము,
సూక్ష్మ దేహము, కారణ శరీరములగుచున్నవి. స్థూల సూక్ష కారణ
శరీరముల పైన పరమాత్మ ఉండును.
సనాతన ధర్మమము
మరియు ధర్మ సూక్ష్మములు.
వేదః అఖిలః
ధర్మమూలమ్.
అహింసా పరమోధర్మహః , ధర్మోరక్షతి రక్షితః
ధర్మము అనగా ఏమి? ఇది
ఎప్పుడు పుట్టినది, ఎప్పటినుండి ఉంది? మనది
సనాతన ధర్మము. సనాతనము అనగా ఎప్పుడు పుట్టినదో ఎలా పుట్టినదో తెలియనిది నాలుగు యుగములకంటే
ముందునుంచి ఉన్నది కావున ఇది సనాతనము.
ఈ విశ్వములో అనగా నాలుగు యుగములలో అందరూ (ఎంతటి వారైనా) పాప పరిహారార్థం
ధర్మపరులై, ధర్మవర్తనములో జీవించువానే ఆశ్రఇస్తారు.
ఎందుకనగా ధర్మాచరణ పరులను, ధర్మాత్ములను దర్శించి వారి దివ్య ఆశీస్సులు పొందుటవలన
మనము చేసిన పాపములు పఠాపంచలైపోతాయి. “ధర్మేణ పాప మపనుదతి” కదా. మరియు
ధర్మమే ఈ జగత్తుకు మూలాధారము. “ధర్మో విశ్వస్య జగతః” అన్నారు. అంటే ఈ
సృష్టి, స్థితి, లయములకు ధర్మమే కారణము ధర్మమే ఆధారము.
పరమోత్కృస్టమైనది ధర్మము ధర్మాన్ని పట్టుకోవడం,
ఆచరించడం అంత సులభముకాదు. ధర్మాని పట్టువదలకుండా పట్టుకొని ఆచరించాలంటే అందుకు
చాలా ఓర్పు, సహనం, ధైర్యము, మనోనిబ్భరము కావలయును. ఎన్నో క్లేశములను,
మనస్తాపాలను ఎదుర్కోవలసి వస్తుంది. కావున ఓర్పు, సహనము
మనోనిబ్భరము లేనివారు ధర్మాచారణ చేయలేరు. అదియునూ కాక ధర్మము తన ఫలములను వెంటనే
ఇవ్వదు. ఎంతో ఓరిమి వహిస్తేకాని ఆ ఫలములు మనకు అందవు. మరియు ఆ అందిన ధర్మ ఫలములు
శాశ్వితములు.
“ధర్మోఏవహతో హన్తి ధర్మోరక్షతి రక్షితః,
తస్మోద్ధర్మన త్యజామి మానోధర్మో హాతోవధీత్.”
యజుర్వేదాంతర్గత, తైత్తరీయ, శిక్షావళ్ళి నుండి.
ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో అనగా మాటలలో కాదు, ధర్మము తెలిసి
ఉండడముకాదు, చేతలలో ధర్మాని జీవితములో ఆచరించి
పట్టువిడవకుండా ధర్మానిపట్టుకొని జీవిస్తారో వారిని సర్వకాలసర్వావస్తలయందు ధర్మము
వారికి అంగరక్షకుడుగా నిలబడి కాపాడుతుంది. ఎవరైతే ధర్మాన్ని తప్పి ధర్మానికి
క్లేశము, హాని కలిగిస్తారో వారిని ధర్మమే నశింపచేస్తుంది. ఇది
వారు వీరు చెప్పినమాట కాదు సాక్షాత్తు వేదమాత వేదములో యజుర్వేదములో, తైత్తరీయోపనిషత్తు లో, శిక్షావళ్ళిలో చెప్పిన వేదప్రమాణము.
ధర్మబద్ధముగా జీవించాలి, వేదప్రమాణము కానీ పనులను, కుకర్మలను చేయరాదు. “కుశయనం,
కుస్త్రీ, కుభోజ్యం వ్రజః” దుష్టమైన చోట నిదురించరాదు, దుష్టస్త్రీ సాంగత్యము చేయరాదు, దుష్టాహారము తినరాదు.
వీటివలన మరణము అనారోగ్యము కలుగును.
ధర్మయుతముకాని, వేదమంగీకరించని సంపాదన, సుఖము,
సంతోషము, భోగము, విద్యలు నిరుపయోగములు. నిరుపయోగమేకాక వాటివలన
వచ్చు ఆ తాత్కాలిక సుఖము, భోగము, సంతోషము,
సంపాదనల పాపము కలుగడమేకాక వీటివలన జీవితము నరకప్రాయమౌతుంది. ఆ పాపము మనలను
మాత్రమేకాక మన వంశాన్ని (వంశములో ముందు తరాలవారిని వెనుక రాబోవు వంశోద్ధారకులను)
కట్టి కుదుపుతుంది. కావున
“శ్రోత్రత్వక్కు
చక్షురవ్సు జిహ్వఘ్రాణ జ్ఞానేంద్రియాణి,
వాక్పాణి పాదయూ పస్థాఖ్యాని కర్మేంద్రియాణి”
ఐదుజ్ఞానేంద్రియములు, ఐదుకర్మేంద్రియములు, ఐదుప్రాణములు, ఒక మనస్సు, ఒక బుద్ధి వీటితో నడచుచున్న ఈ ఉపాధిని చాలాజాగ్రత్తగా
సర్వకాల సర్వావస్తలయందు అనగా ధన సంపాదనను,
వాక్కును, కర్మను (చేసే పనులు) మనసును,
చూపులను, వాసనలను ధర్మమార్గములో ఉండునట్లు జీవించే విధముగా
మలచుకోవాలి. ఈ విధముగా వేదప్రోక్తముగా, పరమాత్మ మెచ్చుకొను
విధముగా జీవించే జీవితము ధన్యము.
పంచమవేదమని పిలువబడే మహాభారతములో శౌనకుడు ధర్మరాజుతో ధర్మము గురించిన
ధర్మవిచారము ఏమనగా విషయవాంఛలచేత రాగము, దానిచే కామము, దానిచే తృష్ణ, దానిచే సర్వపాపములు కలుగును. అర్థమే (డబ్బు)
అన్ని అనర్ధములకూ మూలము. అర్ధము వలన లోభ, మోహ, మద, మాత్సర్య, గర్వ
గుణములు వృద్ధి చెందును. ఈ ధనాశచే ధర్మమునకు హాని తలపోయును. కావున ధర్మవిదితమైన
ధనసంపాదనే యోగ్యము శ్రేయోదాయకము.
మహాభారతములో లోశమ మహర్షులవారు ధర్మరాజుతో ధర్మాధర్మ విషయములను ఈ విధముగా
నుడివిరి. అధర్మపరులకు అభివృద్ధి నేనువెంటనే కలుగును. కానీ అది క్షణికము.
అధర్మమును ఆశ్రఇంచినవాడు దుష్ట బుద్ధితో ఎదుటవారిని గోతిలో పడవేయడానికి ఒక పెద్ద
గొయ్యి తీసి ఉంచుతాడు. కానీ ఆ గోతిలో తానే పడి విలవిలలాడుతాడు. అధర్మము వలన ధనము,(అధికారము), దానివలన దర్పము, స్వాభిమానము, దానివలన క్రోధము, దానివలన కలిగిన గర్వముతో విచక్షణా హీనులై, లజ్జాహీనులై శీలమును కోల్పోతారు. ఎప్పుడైతే శీలమును కోల్పోతారో అపుడు
లక్ష్మీదేవి వారిని వీడి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడముతో ధైర్యము
వెళ్లిపోతుంది. అందువలన సర్వమూ కోల్పోయి అష్ట దరిద్రు లవుతారు.
మరి
ధర్మమును నమ్ముకొని ధర్మాచారరణతో జీవించువారు ఎన్నో కష్టాలను, అవమానములను, మనస్తాపము లను ఎదుర్కొని వాటిని భరిస్తారో వారు
అధర్మ పరులకంటే వేయి రెట్లు సుఖ సంతోషములను పొందుతారు. అలా పొందిన సుఖ సంతోషములు
శాశ్వితమైనవి.
మార్కండేయ మహర్షులవారు ధర్మరాజుతో యుగధర్మములను గురించి ఈ విధముగా
వివరించారు. కృత యుగములో ధర్మము నాలుగు పాదములతోనూ,
త్రేతాయుగములో ధర్మము మూడు పాదములతోనూ, ద్వాపరయుగ ములో ధర్మము
రెండు పాదములతోనూ, కలియుగములో ధర్మము ఒంటి పాదముతోనూ వర్తించును.
మరియు కొన్ని కలియుగ లక్షణములను ఈ విధముగా వివరించారు. ఆవు పాలు తరిగి శంకరజాతి
పాడి పెరుగును. నవరసముల రుచి తగ్గును. జలచరములు భోగ్య, భోజ్య
వస్తువులగును. ధనము కొరకు విప్రులు శూద్ర సేవలతో, వేదపఠనము
మరచి సంద్యావందనము, నిత్యపూజాది క్రతువులకు తిలోదకాలిచ్చి
మదోన్మత్తులై మధుపానము, మాంస భక్షణము,
వేదవిక్రయము, చేయుచుందురు. భ్రూణహత్యలు, స్త్రీ పతనం, వేదధూషణం, కపటవ్యాపారములు
ఇత్యాది అకృత్యములు చేయుటలో ఉత్సాహవంతులై వర్ణాశ్రమ వ్యవస్థను పూర్తిగా పతనము
చేయుచుందురు.
కృతయుగమున తపముచేత, త్రేతాయుగమున యజ్ఞయాగాదులచేత, ద్వాపరయుగమున కర్మచేత, కలియుగమున కేవలము భాగవన్నామ జపముచేత మరియు
వేదప్రోక్తమైన ధర్మాచరణముచేత ముక్తి పొందగలరని సెలవిచ్చారు.
మృత్యువు
ఎక్కడ ఉంది?
సర్వకాల
సర్వావస్థలయందు ముక్కు చివరన ఉంటుంది. ఎలాగంటే శ్వాస తీసిన తరువాత విడవక పోతే
మృత్యువు. విడిచిన శ్వాస తీయక పోయినా మృత్యువు.
1.
శరీరము ఎక్కడనుండి వచ్చినది?
ఈ శరీరము పంచ భూతముల నుండి వచ్చినది. మరలా పంచ భూతములలో
కలిసిపోతుంది. మనలోని పంచ భూతములు తిరిగి పంచ భూతములలో కలిసిపోతాయి.
“పురత్రయే క్రీడతి
జీవయo తః” కైవల్యోపనిషత్తు.
త్రికూటములు.
1. స్థూల, 2. సూక్ష్మ 3. కారణ
1. స్థూల శరీరము:- జాగృత్- నిద్రలలో స్థూల శరీరముఉండును.
2. సూక్ష్మ శరీరము:- నిద్ర,
నిద్రలోని స్వప్నము లో ఉంటుంది.
3. కారణ శరీరము :- సుఘప్తి, నిద్రలో ఉంటుంది.
ఈ ఉపాదిలోని జీవుడు జీవితకాలమంతా ఇందులో ఈ మూడింటిలో తిరుగుచుంటాడు.
సాక్షి చిత్రగుప్తుడు ఎవరు?
ఈ
ఉపాదిలో గుప్తంగా కూర్చొని చిత్రంగా లెక్కలు వ్రాయువాడు పంచేంద్రియములు తమ పని తాము చేస్తున్నా, చేయలేక పోయినా అవి పనిచేస్తాయి, పని చేయలేవు అని చూచే
ఆత్మ సాక్షి, లోపల నున్న జీవుడు.
1.
అనుభవములు
రెండు.
1.సుఖము 2. దుఃఖము మరొకటిలేదు.
మనకు ఇష్టపడినది,
నచ్చినది సుఖము, మనకు నచ్చనిది బాధకలిగించేది దుఃఖము మరొకటిలేదు.
1. గుణములు మూడు.
1. సత్యము 2. రజస్సు 3.
తమస్సు
2. చతుర్విద పురుషార్థములు.
1. ధర్మము 2. అర్థము 3.
కామము 4.మోక్షము
3. తన్మాత్రులు ఏవి?
1. శబ్దము 2.స్పర్శ 3. రసము 4.రూపము 5. గంథము
4. ఉపాధి (శరీరము)
పంచేంద్రియములు + ఒక మనస్సు =మానవ
ఉపాధి
(పంచేంద్రియములు + మనస్సు ఈ ఆరింటి సంఘతామే ఉపాధి)
సప్తధాతువులు
1)చర్మము 2)రక్తము 3)మాంసము 4)క్రొవ్వు 5)అస్థి 6)శుక్ల
7)మేధ
తొమ్మిదిరంధ్రములు
1)రెండు కళ్ళు ........................2
2) రెండు చెవులు ...................2
3)ముక్కుకు రెండు రంధ్రాలు......2
4)నోరు
.................................1
5)మలద్వారము......................1
6)మూత్రద్వారము....................1
మొత్తము 9
పది
వాయువులు
1)ప్రాణ 2)అపాన 3)వ్యాన 4)ఉదాన 5)సమాన 6)నాగ 7)కూర్మ
8)కృకర 9)ధనంజయ 10)దేవదత్త
ఇందులో
ఈ వ్యాన వాయువు మాత్రం వెళ్ళదు. మరణించిన
తర్వాత ఈ వ్యాన వాయువు శరీరమును పట్టుకొని ఉంటుంది. అపుడు తనూభవుడు (కుమారుడు) అంత్యేష్టి
సంస్కారముతో మంత్ర బద్ధముగా ఈ వాయువును మరణించిన శరీరం నుండి విడగొట్టుతాడు.
భగవంతుని పూజ విషయంలో మనస్సుతో కలువని పంచేంద్రియము+కర్మేంద్రియములు
చేయు పనులు నిష్ప్రయోజనం.
దేహాభిమానము, అహము తగ్గనిదే భగవంతుని
చూడలేవు. మానవ జాతికి ధర్మ పథాన్ని నిర్దేశించడానికి యోగ్యమైన రీతిలో మహాభారతమును
అనుగ్రహించిన వ్యాసుల వారి ధర్మ విషయములు.
ధర్మనిరతుడు:-
ఉదయ సమయంలో దాన ధర్మాలు చేయువాడు.
మధ్యాహ్న సమయంలో డబ్బు సంపాదించే మార్గములు
అన్వేషించువాడు.
రాత్రి వేళలో సాంసారిక జీవితము
సాగించేవాడు.
కేవలం ఇంద్రియ సుఖాల ఆలోచన వలననే విచారం ఆరంభమవుతుంది.
ఇంద్రియ వాంఛలు తీర్చుకొనడానికి శ్రమించే వారికి దుఃఖమే
ప్రాప్తిస్తుంది. పాపాలకు అవకాశం కల్పిస్తుంది. నరకానికి పీటలు వేసి సర్వ
నాశనానికి దారి తీస్తుంది.
ఈ
భూమండలం అంతా మనకు స్వాధీనమైనా జనన మరణాలు నుండి తప్పించుకోగలమా? కోటీశ్వరులు, బిలీనియర్స్ ICU లో
ఉంటే మనమంతా ఎంత వారుగాని చివరకు ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా,
ప్రసిడెంట్ ఆఫ్ చైనా, ప్రసిడెంట్ ఆఫ్ USA ఐనా ఎవరినైనా సరే
ICU లో ఉంచితే మనము బయట(అద్దాలు బయట)నిలబడి I See You అంటూ చూస్తూ ఉండాలే కానీ ఏమి చేయలేము.
అన్నింటి కంటే
ధర్మం సర్వశ్రేష్టమయినది.
ధర్మం
అన్నివేళలా ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఈ ధర్మ విషయంలో గొప్ప గొప్ప
మేధావులు జ్ఞానులు తబ్బిబ్బులు పడుతుంటారు.
ఉదా:- ఒక ఇంటి యజమాని తన భార్యతో సంభాషించేటపుడు భర్త
ధర్మము. అదే కుమారునితో ఉన్నప్పుడు తండ్రి ధర్మము,
సోదరునితో ఉన్నప్పుడు సోదర ధర్మమము, తండ్రితో సంభాషించేటప్పుడు కుమార(పుత్ర) ధర్మం.
స్నేహితునితో ఉన్నప్పుడు స్నేహధర్మం, కార్యాలయానికి వెళ్ళి
పని చేయుచున్నప్పుడు ఉద్యోగ ధర్మం. ఇంటికి ఎవరైనా అతిథులు,
పూజనీయులు, జ్ఞానులు వచ్చినప్పుడు గృహస్తాశ్రమధర్మం.
వానప్రస్థాశ్రమం స్వీకరిస్తే వానప్రస్తధర్మం. అలా ధర్మం అనేది దేశ కాల
పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది.
భారత
యుద్దములో అశ్వద్ధామ ఉపపాండవులను నిద్ర
పోతుండగా సంహరిస్తాడు. అపుడు అర్జునుడు వెళ్ళి అశ్వద్ధామను బంధించి, తీసుకొనివచ్చి ద్రౌపతికి అప్పగించినప్పుడు, తల్లి
ద్రౌపతి ఏమంటుందో చూడండి, కడుపుకోతలో,
పుత్రశోకముతో, విలవిల లాడుచున్న ద్రౌపతి, తన పుత్రశోకమునకు కారకుడైన అశ్వద్ధామను చూచి,
గురుపుత్రా, విప్రోత్తమా, మీరు
పాండవుల గురుపుత్రులు, పాండవులు వారి పరమ పూజ్య గురువుగారిని మీలో
చూచు కొనుచున్నారు. నాబిడ్డలు ఉపపాండవులు
“ఉద్రేకంబునరారు,
శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించిత్ ద్రోమున్
సేయరు, నిద్రాసక్తుల చిన్నిపాపల సంహరింప నకటా
నీచేతులెట్లాడేనో.”
ఉపపాండవులు చిన్ని పాపలు, నిద్రపోవుచున్న వారిని చంపడానికి, మీకు
చేతులు ఎలావచ్చాయి.. నిన్ను బంధించిన వాడు అర్జునుడని, ఆసాద్ధ్వీమతల్లి
గురుపత్ని ఎంత భయపడుచున్నారో, పుత్రశోకము, ఎలాంటిదో, ఎలాఉంటుందో నేను అనుభవించుచున్నాను, ఆ
పుత్రశోకము గురుపత్నికి కలుగకూడదని,
ఆ సాద్వీమతల్లిది ఎంత ధర్మవర్తనో
చూడండి,
“ఒరులే యవి యొనరించిన నరవర, అప్రియము తనమనంబునకగు,
తా నొరులకు నవి సేయకునికి పరాయణ పరమధర్మపధములకెల్లన్.”
ప్రవర్తించకుండా ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధకలుగుతుందో,అలాంటి పనులు,
ప్రవర్తన, మనము ఇతరులపట్ల,
చేయకుండా ఉండడముకంటే గొప్పధర్మము వేరొకటిలేదు. అని ధర్మవిషయము లను వివరించి, అశ్వద్దామను తీసుకెళ్ళి గురుపత్నికి అప్పగించమని పాండవులను శ్రీ కృష్ణుని
ప్రార్తిస్తుంది. చూచార అంతటిబాధలో అంతటి కడుపుకోత అనుభవించుచూ కూడా ధర్మమే
మాట్లాడింది తల్లి ద్రౌపతీ అమ్మవారు .
శ్రీ
రామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధము చేయునప్పుడు రావణాసురుడు బాగా అలసిపోయాడు, ఆ సమయానికి యుద్ధవిరామ సమయము కూడా కావడముతో, శ్రీ
రాముడు రావణా ఈరోజువెళ్లి రేపురా అని యుద్ధ విరామము ప్రకటన చేస్తాడు శ్రీ
రామచంద్రుడు. ఎందుకనగా, ఈ రాత్రికైన రావణాసురునికి జ్ఞానోదయమైతే
రావణాసురుడు బ్రతికి సీతమ్మ వారిని రాములవారికి అప్పగించి,
శరణార్ది నంటాడేమో అని, శ్రీరామచంద్రులవారు ఒక్క అవకాశమిచ్చాడు. అదే
ధర్మము. తన భార్యను అపహరించిన వానికి కూడా, మారడానికి, తనతప్పును తను తెలుసుకోవడానికి, అవకాశ మిచ్చి ధర్మమునకు నిలబడిన,
మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందు కొరకు రామాయణము,
మహాభారతము, భాగవతము
చదవాలి చదివిచాలి, వినాలి వినిపించాలి మనపిల్లలకు మనవారసత్వ
సంపదగా అందివ్వాలి. ధనము, బంగారము, భూములు
సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవితకాలము శాస్వితముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కానీ
మన సంస్కృతి సంప్రదాయములు సనాతనధర్మములు భగవద్భక్తి ఇంతవరకు ఎవరినీ పాడుచేసిన
ధాకలాలు లేవు.
ఆపద్ధర్మం
ఉంది చూశారూ, జీవితం నడవడం
కష్టమయినప్పుడు, సత్కర్మకు దోషం కలుగకుండా, ఏ పని చేసినా దోషం లేదు. అది ధర్మ విరుద్ధం కాదు. కానీ నిరంతరం
ఆపద్ధర్మాన్ని అనుసరించడం ఆశ్రయించడం కూడదు. ధర్మమార్గమున ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి.
మానవునికి నిద్రరాకపోవడానికి విదురుల వారు నాలుగు కారణములు
చెప్పినారు.
1.బలవంతులతో వైరం తెచ్చుకున్నా,
2.పరుల సంపదను అపహరించినా,
3.పరుల సంపదలను అపహరించాలనుకున్నా, పరుల సంపాదనను, సంపదను చూచి ఈర్ష్య చెందినా,
4.పరస్త్రీని పొందుకోరుకున్నా,
ఈ నాలుగు కారణములు తప్ప నీతి శాస్త్రములో మానవ మాత్రులకు
రాత్రి యందు నిద్రపట్టక పోవడానికి వేరు కారణాలు చూపలేదు.
మూర్ఖుల లక్షణాలు:-
అహంకారం, విద్యాశూన్యత, వివేకహీనత,ఏ పనీ
చేయకనే (శ్రమ పడకుండా) ఫలమాసించుట, దరిద్రంలో మునిగి తేలుతూ ఆకాశానికి నిచ్చెనలు
వేయుట, ఊహలలో జీవించుట,
శత్రువులను స్నేహితులుగా భావించుట, అడుగక పోయినా వచ్చి సలహాలిచ్చుట, ఎల్ల వేళలా ఎదుటివారిలో దోషముల కొరకు వెతుకుట, అకారణ
క్రోధము, కలహములు ప్రోత్సహించుట, విషయ
పరిజ్ఞానములేక భాషించుట, ధర్మాధర్మ విచక్షణ లేకుండుట, పరస్త్రీ వ్యామోహము, నిర్దయ, పరధనాపేక్ష, నిత్యమూ అనృతములు భాషించుట, దైవ దూషణము ఇత్యాది
లక్షణ సంపన్నులు.
మోక్షదాయకములు:-
ధర్మము, నీతి రెండూ ఎప్పుడూ కలిసే నడుస్తుంటాయి.నిరంతరం ఏదో కృషి చేస్తూ, సాత్విక స్వభావముతో సహన శీలతతో, నిశ్చల ధర్మదీక్షతో
ఉండేవారు, ఎప్పుడూ సత్ఫలితాలనే పొందుతారు. వీరినే విద్వాంసులు అని
అంటారు.
నీతి విషయములు
ప్రజా
రక్షణ చేయలేని ప్రభువు, నిరంతరం పరుషంగా భాషించే భార్య, విద్య నేర్పలేని గురువు, వనవాసం మీద ఆసక్తి చూపే వ్యాపారి వీరు ఎందుకు
కొరగారు.
ఆరోగ్యము, ధర్మార్జనతో,
ధర్మముతో కూడిన సంపదలు, అనుకూలవతి ఐన అర్థాంగి,
చెప్పిన మాట వినే తనూభవుడు, జీవన ఉపాధికి పనికి వచ్చే విద్య, చక్కని సలహాలిచ్చే స్నేహితుడు, ప్రపంచ శాంతి నాసించే
శాంతి కాముకులు, పరోపకారాభిలాషులు వీరు సుఖంగా బ్రతుకగలుగుతారు.
సుఖ దుఃఖములు అనుభవించే జీవితం
ఆశాశ్వతమైనదే, శాశ్వతమైనది ధర్మం ఒక్కటే.
“క్షీణే పుణ్యే మర్స్యలోకం విశంతి”
దేవతల యొక్క పుణ్యం ఖర్చు అయిపోతే
వారు కూడా భూమి మీద వచ్చి పడిపోతారు.
రామాయణంలో హనుమ:-
“శతకృతుని వాసేనం నాగరాజస్య మూర్థనీ”
అంటే భూమి మీద ఉన్న మనిషి, సరైన
కర్మానుష్టానము చేసి ధర్మమమును పట్టుకొని ఆచారాన్ని పట్టుకొంటే తాను దేవత కాగలడు .
దేవరాజు (దేవేంద్రుడు) కాగలడు.
శిష్టాచారము:-
వేదము
పరమేశ్వర ప్రోక్తము (అపౌరిషేయము) వేదము భగవంతుని చేత చెప్పబడినది. వేదము చెప్పిన
విధముగా వేద సమ్మతముగా నడచిన, అనుష్టించిన ధర్మమే,
ధర్మము. అంతే కానీ మనకు ఇష్టం వచ్చిన
రీతిలో మనకు అనుకూలంగా చేయడం ధర్మం కాదు.
కాలము రెండు కాళ్ళ మీద నడుస్తుంది.
సంవత్సరము.
రెండు ఆయనము పూర్తి అయితే సంవత్సరము.
1.ఉత్తరాయణము:- పొందవలసిన మార్గము పొందుటకుమంచి కాలము.
2.దక్షిణాయనము:- అనుష్టానములకు సంబందించి అనుకూలమైన కాలము(పవిత్రమైన
కాలము)గణపతి నవరాత్రు లు, శారదా నవరాత్రులు, శ్రావణ
మాసంలో మహాలక్ష్మీ అమ్మవారి సేవలు, నోములు వ్రతాలు అన్నీ ఈ ఆయనములో ఉంటాయి.
3.ఆయనములలో ఋతువులు. ఋతువులలో
మాసములు, మాసమూలలో పక్షములు,
పక్షములలో రోజులు, రోజులో పగలు రాత్రి.
రోజు అనుష్టానములో రాత్రి ఉండదు.
రాత్రి పడుకునే అంత వరకు మాత్రమే అనుష్టానము.
ఆచారము=చరతి=అలాకదులుట. ఈశ్వరుడు
ఎలా చెప్పాడో అలాకాదలాడుట.
“ఆచారవ లభతే ధర్మం”
ఎప్పుడైతే ఆచారాన్ని
పాటిస్తావో అప్పుడు ధర్మం అలవడుతుంది.
ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తావో అపుడు మనకు తెలియకుండానే
భగవంతుని వైపుకు మనము తిరుగుతాము.
ధర్మమము అనగా కాలము+దేశముతో ముడిపడి ఉండేదే ధర్మం.
ధర్మానుష్టానములో ఎప్పుడు కానీ సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో పడుకొనరాదు నిద్రించరాదు. భగవదారాధనకు అనుకూలమైన
కాలము.
ప్రాతః సంధ్య:- సూర్యోదయమునకు 88 నిమిషముల ముందు ఉన్నకాలము.
పరమ యోగ్యమైన కాలము. బ్రహ్మ
ముహూర్తము.
ఉత్తర సంధ్య:- ప్రదోషకాలము. పడమటి సంధ్య వేళలో ఎలా
ఉన్నాపడుకోరాదు. అనారోగ్యముతో ఉన్నా కనీసం
పదినిమిషాలు కూర్చోనాలి.
“వృషీశ్వర యానంబున సంచరించుటది అభావ్యంబయ్యే”
ఉత్తర సంధ్యా సమయములో పరమశివుడు వృషభ వాహనము మీద తిరుగుచుంటాడని ఈ
సమయంలో కేవలం భగవన్నామస్మరణ సంకీర్తన మాత్రమే చేయాలని దితితో కశ్యపుల వారు
చెప్పిరి.
శివకేశవ బేధము:-
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ
విష్ణువే
శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః”
“యధాశివమయో విష్ణురేవం విష్ణుమయ శ్శివః
యధాంతరం నవశ్యామి తధామేస్వ
స్టిరాయుషి”
పగలుకు విష్ణువు, రాత్రికి శివుడు అధినాయకులు.
నిద్రలేవడం:-
నిద్రలేవడం
అంటే ఆత్మ నుండి మనస్సు విడివడింది. మనస్సు నుండి ఇంద్రియాలు బయటకు వస్తాయి.
ఇంద్రియాలు బయటకు రాగానే వాటి పనిని అవి ప్రారంభిస్తాయి. దీపం వెలిగించిన తర్వాత
వెలుతురును ప్రసరింపమని మనము దీపమును అడుగుతామా. అలాగే ఇంద్రియాలు బయటకు రాగానే
వాటి పని అవి ప్రారంభిస్తాయి.
భూమికి ఎందుకు
నమస్కరించాలి.
మనము
ఎన్ని తప్పులు చేసినా, చేయకూడని పనులు చేసినా,
చిన్నతనంలో తల్లి(జన్మనిచ్చిన తల్లి) గోరు ముద్దలు తినిపించి, ఎత్తుకొని, ముద్దాడి,
ప్రేమతో బిడ్డే తన లోకంగా జీవిస్తుంది తల్లి. అలాగే భూమాత మన ఆకలి తీరుస్తోంది.
దాహం తీరుస్తోంది. సకల జీవరాసులకు 84 కోట్ల జీవరాసుల ఆకలి దప్పులు తీర్చుతున్న
తల్లి భూమాత. అలాగే 84 కోట్ల జీవరాసుల మల మూత్రములను భరించి స్వీకరిస్తున్న, మాత భూమాత. మనకు 10 సం|| వయసు వచ్చిన తర్వాత మన తల్లి మన, మల మూత్రములను తీసి శుభ్రం చేస్తుందా? మనకు
ఎంత వయసు వచ్చినా, మన యొక్క, మల
మూత్రములను, తన మీద భరించడమే కాక, వాటి
వలన దుర్గంథము రాకుండా, తద్వారా వ్యాధులు ప్రబలకుండా, దానిని తనలో ఐక్యం చేసుకొని, ఈ జీవ కోటిని, అనంత ప్రేమానురాగములతో కాపాడుచున్న మాత భూమాత. చివరికి మనము మరణించిన
తర్వాత, మనతో పాటు అమ్మ (కన్నతల్లి), నా
వారు నా వారు అని కౌగలించుకొని, మనతో సహజీవనము చేసిన భార్య/ భర్త, బిడ్డలు, స్నేహితులు,
బంధువులు మనతో రాకుండా శ్మాశానములో
ఆగిపోతే, నా బిడ్డ ఇంతకాలం (మరణిచిన మృతదేహము ఎలాంటి జీవనమును
కలిగిఉండినా సరే) జీవించి తనువు చాలించాడు, అని
అవ్యాజమైన ప్రేమతో, తన కడుపులో దాచుకునే తల్లి, భూమాత. కేవలం మనలనే కాదు 84 కోట్ల జీవరాసులను,
ఆదరించే తల్లి, భూమాత. ఇక్కడ ఒక్కక్షణం ఆలోచించండి, భూమాత అలా తన కడుపులో దాచుకోక వదిలేస్తే, ఆ
శరీరాలు కృళ్లి, కృశించి,
దుర్గంధ భూయిష్టమై రకరకాల వ్యాధులు( కలరా/ ప్లేగు/మలేరియా) ప్రబలితే, ఎంత జన నష్టం జరుగుతుందో, ఆలోచించండి. ఏ ఒక్కరు మరణించిన మృతదేహమును ఆ తల్లి కరుణించక, తనలో
కలుపుకొనక పోతే ఈ జనారణ్యములో ఆ మృతదేహమును వదిలేస్తే కలరా/ ప్లేగు/ మలేరియా ప్రబలితే, మిగిలిన జీవరాసులు కూడా భూమి మీద అంతరించి పోవా? అందుకే
భూమిపై కాలు మోపే ముందు ఆ తల్లిని, క్షమాభిక్ష కోరుతూ ప్రార్థించాలి. అలా
ప్రార్థించలేక పోతే మనంత కృతఘ్నులు ఈ
ప్రపంచములో మరొకరు ఉండరు. మిగిలిన జీవరాసుల విషయంలో, వాటికి
జ్ఞానం లేదు, ఆలోచించే శక్తి లేదు. ఆ శక్తి కేవలం, ఈ మానవ ఉపాధికి మాత్రమే ఉంది. అందుకే ఇది పరమో ఉత్కృష్టమైన జన్మ.
సుందరకాండలో
కాంచనలంక అని హనుమాదుల వారు వర్ణించారు. కాంచన లంక అంటే ఈ మానవ ఉపాధి. ఈ శరీరములో సర్వకాలముల యందు గడియారంలో ముళ్ళులాగా
షడూర్ములు. షడ్రిపులు షడ్వికారముల యందు తిరుగుతూ ఉంటాయి.
షడూర్ములు:-ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర(జననము), మరణము.
షడ్రిపులు:-
కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యములు.
షడ్వికారములు:-పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పుచెందినది,
తరిగినది, నశించిపోయేది.
దానము చేసేటప్పుడు తండ్రి, కొడుకును దగ్గర పెట్టుకొని చేయాలి. ఎందుకంటే
అలాంటి దాన గుణము కుమారునికి అలవాటు చేయడం
నేర్పడం కొరకు.
శుశ్రూషలు చేయునప్పుడు, తల్లి, తన కూతురును దగ్గర పెట్టుకొని చేయాలి.ఎందుకంటే శుశ్రూష ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి నేర్పుతూ చేయాలి.
సత్ఫురుష సాంగత్యమంటే అంకుశము ఉన్న మావటి
వంటిది.ఏనుగు(మనము) ఏ మాత్రం మార్గం తప్పినా, మనస్సు
మాట వినక పోయినా మావటి అంకుశముతో ఏనుగు క్షణకాలం ఊరికే ఉండదు. కాలు ఊపడం, తొండమును ఊపడం, ఇలా ఎదోఒకటి చేస్తుంది. అందుకు మావటి ఏనుగును
అంకుశముతో సరిదిద్దుతాడు.
ప్రాసంగిక పుణ్యం:-
పలుమార్లు(తీర్ధయాత్రలను)మననం
చేయడం. మననం అంటే మనస్సుతో ఆయా తీర్ధయాత్రలను దర్శించిన తీర్థాలను దర్శనం చేయడం. ఏకుక్కా (పెంపుడు కుక్క ఐనాసరే) మహాద్వారము దాటి
ఇంటిలోనికి ప్రవేశించరాదు. అలా ప్రవేశిస్తే, ఆ రోజు
సింహాసనము మీద ఆసీనమైయున్న దేవతలు, ఆ రోజు ఆహారము ముట్టరు. అది మహాపరాధము.
అనర్థాలకు హేతువు.
మనము తీసుకొనే ఆహారములో ఆరవ వంతు మనస్సు స్వీకరిస్తుంది. అందు
కొరకు మనము సాధ్యమైనంత వరకు(తప్పనిసరిగా) సాత్వికాహారమే తీసుకొనవలయును.
రామాయణములో
శ్రీ రామ చంద్రులవారు లక్ష్మణ స్వామి వారితో అంటారు. చూడండి రామచంద్రుల వారి ధర్మ
నిరతి. లక్ష్మణ స్వామి దశరథ మహారాజును ఖైదు చేస్తానంటే శ్రీ రామ చంద్రుల వారు
అంటారు.
“నిన్న
పిలిచి రాజ్యం ఇస్తానంటే తండ్రా? ఈ రోజు పిలిచి
రాజ్యం లేదంటే అదే తండ్రి మనకు శత్రువా?”
అని అంటారు. చూశారా ధర్మం. అందుకే “రామో
విగ్రహవా ధర్మః” అని మారీచులు
వారన్నారు. రావణా.... రాముడంటే ఎవరో కాదు
కరచరణాదులతో నడచి వచ్చే ధర్మదేవత.
మిత్రుడు:-
మితము
నుండి ఋతమునకు తీసుకొని వెళ్ళువాడు. నిత్యమూ సర్వకాల సర్వావస్థలయందు మనతో భగవంతుని గురించి (సన్మార్గము) భాషించే వాడు, మనలను ఆ మార్గము వైపు త్రిప్పడానికి,సదా
అభిలషించే వాడు
అపరాధములు 3.
భగవదపరాధము:- పరమాత్మ పట్ల కృతఘ్నుడిగా ఉండడo.
భాగవతాపరాధము:- భాగవతులు, భగవంతుని నమ్ముకొన్న వారి పట్ల చేసే అపరాధాలు.
అసహ్యపరాధము:- గురువుల పట్ల చేయు
అపరాధములు.
పక్షులకు ఆకలి ఎక్కువ
పాములకు కోపం ఎక్కువ
గంధర్వులకు కామం ఎక్కువ
పశువులకు భయం ఎక్కువ
మానవులకు అన్నీ ఎక్కువ.
“ధ్రియాలేనా జానయతి ధర్మం”
తెలిసి
ఉండడం ధర్మం కాదు. ఆచరణములో ధర్మమును పాటించడమే ధర్మం. అనుష్ఠిoచనిది ధర్మం కాదు. కేవలం తెలియడం,
అనుష్ఠించక పోవడం ధర్మం కాదు. ఉదా:- ఇంటిలో అన్నం కుండ నిండుగా ఉంది. పులుసు, చారు, పెరుగు, ఊరగాయ అన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ ఉన్నాయనే తలంపు, మా ఇంటిలో అన్నీ ఉన్నాయని అందరికీ చెప్పుకోవడం వలన, మన ఆకలి తీరదు. మనము కూర్చొని, క్రమాను సారముగ, అన్నము+పులుసు, అన్నము+చారు,
అన్నము+పెరుగు కలిపి భుజిస్తే (తింటే ) ఆకలి తీరుతుంది. అదే విధముగ ధర్మము కూడా, కాలపరిస్థితుల నను సరించి, పద్దతిగా (వేదప్రోక్తముగా) ఆచరిస్తేనే,
ధర్మవర్తనా జీవుడు. పూజ పూజ గదికే పరిమితం కాదు. ధర్మానుష్ఠానమే నిత్య పూజ.
శౌచము:-
బాహ్యశుద్ది, అంతఃశుద్ధి,
అభ్యంతర శౌచము.
ఆచమనము చేయడము
వలన శౌచము తొలగుతుంది.కాళ్ళు, చేతులు, ముఖము
కడుగుకొని ఆచమనము చేయాలి.సన్యాసి, బ్రహ్మచారి భిక్షాటనతో జీవించాలి.
భిక్ష అనగా
వచ్చే పూటకు కొరకు దాచుకోనిది. ఒక్క ఏనుగు వెంట్రుక తప్ప ఈ ప్రపంచంలో దేని
వెంట్రుక పనికి రాదు. ఏనుగు వెంట్రుకను కనురాపుకు, దృష్టి
దోషమునకు, పిల్లలకు, పెద్దలకు, తాయత్తులో మంత్రప్రోక్తముతో బంధించి వాడుతారు. ఆహారం (అన్నం) లో వెంట్రుక
వస్తే తర్వాత ఆ ఆహారం భుజింపరాదు. నది ఒడ్డున కానీ,
పారుచున్న సెలయేరుల ఒడ్డున కానీ, ఆలయ ప్రాంగణములలో కానీ మల, మూత్ర విసర్జన చేయరాదు. అది మహా పాపము. ఆ పాపము మనలను, మన వంశమును కట్టి కుదుపు తుంది.
వేద విభాగము చేసిన వ్యాసుల వారు.
ఋగ్వేదము పయిలుడుకి, యజుర్వేదము- వైశం పాయునికి,
సామవేదం- జైమినీకి, అధర్వణ వేదము-సుమంతునకు ఇచ్చారు.
వేదమునకు శృతి అని పేరు
శృతి అంతే “శృన్వన్ తపః”
చురాక్రమములు. ఆశ్రమ నియమ పాలన చాలా ముఖ్యము.
చెవి కుండలములు సౌభాగ్య వస్తువులు.
చెవులకు ఆభరణములు లేకుండా, ఏస్త్రీ గానీ, తన భర్తకు కనిపించరాదు. ఏదీ లేకపోతే తాటంకములు, ఐనా పెట్టుకొన వలయును. ఏమి లేకుండా భర్తకు కనిపిస్తే భర్తకు ఆయు క్షీణము.
తాటంకములు అంటే తాటాకు ముక్క. తాటి చెట్టు లక్ష్మీ సాధనలో ఒకటి.
మానవుని స్వభావము రజోగుణ, తామోగుణ భూయిష్టమై ఉంటుంది.
స్వభావము జన్మతః వస్తుంది. పూర్వ జన్మ వాసనల ఆధారంగా వస్తుంది. దానిని
అదుపు చేయడం కేవలం సద్గురు సాంగత్యములోనే సాధ్యము.
శిష్య – “శాశితం యోగ్యత శిష్యః”
శౌచము లేకుండా భాగవదానుగ్రహము కలుగదు.
స్నానం:
ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయుట నిషిద్ధం.
పంచభూత స్నానములు:
సంవత్సరమునకు ఒక్కసారి ప్రతి ఒక్కరూ చేయవలసిన స్నానములు ఐదు.
పిండాండము బ్రహ్మాండములో కలసి యుండుట వలననే బ్రతికి యున్నాము.
1.పృథివీ స్నానం: ఉత్తర దిక్కున ఉన్న పుట్ట
మట్టితో చేయు స్నానం.
2.వరుణ స్నానం: నిత్యమూ చేయు స్నానం
3.అగ్ని స్నానం: విభూది తో చేయు స్నానం
4.వాయు స్నానం: గోధూళి వేళ గోధూళిని
వంటికి అలుముకొని చేయు స్నానం (పవిత్ర మైన స్నానం)
5. ఆకాశ స్నానం: ఎండగా ఉండి వర్షం పడినప్పుడు ఆ వర్షంలో స్నానము చేయు
భావనతో తడవడం ఆకాశ స్నానం.
ఈ ఐదు కర్మలయందు భుజము పై ఉత్తరీయము లేకుండా చేయరాదు.
1.స్వాధ్యాయము : వేదము నేర్చుకొనునపుడు (గృహస్తు మాత్రమే)
2.హోమము: హోముమనకు కూర్చున్నపుడు
3.దానము: దానము చేయునపుడు, దానము పుచ్చుకొనేటప్పుడు.
4.భోజనము: త్రికాల భోజన సమయములలో
5.ఆచమనము: ఎప్పుడు ఏసందర్భములో ఆచమనం చేసి దానము చేసినా, అంచులేని వస్త్రము దానము ఈయరాదు, దానముగా పుచ్చుకొన రాదు.
గృహస్తాశ్రమ యజ్ఞములు ఐదు.
1.బ్రహ్మయజ్ఞము:
2.దేవయజ్ఞము:
3.పితృయజ్ఞము:
4.భూతయజ్ఞము:
5.మనుష్యయజ్ఞము:
లక్ష్మీ స్థానములు ఐదు వస్తువులు
1.ఏనుగు
కుంభస్థలము
2.మారేడు దళము
3.సువాసిని యొక్క పాపిట
4. తామర పుష్పము
5.ఆవు వెనుక భాగము
మన ప్రమేయము లేకుండా మన మనస్సును లయింపచేసేది
మూడు.
1.
ఏనుగు
కుంభస్థలము
2.
పూర్ణ
చంద్రబింబము
3.
సముద్రము
స్నానములు 6 వేదము నందు అత్యంత పవిత్రమైన కర్మ.
1.మలాపకర్షణ స్నానము.
2.క్రియాంగ స్నానము.
3.క్రియా స్నానము.
4.కామ్య స్నానము.
5.తీర్ధ స్నానము.
6.నైమిత్తిక స్నానము.
వేడి నీటిలో స్నానం చేయరాదు.
వేడి నీటితో స్నానం చేయువారు కాళ్ళ దగ్గర నుండి ప్రారంభించాలి.
చన్నీటితో స్నానం చేయువారు శిరస్సు నుండి
ప్రారంభించాలి.
పురుషుడు నిత్యం తల స్నానం చేయాలి.
స్త్రీలు నైమిత్తిక స్నానం చేయాలి.
స్నానం అంటే మజ్జనం,నదిలో గానీ, తటాకములో గానీ,
సముద్రంలో కానీ చేయాలి. స్నానం అంటే బక్కెట లో నీరు ముంచి చేయడం కాదు. దేశకాల
పరిస్ధితుల నను సరించి స్నానం చేయాలి. నదీ స్నానం చేయు స్త్రీలు నదికి అభిముఖముగా
నిలబడాలి. నదీ స్నానం చేయు పురుషులు నదీ క్రమము నను సరించి చేయాలి.
ధర్మమునకు నాలుగు పాదములు.
1.తపస్సు
2.సత్యము
3.శౌచము
4.దయ
కలిపురుషుడు
కురుజంగాల దేశములో కాలు మోపి ప్రవేశించాడు. ప్రవేశింపగానే, నాలుగు
పాదములు కలిగిన(ఆవు) ధర్మదేవతను, తన కాలితో తన్నగా,
ధర్మదేవత పడిపోబోయి నిలద్రొక్కుకొని, నిలబడి చూచింది. అపుడు పరీక్షిన్ మహారాజు గారు కలి
పురుషుణ్ణి నిగ్రహింపబోయాడు. అపుడు కలిపురుషుడు ప్రార్థించగా పరీక్షిన్ మహారాజు
గారు దయ దలచి నాలుగు స్థానములలో మాత్రమే నువ్వు ఉండడానికి అనుమతిస్తాను అని నాలుగు
స్థానములు చెప్పాడు. అంత తప్ప మరెక్కడ నీవు కనబడినా నిన్ను నిగ్రహిస్తాను అని
అన్నారు.
పరీక్షిత్తు కలి పురుషుని అనుమతించిన స్థానములు 4
1.మధ్యపానము
2.జూదము
3.స్వేచ్ఛా విహరణ గల స్త్రీలు(వేశ్యాగృహములు)
4.వేట
కలిపురుషుడు పరీక్షిత్తును కోరిన స్థానము-1,అది సువర్ణము
5.సువర్ణము
మహాజ్ఞాని వేద, వేదాంగములను ఔపోసన పట్టి నవాడు, సుభద్రా గర్భములలో
ఉన్నప్పుడే, అశ్వద్ధామచే ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రము
(బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని) నుండి, శ్రీ కృష్ణ భగవానునిచే రక్షణపొంది, భగవానుని తల్లి గర్భములోనే శంఖ, చక్ర, గదాధరుడు, పట్టు పీతాంబరములతో నున్న, శ్రీ కృష్ణ పరమాత్మను దర్శించిన భాగ్యశాలి,
(విష్ణు రాతుడు) పరీక్షిన్మహారాజుగారు. అలాంటి మహానుభావుడు కలిపురుషుని నిగ్రహించక
(సంహరించక) ఎందుకు ఐదు స్థానములను మాత్రము కలిపురుషునకు దానము ఇచ్చాడు.
కలియుగంలో
(కలిపురుషుడు ప్రవేశించాక) ప్రజలు త్రేతాయుగంలో లాగా,
ద్వాపరయుగంలో లాగా, మానవుల మాంస నేత్రములకు, కరచరణాదులతో పరమేశ్వరుడు, యుగకాల మంతా,
అందుబాటులో ఉండడు కాబట్టి, కలియుగ వాసులకు ఒక వరం ఏమనగా, త్రికరణ శుద్దిగా మంచి పనులు, సంకల్పము చేత సంస్కరింప
బడుతారు. మరియు దేవతా కటాక్షము వాక్కుచేత,
దృష్టిచేత, స్పర్శ చేత, రతి
చేత కాదు. అందు కొరకు పరీక్షిన్మహరాజు కలిపురుషుని,
అడుగిడడానికి అంగీకరించారు.
కలిస్థానములు
1. మధ్యపానము వలన శుకపిక, గర్వము ప్రబలుతుంది.
2. జూదము వలన అసత్యము, దొంగతనమూ ఇత్యాదివి ప్రబలుతాయి.
3. స్వేచ్ఛా విహరణ స్త్రీల(వేశ్యా గృహములు) వలన ఉన్మాద కామము, వావి వరుసల భంగము, నిర్భయత్వము
ప్రబలుతాయి.
4. వేట వలన హింస, హింసాప్రవృత్తి,
అధర్మహింస ప్రబలిపోతుంది.
5. సువర్ణము సర్వనాశనముకు ప్రధాన హేతువు. స్వార్థము, అర్థ వ్యామోహము ప్రబలి శతృత్వము అశాంతి
ప్రబలుతుంది.
ఉత్సాహము, ఆనందము, నిద్ర
ఇవి శక్తిస్వరూపాలు వీటిని మాంస నేత్రమునకు చూపలేము.
ఇంద్రియాని బలిష్టాని- ఇంద్రియములను గెలవడం అంత సులభం కాదు.
నిద్రించునప్పుడు
నవరంధ్రముల నుండి, మల మూత్రములు విసర్జింపబడతాయి. వాటిని శుభ్రము
చేయకుండా(స్నానము చేయకుండా) దేవాలయ ప్రదేశము, పూజా
మందిర ప్రవేశము, చేయరాదు. నిషిద్దం. పంచ మహాపాతకములు చేసిన
వారితో స్నేహం చేస్తే, ఆ స్నేహితునికి కూడా పంచ మహాపాతకములను చేసిన, పాపమును వారి ఖాతాలో వేస్తారు.
ఇంద్రియములు పరమాత్మను చేరడానికి సహకరించవు. అవి ఎంతసేపు
దేహాభిమానంతో ఇహలోక సుఖాభిలాషులై ఉంటాయి.
ఐదు జ్ఞానేంద్రియములు+ఐదు కర్మేంద్రీయాములు+మనస్సు కలిపి పరమేశ్వరునకు
నమస్కరించాలి.
రాక్షసత్వము:-
రామాయణంలో సీతా మహాతల్లి లంకలో
అశోకవనంలో అంటారు. “చనిపోదామంటే విషమివ్వరు,
చావనివ్వరు, బ్రతుకుదామంటే తనకు నచ్చిన విధముగ, బ్రతుకనీయరు, వారికి నచ్చిన విధముగ,
బలవంతముగా బ్రతుకమని కోరడం రాక్షసత్వం”
మనస్సును సంస్కరిస్తే ఋషి. సంస్కరింపకపోతే
రాక్షసుడు.
మదజలము
ఇది ఏనుగు(మగ)కు కారుతుంది.
ఆ మదజలము కారుచున్నప్పుడు ఆ ఏనుగు చేష్టలు చాలా భయంకరంగా ఉంటాయి. ఏనుగు యొక్క
కంటికి, చెవికి మధ్య భాగంలో ఒక రంధ్రం ఉంటుంది. అందులో నుండి మదజలము
కారుతుంది. అపుడు మగ ఏనుగు ఆడ ఏనుగు కొరకు పరుగులు తీస్తుంది.
జీవుడు ఎప్పుడూ మూడు కాలములలో తిరుగుచుంటాడు
పగలు రాత్రి
భూతకాలము నిద్ర
భవిష్యత్ కాలము జాగృత్
వర్తమాన కాలము సుషుప్తి
మానవుడు ధనము, బలము, అధికారము ఉన్నప్పుడు
చాలా మంది చుట్టూ చేరుతారు. భాగవతంలో
గజేంద్రుని చుట్టూ చేరిన విధముగ, కాలములో నుండి కర్మఫలము వచ్చి పట్టుకొనిన, అప్పుడు ఒక్క భగవంతుడే దిక్కు. ఎవరూ తోడు ఉండరు సరికదా సహాయము కూడా
చేయడానికి సాహసించరు.
పరిశీలన
మనలోని ఈశ్వరుడు సర్వకాల
సర్వావస్థల యందు మనలో ఉత్పన్నమయ్యే ఆలోచనలను చూస్తుంటాడు. ఆ ఆలోచన క్రియారూపం
దాల్చినా, దాల్చకపోయినా, ఈశ్వరుని దృష్టిలో ఆలోచనే ఒక క్రియ. ఆ ఆలోచన మంచిదైతే అందరూ గర్హిస్తారని
అని మనము అనుకుంటాము. మనయొక్క ఆలోచన
ధర్మబద్దమైతేనే ఈశ్వరుడు దృష్టిలో మంచి స్థానమును పొందుతుంది. ఈశ్వరుని దృష్టిలో
అధర్మబద్దమై, మిగతా ప్రపంచమంతా ఆ ఆలోచనను పొగిడినా, ఒక ఈశ్వరుని దృష్టిలో అపరాధి ఐతే, అది
వృధా నే కాక, పాప పంకిలమవుతుంది.
గృహస్థాశ్రమము:
గృహస్తాశ్రమ ధర్మములో గృహిణిదే
ఇల్లు. ఆ ఇంటిలో గృహస్తు(భర్త) ఉంటాడు. భర్త యొక్క సంపద గృహిణిది మాత్రమే. అది
భర్తది కాదు. అమ్మాయి ఇంటిలో అబ్బాయి ఉంటాడు. అంతే కానీ భర్త ఇంటిలో భార్య ఉండదు.
షష్టిపూర్తి:- అనగా 59 సంవత్సరాలు పూర్తి అయి 60 సంవత్సరాలలోకి రావడం.
మనకు ఉన్నవి 60 సంవత్సరాలు మాత్రమే. ప్రభ
వాది క్షయ నామ సంవత్సరం వరకు. మన సనాతన
ధర్మములో సంవత్సరములు 60. ఒక సంవత్సరంలో పుట్టిన వ్యక్తికి ఆ సంవత్సరమునకు ఒక పేరు
ఉంటుంది. ఉదా:- సర్వజిత్ నామ సంవత్సరము జన్మించిన వారికి, వ్యయ
నామ సంవత్సరంతో 59 సంవత్సరములు పూర్తి అయి, వ్యయ
నామ సంవత్సరం తర్వాత మరలా, సర్వజిత్ నామ సంవత్సరం వస్తుంది కాబట్టి, షష్టి పూర్తి అని, ఆ జనన నామ సంవత్సరమును సంకల్పముగా చెప్పుకొని, చేసుకొని చేయు పండుగ షష్టి పూర్తి.
భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
ఒక సారి స్వామి
వివేకానందుల వారు, వారి గురువుగారైన శ్రీ రామకృష్ణ పరమహంస గారిని
ఈ విధంగా అడిగారు.
ప్ర|| గురువుగారూ నేను భగవంతుని చూడగలనా?
జ|| ఎందుకు చూడలేవు తప్పకుండా చూడగలవు.
ప్ర|| ఎప్పుడు?
జ|| నీలో భగవంతుని పట్ల
పరిపూర్ణ ఆర్తి ఉన్నప్పుడు.
ప్ర|| ఆర్తి అంతే ఏమిటి?
జ|| ఒక మనిషి తలపట్టుకొని నీటిలో ముంచి అలాగే
కొంతసేపు నీటిలో ముంచి, పట్టుకొన్నప్పుడు, ఆ మనిషి
గాలి కోసం(శ్వాస) గిలగిలా కొట్టుకొన్న విధముగా,
తన్నుకొన్న విధముగా, నీవు భగవంతుని చూడాలనే ఆర్తితో గిలగిలా
కొట్టుకొనుచున్నప్పుడు. భగవంతుడు తప్పకుండా కనిపిస్తాడు.
సంసారము ఎక్కడ ఉంటుంది?
సంసారము బయట కాదు హృదయంలో ఉంటుంది. విషయ వాసనలు బంధుప్రీతి, అన్నీ హృదయంలో ఉంటాయి. హృదయంలో ఎంత ఎక్కువ విషయ వాసనలు ఉంటే, భగవంతుడు హృదయములో అంతా ఇరుకుగా ఉంటాడు.
ఉదా:-
ఏమండీ ఏదో ఫలాన వస్తువు కొందాము అందుకు లక్షరూపాయలు అవుతుందట. అంటే వెంటనే
మనము మన బ్యాంకులో అంత డబ్బు ఎక్కడుంది ఉన్నవి 80 వేలే కదా అంటాము. అంటే బ్యాంకు పాసు బుక్కు చూడకుండా ఎప్పుడో 20 రోజుల
క్రితం జరిగిన (విత్ డ్రాయులు/డిపాసిట్) దానిని
గుర్తు పెట్టుకొని, బ్యాంకులో మన అక్కౌంటు బాలన్స్ చెప్పగలిగామంటే,
అర్ధంచేసుకోండి, విషయ వాసనలు ఎక్కడున్నాయి. అదే పూజ చేయాలంటే
పుస్తకం కావాలి పుస్తకంలో చూస్తే గానీ మంత్రాలు తెలియవు భగవంతుని నామాలు తెలియవు.
అవునా?
తన్మాత్రులు ఐదు
శబ్ద, రూప, స్పర్శ, రస, గంథములు
పంచభూతములు:-
పృథివి, ఆపః, తేజో, వాయు, ఆకాశము
లౌల్యం అంటే చూద్దాం, విందాం,
ముట్టుకుందాం, తిందాం, అశోకము, అరవిందము, కూటము, నీలోత్పలము.
భగవత్ పూజలో పంచేంద్రియా విష్కరణము
1.పూజలో దీపం ఎందుకు?
కన్నుకు ప్రతీక దీపం. మనస్సు యొక్క కృతజ్ఞతావిష్కరణ మనకు ఆరాధనలో దీపం
వెలిగించి “సాక్షాత్ దీపం దర్శయామి” అని ప్రార్థన చేస్తాం.
2.పూజలో పుష్పం ఎందుకు?
పుష్పము శబ్దమునకు ప్రతీక. పుష్పంలో శబ్దం ఎలా వస్తుంది? పుష్పము (మకరందము) కొరకు వచ్చే తుమ్మెద ఝుంకారము పుష్పమునకే చెందుతుంది.
ఆ ఝుంకార శబ్దమును గ్రహించేది చెవులు కాబట్టి చెవులకు ప్రతీక పుష్పం. “పుష్పం
సమర్పయామి” అని ప్రార్థన చేస్తాం.
3.పూజలో ఫలాలెందుకు?
ఫలం (పళ్ళు) కు ప్రతీక నాలుక. పరమేశ్వరుడు సాత్వికాహారి కనుక ఫలములను
సమర్పించి పూజా చేస్తాము.
4.పూజలో ధూపము ఎందుకు?
ముక్కుకు ప్రతీక సుధూపం. పరమేశ్వరునకు ధూపము చూపించి “సుధూప మాగ్రాహయామి”
అని ప్రార్థన చేస్తాం.
5.పూజలో గంథం ఎందుకు?
చర్మమునకు ప్రతీక స్పర్శేంద్రియములకు ప్రతీక గ్రంథము.”గాంథాం ధారయామి , గంథం సమర్పయామి” అని ప్రార్థన చేస్తాము.
పంచాయతన పూజ
1.పరమ శివుడు:- పరమ శివుని పూజకు పరమశివ సంబంధమైన సాలగ్రామము నర్మదానది
ఓంకార కుండంలో “బాణలింగం” సాలగ్రామమును పూజ చేయాలి.
2.అమ్మవారు:- అమ్మవారు జ్ఞానప్రసూనాంబికా మాతగా
శ్రీ కాళహస్తి దగ్గర స్వర్ణముఖీ నదిలో అమ్మవారు బంగారు తీగలా ఉంటుంది. “సువర్ణముఖీ సాలగ్రామము”ను పూజ చేయాలి.
3.వినాయకుడు:- వినాయకుడు శోణానదీ
దగ్గర “శోణభద్ర సాలగ్రామము” ను పూజ చేయాలి.
4.విష్ణువు:- విష్ణువు నేపాల్ లో
గండకీ నది వద్ద దొరికే సాలగ్రామము” విష్ణు
సాలగ్రామము” పూజ చేయాలి.
5. సూర్యుడు:- తంజావూరు వద్ద
వల్లమ్మన్న దగ్గర తెల్లగా ఉంటుంది “స్పటిక సాలగ్రామమును” పూజ చేయాలి.
సుబ్రహ్మణ్య స్వరూపం హారతి
పై చెప్పబడిన
ప్రదేశములలో ఆయా మూర్తుల సాలగ్రామములను తెచ్చుకొని,
ప్రతిరోజు ఐదు సాలగ్రామములను, శుభ్రముగా కడిగి బొట్టుపెట్టి, ఎండు మారేడు దళములు, ఎండు తులసి దళములతో,
నామాలతో పూజ చేయాలి. బెల్లం నైవేద్యం చేయాలి. నైవేద్యం అంటే ఏదో పళ్ళు పలహారములు
నివేదించరాదు. మన బాధలను సుఖాలను వినయంతో స్వామి వారికి నివేదించాలి.
వారి వారి ప్రధాన దేవతలను, మధ్యలో ఉంచి మిగిలిన నాలుగు దేవతలను, వారి వారి స్థానములలో ఉంచవలయును.
సూర్యో పాసకులు స్పటిక సాలగ్రామమును మధ్యలో ఉంచాలి.
గణాపత్యము వారు గణపతిని మధ్యలో ఉంచాలి.
శివోపాసకులు శివారాధనకు శివుని మధ్యలో ఉంచాలి.
విష్ణోపాసకులు విష్ణువును మధ్యలో ఉంచాలి.
ఆరోగ్యమునకు- సూర్యుడు
విఘ్నములకు- వినాయకుడు
స్థితికార రక్షణకు- విష్ణువు
జ్ఞానమునకు- శివుడు
కదలికలకు- పరదేవత( అమ్మవారు)
హారతి అగ్నిహోత్రమునకు సుబ్రహ్మణ్యేశ్వరుడు.
ఏ గృహము నందైనా
వయోవృద్దులు, అనారోగ్యవంతులు ఉండి, వారికి
ఇక ప్రాణము పోతుంది, అని అనుకున్నప్పుడు ఇవి ఆ ఇంటి యందు తప్పక
ఉండవలయును.
శాస్త్ర ప్రకరణము ప్రకారం.
1.శివప్రసాదము:- పరమేశ్వరునికి అభిషేకము చేసిన
విభూతి, ప్రత్యేకించి దక్షిణామూర్తికి అభిషేకించిన విభూతి.
(పొడి విభూతి)
2.విష్ణుప్రసాదము:- ఆరబెట్టి పొడిగా ఉన్నటువంటి తులసి.
3.గంగ:- శుద్ద జలము (జల ప్రార్థన చేసిన జలము)
“గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలే ఽ స్మిన్ సన్నిదింకురు||”
అని శ్లోకముతో శుద్దిగావింపబడిన శుద్ద జలము.
ప్రాణోత్కరణము ముందు గోదానము శుభప్రదము
సంస్కారములు
1.గర్భాదానము:- వివాహానంతరము కులగురువు ఇంటి బ్రహ్మగారిచే నిర్ణయింపబడిన
సుముహూర్తములో ప్రజాపత్యర్థం కొరకు చేయు క్రియ.
2.సీమంతోన్నయనము:- భర్త, అడవి పంది ముల్లు తెచ్చి, తలలో మొదటినుండి (సీమంతము)బ్రహ్మరంథ్రము వరకు, పాపిటి
తీసి, జడను పైకి ఎత్తి మేడి ఆకులతో, తోరణము
కట్టుట. గర్భస్తు గృహిణి ఏడవ మాసంలో ఆ
గర్భమును చెణకడానికి(పాడు చేయడానికి)
దుష్ట గ్రహములు గర్భములో ప్రవేశిస్తాయి. వాటి నివారణ కొరకు సీమంతము అంటారు
కానీ అది శాస్త్రములో సీమంతోన్నయనము.
3.పుంసమనము:-అనువంశిక సింహాసనమున (గృహస్తు తన గృహములోని భగవతామూర్తుల) కు
నిత్యార్చనకు తనూభవుడు కావలయునని కోరుట.
4. జాతకర్మ:- పుట్టిన శిశువుకు చేయు కర్మ.
5.నామకరణము:- పుట్టిన శిశువుకు (ఏదో పేర్లున్న
పుస్తకము పట్టుకొని పేర్లు మన ఇష్టానుసారము పెట్టకుండా) ఇంటి బ్రహ్మచే శిశువు
యొక్క జనన కాలమును గణించి తత్ సంబంధమైన పేరు
పెట్టుట.
6.అన్నప్రాశన:- శిశువుకు అన్నము మొదటిసారిగా రుచి చూపించుట.
7.చౌలము:- శిఖ ఉంచడము ( పిలక )
8.ఉపనయనము:- తనూభవుని సంస్కరించి,
మంత్రోపదేశము చేసి, సనాతన ధర్మమార్గములను తెలియజేయుట. ప్రజాపత్య
సంస్కారములు అనెడు నాలుగు సంస్కారములను, పూర్తి చేసి 5ద వది ఐన
సమావర్తనము అని ఒక స్నానమాచరించుట. (దివ్య స్నానము)
9.వివాహము:- గృహస్తాశ్రమ ధర్మ స్వీకారము. గృహస్తాశ్రమ ధర్మములో గృహస్తు కు
పంచమహాయజ్ఞములు పంచ
సంస్కారములు ఉంటాయి.
పంచమహాయజ్ఞాలు
1.బ్రహ్మయజ్ఞము:- వేదము చదువుకోవడం లేదా వేదము అభ్యసించిన, తెలిసిన పండితులకు నమస్కరించడం.
2.దేవయజ్ఞము:- ప్రతిరోజూ ఈశ్వరాధన చేయడం.
3.పితృయజ్ఞము:- తల్లితండ్రులకు తద్దినం పెట్టడం అమావాస్యలనాడు వారికి
తర్పణము వదలడం.
4.భూతయజ్ఞము:- కేవలం గృహస్తులే అన్న పానీయాలు భుజింపకుండా, మిగతా భూతములకు ఆహారము సమర్పించుట.
5.మనుష్యయజ్ఞము:- అతిథి అభ్యాగతులను గృహస్తు,
సాదరముగ, త్రికరణ శుద్దిగా ఆచరించుట.
పాత్రయజ్ఞములు అనేవి 7 యజ్ఞములు
హిరణ్యయజ్ఞములు అనేవి 7 యజ్ఞములు
వాజపేయములు అనేవి 7 యజ్ఞములు
కలిపి మొత్తం 40 సంస్కారములు శాస్త్రము చెప్పినది.
పుత్రులు వారి వివరములు
ఈ దశవిధములుగా
జన్మించిన పుత్రులు, దేవ సంబంధ,
శాస్త్ర సంబంధ కార్యములు చేయుటకు, అర్హులని వేదములు,
ఉపనిషత్తులు చెబుచున్నాయి.
దేవీ భాగవతము నుండి.
1.అంశజుడు :- అగ్ని సాక్షిగా స్వీకరించిన (గృహస్తాశ్రమ ధర్మంలో) భర్తవలన
జన్మించినవాడు.
2.పవిత్రుడు:- గృహస్తుకు పుత్రులు లేనప్పుడు కేవలం స్త్రీలు(ఆడ
సంతానం)మాత్రమే కలిగి ఉన్నప్పుడు, మొదటి కుమార్తెకు పుట్టిన మొదటి కుమారుడు.
(గృహస్తు కన్యాదానము చేసిన మొదటి కుమార్తెకు)
3.క్షేత్రకుడు:- గృహస్తుకు ఏకారణము చేతనైనా సంతాన వంతుడు కాలేక
పోయినప్పుడు, అగ్ని సాక్షిగా స్వీకరించిన భర్త అనుజ్ఞు
ఆదేశము మేరకు మునుల యొక్క ఆహ్వానము మేర సమాజోద్దరణకు జన్మించినవాడు.
4.గోళకుడు:- ఏ కారణము చేతనైనా ఒక స్త్రీ వైధవ్యమును పొంది, మరలా వివాహమాడి నటువంటి స్త్రీలకు జన్మించినవాడు. (వితంతు సంతానము)
5.కుంభకుడు :- ఉపగ్రస్తకు జన్మించినవాడు.
6.మహోధుడు:- వివాహము నాటికే స్త్రీ గర్భము దాల్చియుండి, వివాహానంతరము జన్మించినవాడు.
7.కాణ్వికుడు:- వివాహ పూర్వము కన్నెగా ఉన్నప్పుడు పుట్టినవాడు.
8.క్రీపుడు:- గృహస్తు అర్థము( ధనము) నిచ్చి
కొనబడినవాడు.
9.వనప్రాప్తుడు:- గృహస్తుకు
వనములలో లభించినవాడు.
10. దత్తుడు:- గృహస్తుకు సంతానము లేక ఇక సంతానము
కలుగదని నిర్ణయించుకొన్న తర్వాత, వేరొకరి బిడ్డను
వేదాభిమతముగ శాస్త్ర బద్దముగా, అగ్ని
సాక్షిగా స్వీకరింప బడినవాడు.
ఏది మరణము, మరణము అంటే ఏమిటి.
మరణమంటే
ప్రాణోత్క్రమణము, దేహత్యాగము ఇది బహ్యార్ధము. ఆద్యాత్మికార్ధములో
భగవత్ ధ్యానము, భగవత్ చింతన
చేయని ప్రతి సెకను మరణమే. అంటే మనము రోజుకు ఎన్ని సార్లు మరణిస్తున్నామో, బ్రతుకుతున్నామో కదా? కొంతమంది బ్రతికుండీ మరణిచిన వారితో సమానమే కదా?. బాగా
ఆలోచించండి.
చనిపోయే ముందు
జీవుని స్తితి ఎలా ఉంటుంది
బాల్యది అవాస్తలయందు సుకృత ఫలాలను అనుభవించిన
పిమ్మట వార్ధక్యములో దుష్కృత్యాలకు ఫలంగా ఒకానొక వ్యాధి పుడుతుంది. నరుణ్ణి బలమైన
కాలము ఉడుపువేసుకొని మ్రింగుతుంది. మరణ కాలము దగ్గరపడే టప్పటికి (పాపకర్ములు) హేయత్తమైన బుద్ధి లేకపోవడంతో పుత్రకళాదులచేత
పోషింపబడుచూ, ఈసడించుకొంటూ పెట్టిన అన్నము మొ|| వాటిని సిగ్గువిడచి కుక్కలా తింటుంటారు. మరి రోగి, మందాగ్నితో అల్పాహారుడు, అల్పగతి,
ప్రాణము పోయే సమయానికి వివహిత నేత్రుడు కావడం వలన శ్లేశ్మముచేత బంధించబడిన నాడుల
చేత శ్వాసకోసములచే ఆయాసముతో, కంఠము నుండి గురక ప్రారంభమవుతుంది. బంధువులు
పుత్ర పౌత్రులు పిలిచినా కాలపాశబద్ధుడు కావడం వలన ఆ మరణ సమయములో పలులేక
దిక్కులేనివాడి వలె దిక్కులు చూచుచుంటాడు.
అలాంటి
మానవుడు కుటుంబ వ్యవహారములపై అమితమైన ఇస్ట్టము కలిగి ఉండడము వలన ఇంద్రియ
నిగ్రహమును కోల్పోయి ఉంటాడు. మరణకాలములో నస్టమతుడౌతాడు. మరణ కాలము దగ్గర పడేకొద్దీ
ఇంద్రియ నిగ్రహము లేకపోవడమూ,వివహిత నేత్రుడు కావడమూ,శ్లేశ్మము
వలన నాడులు బంధింపబడదమూ, కాలాపాశములచేత బంధింపబడడమూ, ఇత్యాది కారణములవలన జీవునకు దివ్యదృష్టి కలుగుతుంది, అందువలన ప్రపంచమంతా కరతలామలకమై ఉంటుంది. అందువలన అంత్యకాలములో మనిషి
పలుకలేడు. కళ్ళతో చూడడమెకానీ మాటరాదు. సర్వేంద్రియాలు ఇలా వికలత కావడము వలన
చైతన్యము లుప్తమైపోతుంది.
యమభటులు
సమీపములో నిలబడినపుడు భయబ్రాంతుల వలన మూత్రవిసర్జనము మరియు మలవిసర్జనమూ రెండూ
ఏకకాలం లో జరుగుతాయి. చర్మములోని శ్వేద రంధ్రముల ద్వారా వేపరీతమైన చమటలు వస్తాయి.
యమభటులు సమీపములో నిలబడి ప్రాణాలను ఒక్కొక్క స్తానమునుండి తీయడం ప్రారంభిస్తారు
చివరగా శ్వాస స్తానమునుండి జీవుడు చలించిన సమయములో (చివరి ప్రాణము పోవునప్పుడు)
జీవునికి తల్పములాగా ఉండి ఈ శరీరమును వేయి తేళ్ళు ఒక్కసారి కుట్టిన ఎలా ఉంటుందో
అలాంటిబాధను ఈ శరీరం అనుభవిస్తుంది. పాపాత్ముల ప్రాణములు అధో మార్గమునుండి
వెళ్లిపోతాయి.
జీవుడు అంగుష్ట మాత్రమే ఉంటాడు. ఈ స్థూలశరీరము
నుండి హాహా కారములతో వెలువడుతూ యమ బటులు యాతనా దేహాన్ని బంధించి బలాత్కారంగా
కంఠానికి యమపాశాన్ని తగిలించినపుడు జీవుడు ఈ
శరీరము నుండి శ్లేశ్మను వెలువడిస్తూ ఉంటుంది. చొంగ కార్చుకుంటూ ఉంటాడు.
పాపాత్ముల యొక్క ప్రాణవాయువులు అధో మార్గము నుండి వెళ్ళేటప్పుడు మలమూత్ర విసర్జనము
ఒక్కసారిగా బయటకు వెళతాయి.
ఈ శరీరమునుండి జీవుడు విడిపోయేటప్పుడు, ఈ శరీరము చాలా బాధలను అనుభవిస్తుంది. వేయి తేళ్ళు ఒక్కసారిగా ఈ శరీరాన్ని
కుట్టితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధగా ఉంటుంది. అందుకే నృసింహ శతక కర్త శ్రీ
శేషప్ప కవిగారు తన నృసింహ శతకములో
“బ్రతికినన్నాళ్ళు నీ- భజన తప్పనుగాని,
మరణకాలమందు మఱుతునేమో ఆవేళ యమదూత - లాగ్రహంబున వచ్చి, ప్రాణముల్ పెకలించి – పట్టునపుడు, కఫవాత పైత్యముల్ – గప్పగాభ్రమచేత గంపముద్భవమంతి –
కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను – నారాయణ యంచు, బిలుతునో శ్రమచేత బిలువలేనొ!, నాటికిప్పుడే భక్తి నీ – నామ భజన, తలచెదను జెవిని వినవయ్య – ధైర్యముగను, భూషణ వికాస! శ్రీ ధర్మ – పుర నివాస!, దుష్టసంహార! నరసింహ! దురితదూర!”
ప్రాణోత్క్రమణ సమయములో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, గొంతులో నుండి మాటలు రావు కేవలం మననం మాత్రమే
సాధ్యం. ఆ పరిస్థితులలో మనము భాగవన్నామము చేయలేము. కనుకనే ఇప్పటినుండి సాధన నిత్య
పూజ, జపము, తపము అవసరము.
మన
జాతిపిత మహాత్మా గాంధీగారు తనను ఒక ధూర్తుడు తుపాకీటో కాల్చినపుడు “హేరామ్, హేరామ్, హేరామ్”
అనగలిగారు అంటే ఎంతసాధన, ఎంతపూజ, ఎంత
ధర్మవర్తన ఉంటే అది సాధ్యం.
అoత్యేష్ఠి సంస్కారాములు
ఈ మానవ ఉపాధి
పడిపోయిన (మరణించిన) తరువాత జరిగే ప్రక్రియ ఏమిటి? గరుడ
పురాణం దీనిని గురించి ఏమీ చెబుతోoది? ఆ కర్మ తంతు ఎవరు
జరుపవలయును? ఎలా జరుపవలయును?
ఎవరి ఇంటిలో
నైనా వయోవృద్దులు, అనారోగ్యవంతులు ఉండిన ఇక వీరికి ప్రాణోత్క్రమణము అవుతుంది (చనిపోతారు) అని అనిపించినపుడు. ప్రతి గృహస్తు ఈ క్రింది
మూడింటిని తప్పని సరిగా అందుబాటులో ఉంచుకోవల యును.
1.
శివ
ప్రసాదము
2.
విష్ణు
ప్రసాదము
3.
గంగ
శివ ప్రసాదమును, లలాటము యందు,
బ్రహ్మరంధ్రముపైన, అత్యంత శ్రద్ధా భక్తులతో ఉంచవలయును.
విష్ణు ప్రసాదమును నోటిలో వేయవలయును.
గంగా మతాను కొద్ది కొద్దిగా నోటిలో వదల వలయును.
ఈ సమయమున ఇంటి బ్రహ్మకు గానీ, సద్భ్రాహ్మణునకు గానీ, వేద పండితునకు గాని, గోదానము చేసిన అత్యంత శ్రేష్ఠము. అలా గోదానము
చేసి ప్రాణోత్క్రమణము జరిగిన (చనిపోయిన) తరువాత ఆ జీవుని పరదేవత(ఆవు) అనుగ్రహించి తనతో తీసుకుని వెళుతుంది.
జీవుడు శరీరం విడిచి పెట్టినా కొంత మంది దేవతల శరీరము ఆవహించి ఉంటారు.
ఉదా:- అరచేతియందు ఇంద్రుడు, నోటియందు అగ్ని,
కళ్ళయందు సూర్యుడు, చెవులయందు వాయివు ఇలా ఆవహించి ఉంటారు.
ప్రత్యేకించి దశ వాయువులలో ఒకటైన వ్యాన వాయువు శరీరమును ఆవహించి ఉంటుంది. అది
తనూభవుడు చేయు కర్మకొరకు ఉంటుంది.
ఈ ఆవహించి యున్న దేవతలను సమంత్రక హోమము(శాంతి హోమము) చేసిన తరువాత ఈశ్వరునికి సమర్పించాలి.
ఈ
క్రమములో మంత్రము మంత్రశక్తి, చిరునామా లాంటిది. తర్వాత విభూత్యాది
అలంకారములు (శరీరమునకు) చేసి అప్పుడు ప్రేతత్వము నుండి విముక్తి కలిగించాలి. ఈ
సమయంలో జీవుడు దీర్ఘమూర్ఛయందు ఉంటాడు. జీవుడు మరొక దేహము నాశ్రయించడమో లేదా మరొక
జన్మకు వెళ్లడమో లేదా జీవన్మక్తుడు కావడమో,
జరగడానికి కర్త (తూభవుడు) మంత్రము చెప్పి పంపించాలి.
కాలి
వ్రేళ్లను రెండు బ్రోటన వ్రేళ్లను మరియు రెండు చేతుల బ్రోటన వ్రేళ్లను కలిపి గుడ్డ
పేలికతో కానీ, లేదా పంచ/చీర
అంచు తో కానీ కట్టేస్తారు ఎందుకు?
ఈ
దేహాభిమానంతో, బంధుప్రీతితో, సంసార
బంధములతో, సంపాదార్జ నతో, యజ్ఞ
యగాది క్రతువులతో, పురాణ పఠన శ్రావణాలతో,
ప్రవచనా శ్రవణములతో, ఇంత కాలం ఈ దేహాన్ని (శరీరాన్ని) ఆశ్రయించి దేశకాల పరిస్థితులను
బట్టి నిలకడ లేకుండా, తీరికలేక, అలయక, సొలయక ఇంతకాలము తిరిగావు. ఇక ఈ దేహము తిరగదు పడిపోయిందని బట్టలు నీకు
ఉపయోగపడవు అని ఆ బట్టల అంచు పీలికతో కట్టుతారు.
శవ వాహకులు బేసి సంఖ్యలో ఉండాలి.
బ్రతికినంతకాలము
తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో పాపకార్యములు చేసి ఉంటారు,
కాబట్టి గోసంబంధమైన పంచ గవ్య ప్రాసనము చేయిస్తారు. ఆ పంచ గవ్యములను ఒంటి నిండా
అలిమి (అలరి,పూసి) ఆవు నేతిని శరీరము పైన నోటి నిండా పోయాలి.
దీనిని హోమ ప్రక్రియ అంటారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు తెలియని వారు అందరూ దారి బత్యము ఇవ్వాలి. అనగా నామ బియ్యము
అంటారు. పచ్చి బియ్యమును మృతదేహము నోటిలో వేయాలి.
కర్త(
తనూభవుడు) నోరు తెరచి నోటి నిండా( నోటిని) ఆవు నెయ్యితో నింపాలి. అందులో కొద్దిగా
బంగారము ముక్క, వెండి ముక్కను ఉంచాలి. జీవుడు (ఆత్మ) ఈ
ప్రక్రియలు అన్నీ చూస్తూ ఉంటారు. చూచేటప్పుడు ప్రయాణము చేసేటప్పుడు, భైరవయాతనను అనుభవిస్తాడు. చిమ్మ చీకటిలో భయంకరమైన కుక్కలు తరుముతాయి.
అప్పుడు భోరు భోరున విలపిస్తాడు. ఎందుకంటే నేను ఈ ఉపాధిని ఆశ్రయించి ఉన్నంత కాలము, నా వారు, నాది, నా బిడ్డలు, నా భార్య అని ఎంతకాలం వృధాచేశాను. ధనార్జనాతో,
తృప్తిలేని జీవితం, ధనార్జన కోసం రాత్రిబవళ్ళు వేసరక, తిరిగితినే కానీ, ఒక్క నాడైనా భగవంతుని మీద ధ్యాస, భగవన్నామము తెలియని మూర్ఖుడ నైనాను, అని
ఏడుస్తాడు. మనకు ఇప్పుడు తెలియకపోయినా అప్పుడు తప్పకుండా తెలుస్తుంది. తెలిసి కూడా, కళ్ళారా చూచి కూడా ఏమి చేయలేని పరిస్థితి అవుతుంది. మరలా మనకు మానవ జన్మ
దుర్లభము కదా.
ఈ శరీరము
చనిపోయిన తర్వాత:-
1.
చనిపోయినది
మొదలు 10 రోజుల వరకు పుత్రుడు పిండ ప్రదానము చేస్తాడు. ఆ ప్రేత పిండమును నాలుగు భాగములుగా విభజింపబడు తుంది.
అందులో రెండు భాగములు యాతనా శరీర వృద్దికి, మూడవ
భాగం యమదూ తలకు, నాల్గవ భాగమును మరణించిన ప్రేతము భుజిస్తుంది.
2. మరణించిన రోజు మొదలు 9 రోజుల వరకు పెట్టబడే ప్రేతపిండము వలన జీవునికి
చేతడు పిండ దేహం కలుగుతుంది.
3. పదవ నాటి పిండము వలన పిండ దేహానికి బలము కలిగి నడవడానికి శక్తి వస్తుంది.
4. జీవుడు ఆ పిండ దేహముతోనే చేసిన పాప కర్మలకు ఫలితములను అనుభవిస్తాడు.
పిండదేహాభివృద్ధి:-
1. .......మొదటి రోజు ఇచ్చిన పిండము వలన శిరస్సు
2. .......రెండవ రోజు ఇచ్చిన పిండము వలన కంఠము, భుజాలు
3. .......మూడవ రోజు ఇచ్చిన పిండము వలన హృదయం
4. .......నాల్గవ రోజు ఇచ్చిన పిండము వలన పృష్టము
5. .......ఐదవ రోజు ఇచ్చిన పిండము వలన బొడ్డు
6. .......ఆరవ రోజు ఇచ్చిన పిండము వలన మెల , గుహిప్రదేశము
7. .......ఏడవ రోజు ఇచ్చిన పిండము వలన తొడలు
8. .......ఎనిమిదవ రోజు ఇచ్చిన పిండము వలన పిక్కలు
9. .......తొమ్మిదవ రోజు ఇచ్చిన పిండము వలన పాదాలు
10. పదవ రోజు
ఇచ్చిన పిండము వలన ఆకలి, దప్పికలు అలాంటి పిండ దేహాన్ని ఆశ్రయించిన
జీవుడు ఆకలి,
దాహములతో
బాధ పడుచుంటాడు.
11,12
ఏకాదశి, ద్వాదశి దినములయందు కొడుకు చే ఈయబడిన పిండమును
జీవుడు భుజిస్తాడు.
13వ రోజు పాశబద్దుడై కట్టబడిన కోతి వలె యమభటుల వెంట
దుర్గమమైన యమ మార్గములో బయలుదేరుతాడు.
ఆ
తర్వాత పిండదేహముతో జీవుడు భూలోకము నుండి యమ లోకమునకు ప్రయాణము చేస్తాడు. యమ
భటులుతో వారి హింసలను భరిస్తూ ప్రయాణం చేస్తాడు.
భూలోకానికి
యమలోకం 86 ఆమడలు దూరం ఉంటుంది. వైతరణీ నది వైశాల్యము కాకుండా 86 ఆమడల దూరం, ఆ మార్గములో జీవుడు ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజుకు 247 ఆమడల దూరం
నడుస్తాడు.ఆ విధముగా జీవుడు సౌంయపురం చేరుతాడు.
సౌరిపురము, నాగేంద్రభవనము, గంధర్వనగరము,
శైలాగనుపురము, క్రౌంచపురము,
క్రూరపురము, విచిత్రభవనము,
బహ్వపదపురము, దుఃఖపురము,
నానాక్రందపురము, సుతప్తభవనము,
రౌద్రపురము, పయోవర్షణపురము,
సీతాఢ్యపురము, బహుభీతి పురము అనే 16 పురములు 16 పట్టణాలను
దాటి ఏడుస్తూ స్వగృహమును వదలి చిట్ట చివరకు యమపురం చేరుతాడు.
గరుడపురాణము
వ్యవసాయము
పరమేశ్వర
కృపతో ఈ భూమిపైకి వచ్చిన ప్రతి మానవ ఉపాధి, కర్మ
వ్యవసాయం చేయాలి. హృదయమునే క్షేత్రముగా అందులో పూజ,
సంధ్యావందనము, భక్తి, అనే
విత్తనములు చల్లాలి. సాధన అనే పంపుతో మనసు అనే నీటితో ఈ హృదయ భూమిని తడపాలి. ఈ
పొలములో పండిన పంటను కాపాడుకోవటానికి, ఈ పొలానికి “ధర్మో
రక్షతి రక్షితః” కావున ధర్మమము అనే కంచెను నాలుగు వైపులా వేయాలి. అపుడు
అరిషడ్వర్గములనే పశువులు, జంతువులు, వచ్చి
పంట పొలమును,పండిన పంటను పాడు చేయవు. అలా ధర్మమము కాపలాతో
మనము వ్యవసాయము చేస్తే మనకు శాంతి, తృప్తి అనాయాస మరణము, అనే
ఫలాలను అందిస్తాయి. ఈ ఉపాధికి అంతకు మించి వేరే అవసరము లేదు.
సంకలనకర్త, రచయిత, పుష్పగిరి. కులశేఖర్.
ఒక రచయితగా
సంకలన కర్తగా ఈ పుస్తకమును చదివి, ఏ ఒక్కరైనా వేదప్రోక్తమైన సనాతన ధర్మములను
ఆచరించి, నిత్య పూజా విధులను,
నిర్వర్తించి ధర్మాచారణతో ఆ పరమేశ్వర కృపకు పాత్రులైన,
నాసంకల్పము నెరవేరినట్లే.
పేరు
: పుష్పగిరి. కులశేఖర్
జనన తారీఖు : 09.08.1957
జన్మస్తలము :
కొటాల గ్రామము, చంద్రగిరి మండలం,
చిత్తూరు జిల్లా.
తల్లి తండ్రులు : శ్రీమతి పి. పెద్ద రామానుజమ్మ, శ్రీ పి. శ్రీనివాసయ్య గార్లు.
వృత్తి
: తిరుపతి, తపాలా శాఖలో గుమస్తా,
ప్రవృత్తి
: పురాణ పుస్తకములు చదవడం, పూజ్య పాదులైన స్వామీజీల,మఠాధిపతుల అనుగ్రహ భాషణ ములు,
ఆద్యాత్మిక, వేదాంత, పురాణ
ప్రవచనములు వినడం. శాస్త్రీయ సంగీతము
వినడం, సంగీత, సాహిత్యము లనుఆస్వాదించడం.